నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచానాలు లేకుండా విడుదలైన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. కన్నడ నటుడు యష్కు పాన్ ఇండియా హీరో ఇమేజ్ను తీసుకొచ్చింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే.. భారీ అంచనాలు నెలకొనడం సహజం. అందుకు తగ్గట్టే.. కేజీయఫ్ 2 తీర్చిదిద్టినట్లుగా టీజర్, ట్రైలర్ ని చూపించారు మేకర్స్. ఏకంగా కోట్ల మంది అభిమానులు ఈ ట్రైలర్, టీజర్లను వీక్షించారంటే.. ఈ సినిమా విడుదల కోసం వారు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది.
బహుబలి సీక్వెల్ తర్వాత ఓ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచేసేలా చేసిందంటే అది కేజీయఫ్ 2 అనే చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం అన్ని ఆడ్డంకులను దాటుకుని ఇవాళ విడుదలైంది. కేజీఎఫ్ హిట్ సాధించిన నేపథ్యంలో సీక్వెల్ చిత్రంపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీయఫ్ 2ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు. కేజీయఫ్ 1 కొనసాగింపుగా భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘కేజీఎఫ్-2’. మరి ఆ అంచనాలను అందుకుందా? గరుడను చంపిన తర్వాత రాఖీభాయ్ కేజీయఫ్ను ఎలా సొంతం చేసుకున్నాడు? అధీర, రమికాసేన్, ఇనాయత్ ఖలీలను ఎలా ఎదుర్కొన్నాడు? ప్రశాంత్ నీల్ ఈ కథను ఎలా ముగించాడు? రివ్యూలో చూద్దాం.
ముంబై నుంచి కేజీఎఫ్ (నరాచీ) సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన రాఖీభాయ్ (యశ్) పేరుకి గ్యాంగ్స్టరే కానీ, అక్కడి లక్షల మంది సామాన్య ప్రజలకి దేవుడిగా మారతాడు. వాళ్లంతా రాఖీ సామ్రాజ్యం కోసం ఓ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తారు. నిర్విరామంగా బంగారం నిక్షేపాల్ని వెలికి తీయడం, దాంతో వ్యాపారం చేయడం ఇదే రాఖీ పని. లక్షల మంది సైన్యం, వందల వాహనాలు, హెలికాఫ్టర్లు, ఓడలు రాఖీ సొంతం. శత్రుదుర్బేధ్యమైన కేజీయఫ్ గురించి సీబీఐ ద్వారా ప్రధానమంత్రి రమికాసేన్ (రవీనాటండన్)కి తెలుస్తుంది. దాంతో ఎలాగైనా రాఖీని అంతం చేయాలని రమికా నిర్ణయిస్తుంది.మరోపక్క కొండల్ని సైతం పిండి చేయగల అధీరా (సంజయ్దత్) కేజీయఫ్ను తన సొంతం చేసుకునేందుకు తన సైన్యంతో రంగంలోకి దిగుతాడు. ఒక పక్క ప్రభుత్వంతోనూ, మరోపక్క అధీరాతోనూ రాఖీభాయ్ పోరాటం ఎలా సాగిందన్నదే సినిమా.
విశ్లేషణ
జీరో నుంచి హీరోగా ఎదిగిన రాఖీ పాత్రతో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. గరుడతో సహా ఎంతోమందిని ఓడించి నరాచీలోకి అడుగుపెట్టిన రాఖీభాయ్ తన సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడుకున్నాడు? అసలు అతని గతమేంటి? అనే విషయాలు ఛాప్టర్ 2పై ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా ఆరంభమవుతుంది. ఆనంద్ వాసిరాజు తనయుడు విజయేంద్ర వాసిరాజు ఛాప్టర్ 2 కథని చెప్పడం మొదలు పెడతాడు. నరాచీలో గరుడని చంపాక మిగిలి ఉన్న శత్రువుల్ని రాఖీ ఎలా భయపెట్టాడు? అక్కడ ప్రజలకి ఎంతగా దగ్గరవుతాడనే అంశాలతో కథ మొదలవుతుంది.
