యాత్ర అడ్డుకుంటే ఊరుకుంటామా? రెండు నెలలు ‘మీకోసం వస్తున్నా’ నిర్వహిస్తా,మహబూబ్నగర్ జిల్లా సుంకేసుల వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నేనెవరికీ భయపడను. పాదయాత్ర అడ్డుకోవాలని చూస్తే ఊరుకుంటానా. ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రను తెలంగాణ జిల్లాల్లో రెండు నెలలు నిర్వహించి తీరుతాను అని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పాదయాత్రలో భాగంగా సోమవారం తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్నగర్ జిల్లా రాజోలి గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేతలు సుంకేసుల బ్యారేజి దగ్గర బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజోలికి వచ్చిన చంద్రబాబు పురవీధుల్లో పాదయాత్ర చేశారు. రాజోలి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్, వైకాపా, టిఆర్ఎస్లు కుట్రపన్నాయని, వారు ఎన్ని కుట్రలు పన్నినా భయపడనని అన్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో నా వైఖరి, తెలుగుదేశం పార్టీ వైఖరి కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడే వెల్లడిస్తానని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరో అడిగితే మా వైఖరి ఎందుకు చెప్పాలని, ఇచ్చే వారు అడిగితే అక్కడే వైఖరి వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఎవరు నిజాయితీపరులో తెలుస్తుందన్నారు. కేంద్రానికి దమ్ము, ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మేము అందించిన లేఖపై నిర్ణయం తీసుకోకుండా, కేంద్రం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని ఎన్నోసార్లు చెప్పానని, ఇప్పుడు కూడా రాజోలి గ్రామం నుంచి మరోసారి తెలంగాణ ప్రజలకు వెల్లడిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ప్రయత్నం కొందరు చేస్తున్నారని, అందులో ప్రధానంగా టిఆర్ఎస్, కాంగ్రెస్లు ప్రధాన భూమికను పోషిస్తున్నాయని విమర్శించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ టిడిపియేనని, అలాంటి నిబద్దత తమదన్నారు. అవినీతిపరులు జైల్లో ఉన్నారని, చంచల్గూడ జైలు విఐపి అవినీతిపరులకు అడ్డాగా మారిందని ఎద్దేవా చేశారు. ఒక్కపుడు హైదరాబాద్ ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచిందని, నేడు హైదరాబాద్ అంటేనే ప్రపంచ దేశాలలోని వారంతా అవినీతి ఘోషిస్తోందని చర్చించుకుంటున్నారని అన్నారు. ఎవరెన్ని చేసినా, అడ్డంకులు సృష్టించినా పేద ప్రజల కోసం తన పాదయాత్ర కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అడ్డుకోవాలని చూస్తే పారిపోనని,