రెండు ముక్కలైన రాష్ట్రంలో ఒక దానిలోనైనా ఈసారి ఎన్నికలలో నెగ్గుకొచ్చి అధికారాన్ని చేపడదామని అనుకున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సంకేతాలు వస్తున్నాయని కూడళ్ళలో అనుకుంటున్నారు. ఎన్నికల ఉధృతంగా ఉన్న సమయం కనుక ఎక్కడ చూసినా ఎన్నికల మీదనే చర్చలు జరుగుతున్న సందర్భంలో విశేషంగా వినిపించినవి జగన్ కి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల మీద చర్చలే!
ఒక సంఘటన ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. రెండు రోజుల క్రితం వైకాపా నాయకురాలు శోభా నాగిరెడ్డి ఆకస్మిక మరణం పార్టీని కుదిపేసింది. సీనియర్ నాయకులను పోగొట్టుకోవటం పార్టీకి తీర్చలేని నష్టమౌతుంది. అది అలా ఉండగానే వైయస్ఆర్ ఆత్మగా ప్రకటించుకునే కెవిపి రామచంద్రరావు మీద భారత్ నుంచి కాకుండా అమెరికా ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ నేరం కింద కేసు నమోదైంది. నేరం జరిగింది భారత్ లో అవినీతికే. కానీ దాన్ని జరిపించింది అమెరికా భూభాగం మీద, అమెరికా ఆర్థిక వ్యవస్థనుపయోగించి కాబట్టి కెవిపి మరికొందరి మీద కేసు నమోదు చేస్తూ, ఆర్థిక బదలాయింపులలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించటం జరిగింది కాబట్టి అక్కడి ప్రభుత్వం దాన్ని అంతర్జాతీయ నేరం కింది పరిగణించటం జరిగింది.
వాళ్ళు చర్చించుకున్న దాని ప్రకారం అవినీతి కుంభకోణంలో వైయస్ ఆర్ హయాంలోనే వేల కోట్ల రూపాయలను కూడగట్టిన వైకాపా ప్రతిష్ట ఎప్పుడో దిగజారింది. సానుభూతి పవనాలు, పాదయాత్రలు దీక్షల ద్వారా, రాష్ట్ర విభజనను వ్యతిరేకించటం ద్వారా సీమాంధ్రలో కాస్త బలం పెరుగుతున్నా ప్రకృతి పగపట్టిన రీతిలో వైకాపా చుట్టూ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.
ఇక సుప్రీం కోర్టు కూడా ఆర్థిక నేరాలు హత్యకంటే ప్రమాదకరమైనవని, కాని దురదృష్ట వశాత్తూ అటువంటి నేరాలు చేసినవారిని వారికి సముచితమైన శిక్షను అమలు చెయ్యలేకపోతున్నామని వేదనను వ్యక్తపరచిన సందర్భాలున్నాయి. హత్య అంటే క్షణికావేశంతోనో లేక రగిలే పగతోనే చేసిన పని అవుతుంది. కానీ ఆర్థిక నేరాలలో ఎంతో సుదీర్ఘమైన ఆలోచనతో కాలం తరబడి ప్రణాళికా బద్ధంగా అమలు పరుస్తూ సమాజాన్ని వంచించటం జరుగుతుంది. అందువలన హత్యకంటే కూడా ప్రమాదకరమైనదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
ప్రతి చర్యకూ ఒక ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ సిద్ధాంతాన్ని నిరూపిస్తూ ప్రజల సొమ్మును కబళించినందుకు ప్రతిగా ప్రకృతి నుండి ప్రతిచర్యగా వైకాపా మీద వత్తిడి పెరుగుతోందా అన్న అనుమానాన్ని నాలుగు రోడ్ల కూడళ్ళలోను, చాయ్ దుకాణాల దగ్గర అనుకుంటున్నారు. సిబిఐ దృష్టి సారించినంత వరకే 43 వేల కోట్ల ప్రజాధనం పరహస్తమైంది. ఇంకా పైకి తేలనివి ఎన్నివున్నాయో అని, తెదేపా చెప్పినట్లుగా లక్షకోట్లు కూడా నిజమేనేమో అన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తూ అందుకు శాస్తిగా జైలు శిక్ష, ఇంకా పూర్తవని దర్యాప్తులు, తల మీద కత్తిని వేళ్ళాడగట్టినట్లుగా అనిపిస్తోందంటున్నారు.
