‘చక్రవాకం’తో తెలుగు సీరియల్కి సరికొత్త నిర్వచనం ఇచ్చారామె. ‘మొగలిరేకులు’తో తెలుగు సీరియల్ హీరోకి స్టార్డమ్ తెచ్చారామె. అద్భుతమైన కథ, అంతకంటే అద్భుతమైన స్క్రీన్ప్లేతో ప్రేక్షకులను స్క్రీన్కు కట్టిపడే స్తున్న ఈ టెలివిజన్ స్టార్ రైటర్ బిందునాయుడు స్పెషల్ ఈ వారం.
కేరళలో మా అమ్మమ్మవాళ్లింట్లో పుట్టినా నేను పెరిగింది మాత్రం హైదరాబాద్లో. అమ్మ సత్యబాయి మలయాళీ. నాన్న ప్రభాకరరావు తెలుగువారు. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. మంజుల పెద్దది. తర్వాత నేను, నా తర్వాత ఓ చెల్లెలు... శారద. అమ్మానాన్నలిద్దరూ మమ్మల్ని ఆడపిల్లల్లా పెంచలేదు. ఇలాగే ఉండాలి, ఇలాంటి చోట్లకే వెళ్లాలి, ఇదే చేయాలి అని షరతులు పెట్టలేదు. కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. నేను చిన్నప్పట్నుంచీ యాక్టివ్. నాయకత్వ లక్షణాలు కూడా కాస్త ఎక్కువే. నా ఫ్రెండ్స్ బ్యాచ్లో అంతా నాకంటే పెద్దవాళ్లే ఉండేవారు. కరాటే కూడా నేర్చుకున్నాను. ఎవరైనా ఏడిపిస్తే కొట్టేసేదాన్ని. ఇంటర్లో అయితే పెద్ద గొడవే జరిగింది. నా చదువంతా బాలికల పాఠశాలలో గడిచింది (సెయింట్ ఫ్రాన్సిస్, హైదరాబాద్).
అలా మొదలైంది!
మొదట్నుంచీ నాకు రచనా వ్యాసంగంపై మక్కువ ఎక్కువే. తరచుగా వ్యాసరచనా పోటీల్లో పాల్గొనేదాన్ని. ఆ ఆసక్తితోనే ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్లో పీజీ చేశాను. అయితే రచయిత్రినవుతానని గానీ, సీరియల్స్కి రాస్తాననిగానీ అస్సలు అనుకోలేదు.
అక్కకి ఇంటర్ అవగానే సుధాకర్నాయుడితో పెళ్లయ్యింది. బావగారు దూరదర్శన్లో పనిచేసేవారు. ఆయన ద్వారానే అక్క, నేను టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాం. మేమిద్దరం మొదట చేసిన సీరియల్ ‘ఆగమనం’. అక్క డెరైక్టర్, నేను రైటర్ అన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. ప్రతి పనినీ ఇద్దరం కలిసి చేసేవాళ్లం. అందులో భాగంగా స్క్రిప్టు చూసి కరెక్షన్స్ చేస్తుండేదాన్ని.
కొన్ని రోజులకు అనిపించింది, నేనూ రాయగలను కదా అని!అయితే, అభిరుచులు ఒకటైనా మంజు ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నేను కాస్త రివల్యూషనరీ టైప్. అప్పట్లో అక్కయ్యది సంప్రదాయబద్ధమైన ఆలోచనా ధోరణి. దాంతో ‘ఆగమనం’ చేస్తున్నప్పుడు ఇద్దరికీ చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. అలాగని అవేం పెద్ద గొడవలు కాదు. ఆలోచనల్లో తేడాల వల్ల వచ్చిన విభేదాలు... అంతే. అందువల్లే నేను కొన్నాళ్లు తనతో కలసి పని చేయలేదు. బయటికి వెళ్లి సొంతంగా కొన్ని ప్రోగ్రాములు, టెలిఫిల్మ్స్ తో పాటు కృష్ణవేణి, ఆనందధార, గాజుపూలు వంటి సీరియల్స్ చేశాను. ఆ గ్యాప్లో నాకు ఓర్పు అలవడింది. ఆ దూరం మా ఇద్దరి మా ఇద్దరి మధ్యా పొర పచ్చాల్ని చెరిపేసింది. మా అనుబంధాన్ని మరింత పటిష్టం చేసింది. దాంతో మళ్లీ ఇద్దరం కలసి పనిచేయడానికి సిద్ధపడ్డాం.
తర్వాత మేం చేసిందే చక్రవాకం. ఈ సారి కథ, స్క్రీన్ప్లే, మాటలు నావే. అక్క డెరైక్టర్, నేను రైటర్ అంటూ బాధ్యతల్ని పంచుకుని బరిలో దిగాం. సీరియల్ అనేది జనానికి ఎంత దగ్గరవుతుందనేది బాగా తెలియజేసిన సీరియల్ చక్రవాకం. ప్రేక్షకులు సీరియల్లోని క్యారెక్టర్లని ఓన్ చేసేసుకుంటారు. ఆ పాత్ర నిజమన్నట్టుగా ఫీలైపోతారు. వాళ్లు మంచి చేస్తే మురిసిపోతారు. చెడుగా ప్రవర్తిస్తే తిట్టుకుంటారు. అంతగా లీనమైపోతారు. చక్రవాకం సమయంలో ఈ విషయం నాకు స్పష్టంగా అర్థమయ్యింది. మొగలి రేకులుకి కూడా అదే ఆదరణ!