తొలి భాగంలో హీరో ఎదిగే క్రమంతోపాటు, ఎలివేషన్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఛాప్టర్- 2లో మాత్రం హీరో ఎలివేషన్స్పైనే దృష్టిపెట్టాడు దర్శకుడు. అవి ఏ స్థాయికి వెళ్లాయంటే రాఖీ నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం మొదలుకొని... పార్లమెంట్లోకి వెళ్లి ఎంపీని కాల్చేసే వరకు! ఈ సన్నివేశాలు మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. దర్శకుడు కేజీయఫ్ ప్రియుల్ని మెప్పించేందుకు ఎంత స్వేచ్ఛని తీసుకోవాలో అంత తీసుకుని సన్నివేశాల్ని మలిచాడు. ప్రతీ సన్నివేశం రిచ్గా, స్టైలిష్గా కనిపిస్తుంటుంది. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని విజువల్స్తో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు మరింత కిక్నిస్తుంది.
కేజీఎఫ్ సామ్రాజ్యంతోపాటు రాఖీ శత్రువుల గురించి ప్రేక్షకులకు ఓ అవగాహన ఏర్పడటం... రెండో భాగంలోని కథలో మలుపులు కూడా పెద్దగా లేకపోవడం సినిమాకి కాస్త మైనస్. అధీరా ఎలా తిరిగొచ్చాడు? ఇంత కాలం ఏమయ్యాడనే అంశాలు మాత్రం ఇందులో ఉండవు. కేజీయఫ్ కోసం చచ్చినవాళ్లు మళ్లీ బతికొస్తారనే ఓ చిన్న డైలాగ్తో ఆ పాత్రకి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, రాఖీ వర్సెస్ అధీరా మధ్య యుద్ధం ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోదు. రాఖీ గతాన్ని, తల్లి సెంటిమెంట్ని చిన్న చిన్న ముక్కలుగా చూపించారు. నాయకానాయికల మధ్య ప్రేమ చిగురించే తీరు మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది. రమికా సేన్కీ, రాఖీకీ మధ్య సన్నివేశాలు సంఘర్షణ బాగుంది. పతాక సన్నివేశాలు కేజీయఫ్ ప్రియులకి మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంటాయి.
నటీనటుల విషాయానికి వస్తే..
సినిమా స్టార్టింగ్లో విలన్లకు సంబంధించిన వ్యక్తి, యశ్ గురించి చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న ఎలుకలను బయటకు తోలడానికి పాముని పంపారు.. ఇప్పుడు అది నల్ల తాచు అయింది’ అని అంటాడు. అంటే హీరో మరింత బలపడ్డాడు అనే అర్థంతో ఆ డైలాగ్ చెబుతాడు. కేజీయఫ్2లో యశ్ నటన కూడా అంతే. మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో మరింత స్టైలీష్గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ..అదరగొట్టేశాడు. రాకీ భాయ్ పాత్రకు యశ్ తప్పితే మరొకరు సెట్ కాలేరు అన్న విధంగా అతని నటన ఉంది. యాక్షన్ సీన్స్లో విశ్వరూపం చూపించాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా మంచి నటనను కనబరిచాడు.
అధీరగా సంజయ్ దత్ ఫెర్పార్మెన్స్ బాగుంది. ఆయన పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఈ సినిమా షూటింగ్కి ముందే సంజయ్ దత్కి కేన్సర్ అని తేలింది. అయినా కూడా ఆయన అధీర పాత్రలో నటించడం అభినందించాల్సిందే. ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రకి రవీనా టాండన్ న్యాయం చేసింది. రావు రమేశ్, ఈశ్వరి భాయ్, ప్రకాశ్ రాజ్తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యత ఉండడం ఈ సినిమా గొప్పదనం.