ఇది మాత్రమే కాదని, మహిమాన్వితుడైన ఏడుకొండలవాడి పట్ల ఏమాత్రం మోసపూరితమైన చర్యకు పాల్పడ్డా వాళ్ళకి అధోగతి ప్రాప్తిస్తుందని అన్నారు మరికొందరు. ఏడు కొండలలో కొన్ని కొండలను ప్రైవేటు పరం చెయ్యటానికి చూసిన వైయస్ రాజశేఖర రెడ్డి ఆలోచనే బెడిసికొట్టిందని, ఈ మధ్య కాలంలో తిరుమలలో వేంకటేశ్వరుని ఆలయంలో జగన్ తోపాటు సాయుధులైన ఆయన సెక్యూరిటీ గార్డ్ లు ప్రవేశించటం, బయట బూట్లతో తిరగటం లాంటి పనుల వలన నష్టి కొడుతున్నదని కూడా చెప్పారు. అందుకు దృష్టాంతరంగా ఎన్టీఆర్ కాలంలో ఈలి ఆంజనేయులు చనిపోవటం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కారు కింద బాంబు పేలటంలాంటి సంఘటనలను కొట్టిపారేసేవి కాదంటున్నారు వాళ్ళు. ఏడుకొండలవాడికి చెడు చెయ్యజూస్తే ఏడు తరాల వరకు దాని ప్రభావం ఉంటుందన్నారు వాళ్ళు.
అయితే మానవులంతా సమానమని అనుకునే భగవంతుడికి కూడా కోపతాపాలు, కక్షాకార్పణ్యాలు, పగబట్టి తీర్చుకోవటాలు ఉంటాయా. అది కుంచితమైన ఆలోచన కదూ అని అంటే వాళ్ళు ఆ మాటను ఒప్పుకోలేదు. ఎక్కడో ఏదో జరిగింది లేకపోతే పార్టీ మీద ప్రకృతి శక్తుల విజృంభణ జరగదు అన్నారు వాళ్ళల్లో కొందరు.
ఇవే నేరాలు- అంటే అటు దైవపరంగానూ, ఇటు సాటి మానవులుగా జీవిస్తున్న అమాయక ప్రజల పరంగానూ జగన్ సూత్రధారిగా చేసిన ఆర్థిక నేరాలు ప్రపంచమంతా విస్తరించి అంకెల గారడీతో ఆడుకోవటం మరోదేశంలో చేసుంటే ఇలా స్వేచ్ఛగా జగన్ దేశంలో తిరిగేవాడా అని ప్రశ్నించారు వాళ్ళంతా. కేవలం డబ్బు, రాజకీయ హోదాలకు ఆకర్షితులై రాజకీయ లబ్ధిదారులు ఆయన చుట్టూ లాభాపేక్షతో చేరి ఇంకా జగన్ ని వూరూరా తిరగటంలో సహాయపడుతున్నారు.
నిరుపేదలకు సంక్షేమ పథకాలంటూ ఉచిత పథకాలంటూ, ఋణ మాఫీలంటూ చెప్పి, ఎన్నికలలో వాళ్ళకు కొంత డబ్బు విదిలించి, అధికారాన్ని చేపట్టి, రాష్ట సంపదను తాయిలాలుగా పంచిపెట్టి వాళ్ళ దగ్గర్నుంచి లంచాలను వివిధ సంస్థల ద్వారా సొమ్ము బదలాయింపుతో కూడగట్టుకున్న ఫలితంగా ఆ పాపంలో పాలుపంచుకున్నవాళ్ళంతా ఏదో విధంగా నేరాలలో చిక్కుకుని మళ్ళీ అదే గూటికి చేరుకున్నారని వాళ్ళంతా చెప్పుకొచ్చారు. చేసిన నేరాలలో మునివేళ్ళతో రాల్చిన దాన్ని అందుకున్న నేరానికి ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఐఏఎస్ లు బలైనారని, అందులో కొందరు తిరిగి వైకాపా లో చేరుతున్నారని అందువలన ఒక్కొక్కరి మీదా ఆ శక్తి ప్రభావం పడుతోందని చెప్తూ, శోభా నాగిరెడ్డి తర్వాత ఎవరి వంతో అని కూడా భయపడుతున్నారని కూడా వాళ్ళు చెప్పారు.