నా మనసుకు నచ్చిన పాత్ర!
ఇంతవరకూ నేను సృష్టించిన వాటిలో నాకెంతో ప్రీతిపాత్రమైనది ఆర్కే పాత్ర. అరుదైన వ్యక్తిత్వం కలవాడు ఆర్కే. అలాంటివాడు నిజ జీవితంలో ఎక్కడా దొరకడు. నాకు పోలీస్ పాత్ర చాలా ఇష్టం. పైగా ఓ ఇద్దరు పోలీసాఫీసర్ల గురించి విన్న తర్వాత ఆ ఇష్టం ఇంకా పెరిగింది. వాళ్లిద్దరూ ఎంత సిన్సియర్ అధికారులో, ఎంతగా వృత్తికి అంకితమయ్యారో చదివి, ఆ స్ఫూర్తితో ఆర్కేను సృష్టించాను. ఊహించినదానికంటే గొప్ప ఆదరణ లభించింది. ఆర్కేను నేను అనుకున్నదానికంటే గొప్ప పాత్రను చేశాడు తన నటనతో. తను మంచి నటుడే నాకు, మంచి స్నేహితుడు కూడా! ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అంటూ అన్నింట్లో సహకరిస్తుంటాడు. సపోర్ట ఇస్తుంటాడు. తన పని చేసుకుని చేతులు దులిపేసుకోకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని తాపత్రయ పడతాడు. అది అతనిలో నాకు బాగా నచ్చే విషయం.
ఎవరేమనుకుంటే నాకేం!
చాలామంది అంటూ ఉంటారు- సీరియల్స్ అందరినీ పాడు చేస్తున్నాయని, బాంధవ్యాల మీద చెడు ప్రభావం చూపిస్తున్నాయని. ఎవరైనా అలా అనుకుంటుంటే మా సీరియల్ చూడండని చెబుతాను. నేనెప్పుడూ చెడును పెంచి పోషించేలా రాయలేదు. చూసినవాళ్లు చెడిపోయేలా ప్రేరేపించలేదు. ఎవరైనా అలాంటివి తీస్తున్నారేమో నాకు తెలీదు. నేను మాత్రం అలాంటివి చేయను. ఏ కథ రాసినా, ఏ పాత్రను సృష్టించినా అది సమాజానికి మంచిని బోధించేదిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను.
అర్థం చేసుకుంటారు!
మొదట మావారు (బాలాజీ) అక్క మంజుకి ఫ్రెండ్ కావడంతో తరచూ ఇంటికొస్తుండేవారు. నా డిగ్రీ అయ్యాక ఎంబీయే ఎంట్రన్స్ కోసమని ఆయన కోచింగ్ ఇచ్చారు. తన తెలివితేటలు నన్ను ఆకర్షించాయి. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటిగా తోచాయి. దాంతో మెల్లగా ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాతే నేను జర్నలిజం చేశాను. మాస్ కమ్యూనికేషన్స్ చేస్తున్నప్పుడు బాబు పుట్టాడు.
పొద్దున్న పదింటికి వెళ్లి, సాయంత్రం ఆరింటికి తిరగొచ్చేసే పని కాదు నాది. అడుగు బయటపెట్టాక మళ్లీ ఎప్పటికి ఇంటికి చేరతామో చెప్పలేం. దాంతో మావారితో, పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకదు. కానీ ఏ కాస్త సమయం దొరికినా వాళ్లే ప్రపంచంగా గడుపుతాను. అయినా ఎంత టైమ్ గడిపామన్నది కాదు, ఎంత తృప్తిగా ఆనందంగా గడిపామన్నది ముఖ్యం. పిల్లలు ప్రతి చిన్న విషయాన్నీ నాతో పంచుకుంటారు. సలహాలు తీసుకుంటారు. ఆ మేరకు నేను వాళ్లకు అందుబాటులోనే ఉంటున్నాను. అది చాలు. బాబు అక్షయ్ది ఇంజినీరింగ్ అయిపోయింది. పాప శ్రేయ 12వ తరగతి చదువుతోంది. డాక్టర్ అవ్వాలన్నది తన కోరిక. వాళ్లు సీరియల్స్ చూడరు. కానీ ఇద్దరికీ రైటింగ్ స్కిల్స్ మాత్రం ఉన్నాయి. అలాగని ఈ ఇండస్ట్రీ పట్ల వాళ్లకు ఆసక్తి లేదు. నాక్కూడా వాళ్లు సెలెబ్రిటీ పిల్లలుగా కాకుండా, మామూలుగా పెరగాలని కోరిక. వాళ్లూ అలా ఉండటానికే ఇష్టపడతారు.
తొమ్మిదేళ్లుగా రాస్తూనే ఉన్నా ఎప్పుడూ విసుగనిపించదు. నాకిష్టమైన పని ఇది. అందుకే అందులో ఎంతో తృప్తి! కొంతమంది తమ సీరియల్స్ కి రాయమని అడిగారు. కానీ ఇక్కడున్నంత స్వేచ్ఛ వేరే చోట ఉండదు. అందుకే నో అన్నాను. చాలా కాలంగా చిన్న చిన్న కథలు రాస్తున్నాను. వాటన్నిటికీ ఓ సంకలనంగా తీసుకురావాలనుంది. ఇంతవరకూ అనుకున్నవి అనుకున్నట్టు చేయగలిగాను. ఇది కూడా చేస్తే ఆ కోరిక కూడా తీరిపోతుంది!
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more