అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు చాలా మంది మనవాళ్లు అగ్రరాజ్యంలో స్థిరపడ్డారు. అయితే 20వ శతాబ్దం చివరి రెండు దశాబ్దాలలో అక్కడికి వెళ్లినవారి సంఖ్య అంతకుముందు కంటే గణనీయం. కానీ 21 శతాబ్దంలో అమెరికా ఉద్యోగం అన్నది సోషల్ స్టేటస్ గా మారింది. అదేంటీ మీ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయ్యిందిగా.. మరి ఇంకా ఇండియాలో ఏం చేస్తున్నాడు.. అనే స్థాయికి అగ్రరాజ్యం ఉద్యోగం మనవారిని తీసుకెళ్లింది.
ఇక టోఫెల్, జీఆర్ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడమే మనవారికి చాలా కష్టం. దీంతో పాటు అక్కడ యూనివర్సిటీలలో సీటు లభించడం, ఉత్తీర్ణత సాధించడం కూడా చాలా కష్టం. వేలాది డాలర్లు పీజులు కట్టడం కోసం మనవాళ్లు ఓ వైపు చదువుతూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబులు చేసేవారు. మన దేశ కరెన్సీలో లక్షల రూపాయలను భరించాలంటే అది అంత సులువుగా అయ్యే పనికాదు. అందుకనే తల్లిదండ్రులపై భారం పడకుండా వారు కష్టపడేవారు. ఇలా కష్టించినా సరే వారు చదువుల్లోనూ రాణించి చక్కని జాబ్ లో జాయిన్ అయిన తరువాత వాళ్ల కష్టానికి ఫలితం లభించేది.
అయితే ఇప్పుడు మారుతున్న కాలంలో అన్నింటికీ వేగాన్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్న యువత, వారి తల్లిదండ్రుల ధృకోణంలో మార్పులు సంభవించాయి. ఇప్పుడు అమెరికా అన్నది సోషల్ స్టేటస్ సింబల్ మాదిరిగా మారిపోయింది. తమ పిల్లలకు అగ్రరాజ్యంలో అడుగుపెట్టి ఏం చేస్తారు.? ఎలా ఉంటారు.? ఒంటరిగా జీవితాన్ని లాగడం ఎంత కష్టం అన్న విషయాలను మార్చి.. మారు మాట్లాడనీయకుండా అమెరికాకు వెళ్లాలంటే.. అలా చేయాలి.? ఇలా ఉండాలి.? అంటూ తల్లిదండ్రులే వారికి చిన్నప్పట్నించి అమెరికా అంటే.. అన్నదానిపై విశ్లేషణాత్మక వివరణను ఇచ్చేస్తున్నారు.
పిల్లలు చదువుల్లో రాణించకపోయినా.. ఇలా అయితే నువ్వు అమెరికా వెళ్లినట్టే అంటూ అనేస్తున్నారు.? ఎక్కడ తాను అమెరికాకు పోనో అని ఒత్తిడితో యావరేజ్ విద్యార్థులు కూడా కష్టపడి చదివేసి అగ్రరాజ్యంలోకి అడుగుపెడుతున్నారు. అయితే వీరితో పాటు ‘‘పైసా మే హై పరమాత్మ అన్న నానుడి పట్టుకు వేలాడే సూడో ప్రెస్టేజియస్ పీపుల్’’ కూడా ఉంటారు కదూ.. వారు తమ పిల్లలు కష్టపడటం చూడలేరు. అలా అని వారినో మాట కూడా అనరు. అలా అయితే కష్టం కదా.? అంటే దానికి డబ్బు సరిపోతుంది లేండి అని సమాధానం చెబుతారు. నిజానికి ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్యకు ఇప్పటి ఇంజనీరింగ్ విద్యకు.. జీఆర్ఈ, టోఫెల్ విద్యలకు వత్యాసం మాత్రం లేదని చెప్పలేం.
