నవ్వుల కిరీటీ, హాస్య చక్రవర్తి రాజేంద్రప్రసాద్ వారసత్వాన్ని తన భుజాలపై వేసుకుని తెలుగు ప్రేక్షకులను కుడుప్పుబ్బా నవ్వించడమే పనిగా పెట్టుకున్న అల్లరి నరేష్.. కామెడీ హీరోగా రాణిస్తున్న తరుణంలోనే తన నటనకు గుర్తింపును కూడా తెచ్చుకునే పాత్రల్లోనూ నటించిన విషయం తెలిసిందే. తన కెరీర్ మంచి రేంజ్ లో వెళ్తున్న సమయంలోనే ఆయన నేను అనే చిత్రంలో తన నటప్రదర్శను ఇచ్చి ప్రతినాయకుడిగా కూడా నటించిన విషయం తెలిసిందే. గమ్యం, శంబో శివ శంబో తరువాత ఈ మధ్యకాలంలో మహర్షి చిత్రంలోనూ ఆయన నటనా ప్రధానమైన పాత్రలను పోషించారు. కామెడీని ట్రాక్ తో రాణించలేక పోతున్న తరుణంలో తన కెరీర్ ముందుకు సాగేందుకు మంచి కథను ఎంచుకుని నటనకు నాంధి పలికాడు.
కథ
సూర్యప్రకాశ్ (అల్లరి నరేశ్) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. మధ్య తరగతి కుర్రాడు. అమ్మానాన్న, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితుడితో కలసి హాయిగా జీవితం సాగిస్తుంటాడు. మీనాక్షి (నవమి) అనే అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. ఇంతలో న్యాయవాది, మానవ హక్కుల కోసం పోరాడే సామాజిక ఉద్యమకారుడు రాజగోపాల్ (సి.వి.ఎల్.నరసింహారావు)ని హత్య చేశాడనే ఆరోపణతో సూర్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ హత్య కేసులో ఐదేళ్లు జైల్లోనే మగ్గుతాడు. ఇంతకీ ఆ హత్యని సూర్యప్రకాశే చేశాడా? ఐదేళ్ల తర్వాత అతని జీవితంలో ఏం జరిగింది? జూనియర్ లాయర్ ఆద్య (వరలక్ష్మి శరత్కుమార్) సూర్యప్రకాశ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
అక్రమ నేరారోపణతో జైల్లో మగ్గుతున్న ఓ యువకుడి పోరాటమే ఈ చిత్రం. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 211 ఎంత శక్తిమంతమైనదో ఇందులో ఆలోచన రేకెత్తించేలా చెప్పారు. ఒక అమాయకుడి జైలు జీవితం... అతను న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ప్రథమార్ధంలో సూర్యప్రకాష్ జీవితం, ఊహించని రీతిలో జైలు గోడల మధ్యకి చేరడం నేపథ్యంలో సాగుతుంది. ద్వితీయార్ధంలో కోర్ట్ రూమ్ డ్రామా కీలకం. అండర్ ట్రయల్ ఖైదీగా కథానాయకుడిని జైలుకి తీసుకెళ్లడంతోనే సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు, జైల్లో అతని జీవితం గురించి వివరించడంతో అసలు కథ ప్రారంభమవుతుంది.
ఉద్యోగం సంపాదించిన ఓ మధ్య తరగతి కుర్రాడు తన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు త్యాగం చేసిన చిన్న చిన్న ఆనందాల్ని గుర్తు పెట్టుకుని వాటిని తీర్చే సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. భావోద్వేగాలపై అక్కడ్నుంచే పట్టు ప్రదర్శించాడు దర్శకుడు. అంతా హాయిగా.. సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడటం, చేతికందివచ్చిన కొడుకు అన్యాయంగా జైలుపాలు కావడంతో ఆ కుటుంబం పడే బాధని చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. విరామానికి ముందు వచ్చే మలుపు ఈ కథని మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తుంది.
ద్వితీయార్ధంలో కోర్టు రూమ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. సహజంగానే వాటిలో కావాల్సినంత డ్రామా పండింది. బలమైన భావోద్వేగాలు... ఆసక్తిని రేకెత్తించే కథనంతో సినిమా ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఎంచుకున్న అంశం సాధారణమైనదే. కానీ, దాన్ని ఆకట్టుకునే కథనంతో చెప్పడంలో దర్శకుడు తన ప్రతిభని ప్రదర్శించాడు. ఇలాంటి అంశాల్ని స్పృశిస్తున్నప్పుడు ఎంతో పరిశోధన కావాలి. దర్శకుడు ఆ పరిశోధన కావాల్సినంత చేశాడనిపిస్తుంది. అల్లరి నరేశ్ కెరీర్కి ఈ సినిమా ఓ కీలక మలుపు. ఇకపై ఆయన కొత్త అడుగులు వేయడానికి ఇదొక నాంది అవుతుందనడంలో సందేహం లేదు. నటుడిగా నరేశ్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన ఈ చిత్రంలో, ఆయన మేకోవర్ మరో ప్రధాన ఆకర్షణ. ఇలాంటి కథలు బాలీవుడ్లో తరచూ రూపొందుతుంటాయి. తెలుగు సినిమా కథల్లోనూ మార్పునకు ఈ చిత్రం నాంది పలుకుతుంది.
నటీనటుల విషాయానికి వస్తే..
అల్లరి నరేష్ కెరీర్లో ఎన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేశాడు. అతడి కామెడీ ఇమేజ్ సినిమా మొదలైన కాసేపటికే పక్కకు వెళ్లిపోయి సీరియస్ గా ప్రేక్షకులు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుందీ పాత్ర. కామెడీ హీరో అయిన నరేష్ ఈ పాత్రకు సెట్టవ్వలేదు అనిపించకపోవడమే అతను సాధించిన విజయం. పోలీస్ స్టేషన్.. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నింటిలో అతడి నటన హృద్యంగా సాగుతుంది. ఆ పాత్ర పట్ల సానుభూతి వ్యక్తమయ్యేలా చేస్తుంది.
నరేష్ కు కచ్చితంగా పెర్ఫామెన్స్ పరంగా కెరీర్ ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి. హీరో తర్వాత అత్యంత కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ రాణించింది. తమిళ యాస బాగా కలిసిపోయిన ఆమె డబ్బింగ్ ఈ పాత్రకు సూటవ్వలేదు కానీ.. నటన పరంగా ఆకట్టుకుంది. విలన్ పాత్రల్లో హరీష్ ఉత్తమన్.. వినయ్ వర్మ బాగానే చేశారు. హీరో తండ్రిగా దేవీ ప్రసాద్ తక్కువ సన్నివేశాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నాడు. హీరో స్నేహితుడిగా ప్రవీణ్ నటన బాగుంది. ప్రియదర్శి కూడా ఓకే.