దైవ శక్తి చాలా గొప్పదని, చట్టం పరిధిలోకి వచ్చినా రాకున్నా ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుందని, అందుకు ఫలితంగా ఒక్కొక్కరే అనుభవిస్తూ పోతున్నారని అంత గట్టిగా వాదిస్తుంటే వింటూ ఉండటం కంటే మరేమీ చెయ్యలేకపోయాను.
వోటర్లంటే గొర్రెల మందగా భావిస్తున్నారు కానీ ప్రజా చైతన్యం వచ్చింది. ఇక వాళ్ళ ఆటలు సాగవు. అసలు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అంతంత లేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డవాళ్ళు అమాయకంగా ముఖం పెట్టి కన్నీళ్ళు కారుస్తూ, హామీలను అందిస్తూ, ఇతర పార్టీలను విమర్శిస్తూ కాలం గడుపుకు రావటమే కాకుండా కాలాన్ని తిరగరాసి మరోసారి అధికారాన్ని సంపాదిస్తే ఆయన తండ్రి హయాంలో మధ్యలో ఆగిపోయిన పనులను చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచన వాళ్ళని మరింత ఆధోగతి పాలు చేస్తుందని కూడా సామాన్య జనమని అనుకునే వారంతా విమర్శించటం మొదలుబెట్టారు.
జరిగినంత కాలం బాగానే జరిగిపోతుంది. అడ్డంకి వస్తుందనే ఆలోచనే రానివ్వదు. కానీ ఒక్కసారిగా ఓడ తిరగబడిందంటే తిరిగి పైకి లేవటం అనేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కూడళ్ళలో జమకూడి చర్చించుకుంటున్నవారు అభిప్రాయపడ్డారు.
అంతేకాదు "ఆయన ఎక్స్ ప్రెషనేమిటండీ బాబూ ఆయన నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో కూడా అర్థం కాదు" అన్నారు కొందరు. విమర్శించటం మొదలుబెడితే అది ఎంత వరకైనా పోతుంది. వ్యక్తిగతమైన విమర్శలకు కూడా తావిస్తుంది. లేకపోతే జగనేమైనా సినిమా యాక్టరా మీకు నచ్చే ఎక్స్ ప్రెషన్ ఇవ్వటానికి, మిమ్మల్ని ఆవిధంగా ఆకట్టుకోవటానికి
నమ్మకాన్ని మించిందేమీ లేదు కదా! వాళ్ళంతా అంత గట్టిగా చెప్తుంటే కాదని అనే ధైర్యం లేకపోయింది. భగవంతుడికి మనుషుల మీద పగలు, ఆయనకు గౌరవ భంగం కలిగించి ఆలయంలో సాంప్రదాయాలను పాటించనందుకు ఆగ్రహం కలగటం అనేవి ఉంటాయా అనిపించింది. అంతే కాకుండా తన సృష్టిలోని ప్రజానీకానికి హాని కలిగించే విధంగా మోసపూరితమైన చర్యలకు పాల్పడ్డవాళ్ళను శిక్షించటానికి వివిధ రూపాలలో వాళ్ళకి ఆపదలు కలిగించటం కూడా జరుగుతుందా? ఏమో ఎవరి నమ్మకం వారిది!
అలా నమ్మటం, దైవ భక్తి కాని, దైవ భయం కానీ కలిగివుండటం కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా మంచిదేనేమో! కనీసం అటువంటి వారైనా అవినీతికి పాల్పడకుండా ఉంటారు! అందువలన నా చాయ్ నేను తాగి తాపీగా తిరిగివచ్చాను కానీ వాళ్ళతో వాదనకు దిగలేదు. "ఇలాంటి వాళ్లు వెళ్ళవలసింది అసెంబ్లీకి కాదు జైళ్ళకి" అని వారు అన్నప్పుడు దాన్ని నేను వ్యతిరేకించలేదు, ఎటువంటి స్పందనా చూపించలేదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more