అదే చదువులు.. చదివేవారికి మాత్రం అంతకు మించిన జ్ఞానర్జనకు అటానమస్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు చక్కని వేదికలు. అప్పటి సిలబస్ లో అనేకానేక మార్పులు చోటుచేసుకుని అధునాతన విద్య అందుబాటులోకి రాగా, ఇది విద్యార్థులు కష్టపడేలా చేస్తోంది. ఇక దీనికి తోడు బడాయిలు, గప్పాలు, సినిమాటిక్ ప్రపంచాన్ని చూసే విద్యార్థులకు ఈ సిలబస్ చాలా తీవ్రమైన ఒత్తిడిని పెంచేస్తుంది. అసలు కాలేజీలకే వెళ్లని వారికి మాత్రం ఇది ముట్టుకుంటే చాలు కాటేసే కసాయి కాలనాగులా కనిపిస్తుంది. అయినా అందుబాటులోకి వచ్చిన అనేక నయా పంథాలను ఆశ్రయించి.. సెమిస్టర్ కో పర్యాయం కూడా పుస్తకం తెరువని విద్యార్థులైనా సరే చక్కని ఉత్తీర్ణత శాతంతో ఇంజనీరింగ్ కోర్సుల నుంచి పాస్ అవుట్ అవుతున్నారు.
అయితే అటానమస్ కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ విద్య.. సిలబస్ బేస్డ్ మాత్రమే కాకుండా తక్షణ ఉద్యోగంలో చేరేందుకు అసరమైన నైపుణ్యాలను అందిస్తోంది. దీంతో అటానమస్ కాలేజీలు, యూనివర్సిటీలలో చదివిన విద్యార్థులు ఉద్యోగంలో చేరిన వెంటనే అక్కడి ఒత్తడిని కూడా తట్టుకుని తమ ప్రావిణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే అదనుగా చేసుకుని డబ్బున్న మారాజులు కూడా దొడ్డిదారిన తమ వారిని చదివిస్తూ.. మనీ మ్యాటర్స్ అన్న సూక్తిని అడ్డుపెట్టుకుని తమ పిల్లలను ఉత్తీర్ణులను చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి ధరలు ‘లక్ష్మీ’ అవతారం ఎత్తడంతో అక్కడివారు కూడా తమ పిల్లలు అగ్రరాజ్యంలో స్థిరపడేలా కార్యచరణను రచించి ప్రైవేటు యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలకు పరుగులు తీస్తున్నారు. ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా తమ పిల్లల భవిష్యత్ కోసం ఆరాటపడుతూ.. ఇంటర్ ఫలితాలు రావడంతోనే ప్రైవేటు యూనివర్సిటీలు, కాలేజీలకు వెళ్లి సీట్లు రిజర్వు చేసుకునే పరిస్థితికి తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ విద్య దిగజారిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఎంసెంట్ రాసి మెరుగైన ర్యాంకు రాని విద్యార్థులు చివరి నిమిషంలో ఈ కాలేజీలలో సీటు కోసం పోటీ పడినా వారికది అందని ద్రాక్షగానే మారుతుంది.
రాష్ట్రంలోని కొన్ని పేరోందిన కాలేజీలలో ఎంసెంట్ ఫలితాలు వచ్చే నాటికి ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండటం లేదంటే పరిస్థితి ఎలా ఉంది.? ఎలా తయారైందో.? అమ్మకానికేనా మేనేజ్ మెంట్ కోటా సీట్లు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కోటాలో ఒక్కో స్ట్రీమ్ కు ఒక్కో ధరను నిర్ణయిస్తారు కాలేజీ యాజమాన్యాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్, సీఎస్ఈ ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతుది. ఈ స్ట్రీమ్ లలో సీటు కావాలంటే ఒక్కో సీటు ధర పాతిక లక్షలను దాటిపోతుండగా, కాసింత పేరున్న కాలేజీల్లో పది లక్షలను కూడా దాటేస్తుంది. ఇదీ ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యకు ఉన్న డిమాండ్.
ఇలా డబ్బులు పెట్టి కాలేజీల్లో సీటు సంపాదించిన తల్లిదండ్రుల ఆశలను వారి సంతానం ఎలా.? ఎంతవరకు సాకారం చేస్తారంటే.. అది ప్రశ్నార్థకమే. కేవలం ముఫై నుండి నలబై శాతం వరకు విద్యార్థులు అత్తెసరు మార్కులు తెచ్చుకుని మిడిమిడి జ్ఞానంతో బయటపడతారు. మరి మిగతావారు అంటే అక్కడ కూడా తమ ధన పరపతి ప్రదర్శించి ఉత్తర్ణులు అవుతారు కానీ, వారు సంపాదించిన జ్ఞాన విషయానికి వస్తే అసలేమీ ఉండదు. మరి ఇలాంటి వారు కూడా అమెరికా కలల్ని ఎలా సమకూర్చుకుంటున్నారు.? అగ్రరాజ్యం పేరు చెబితేనే వణుకు పట్టాల్సినవారు.. అడ్డదారుల్లో ఎగిరిపోతున్నారు. అదెలా సాధ్యం. అంటే..
నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యను కొన్నట్లుగానే.. 2-3 లక్షల వెచ్చించి వారి తరపున మరో నిఫుణులైన విద్యార్థుల చేత జీ.ఆర్.ఈ, టోఫెల్, డ్యూలింగో పరీక్షలు రాయించి అగ్రరాజ్యంలో అడుగుపెట్టేస్తున్నారు. వీరికంటే అధిక మార్కులు సంపాదించిన అనేకులు డబ్బులు పెట్టే పరిస్థితులు లేక ఇక్కడే ఏదో ఒక సంస్థల్లో చేరి కష్టపడుతుంటే.. లాస్ట్ బెంచీ విద్యార్థులు, ప్రెజెంట్ చెప్పి బయటకు వెళ్లే వాళ్లు మాత్రం ఏకంగా తమ కళ్లముందే ఎగిరిపోతుంటే ఇది ఎలా సాధ్యం అని నోరెళ్లపెట్టుకుని చూడటం తప్ప.. ఏమీ చేయలేని దిక్కుతోచనిస్థితి యావరేజ్, ఏబౌవ్ యావరేజ్ విద్యార్థులలో నెలకొంది.
తమ కన్నా చక్కగా చదువుకుని మార్కులను సాధించి అమెరికా వెళ్తున్న వారికి తమ హృదయలోతుల్లోంచి విదేశీయాన శుభాకాంక్షలు చెబుతున్న విద్యార్థులు.. తమ కంటే తక్కువ మార్కులు సాధించిన వారు అగ్రరాజ్యానికి వెళ్తుంటే మాత్రం.. ఔరా ఇదేలా సాధ్యమని ప్రశ్నించుకుంటున్నారు. మనతోనే ఆంగ్లం సరిగ్గా మాట్లాడలేనివాళ్లు అమెరికా వెళ్లి అక్కడి వారితో ఎలా మాట్లాడుతారు.? అసెంట్ తెలియకుండా ఎన్ని ఇబ్బందులు పడతారు అని నవ్వుకుంటున్నారు. కానీ దీనంతటికీ కారణం మాత్రం అనధికారిక కన్సెల్టన్సీలే. వాళ్ల పరీక్షలను బినామీల చేత రాయించి భారీ స్కోర్లు వచ్చేలా చేస్తున్నాయన్నమాట.
ఈ దొడ్డిదారిలో భారీ స్కోరుతో అమెరికా కాలేజీల్లో అడ్మీషన్లు సంపాదించుకోవడంలో చక్కగా చదువుకున్న విద్యార్థులతో పాటు పోటీపడటం గమనార్హం. అమెరికన్ యూనివర్సిటీలకు ధరఖాస్తు చేసుకుని అడ్మిషన్స్ పోందుతున్నారు. ఇక భారత్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాలతో భారతీయులకు అధిక అవకాశాలను అమెరికా అందిస్తోంది. దీంతో తమ టాలెంట్ తో దేశం పరుపును నలుదిశలా చాటే నిబద్దత కలిగిన మెరిట్ విద్యార్థులతో పాటు బడాయి కోసం వెళ్తున్న డబ్బు బాబులు కూడా ఉన్నారు. దీంతో డబ్బున్న మారాజుల పిల్లలు అటు సామాన్య విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లను అందని ద్రాక్షలా మార్చడమే కాకుండా.. ఇటు అమెరికా వెళ్దామని ఆశలు పెట్టుకున్న మరికోందరు నిబద్దత కలిగిన విద్యార్థుల నుంచి అవకాశాన్ని కూడా లాగేసుకుంటున్నారన్నది కాదనలేని విషయం.
ప్రాక్సీ స్కోరులతో అగ్రరాజ్య యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థుల కష్టాలు అక్కడితో ముగిసిపోతాయ్ అనుకుంటే పోరబాటే. ఎందుకంటే పోట్ట చించినా అక్షర ముక్క తెలియని వారు అక్కడ కాలేజీల్లో చేరగానే వారు మాట్లాడే అంగ్లం, అసెంట్ అర్థం చేసుకోవడానికే అరు మాసాలకు పైగా పడుతుంది. అప్పటికీ పూర్తిగా వచ్చేస్తుందా అంటే అదీ లేదు.. అంతంతమాత్రమే. దీంతో కాలేజీల్లోని పాఠాలు అర్థం కాక, అక్కడి ఫ్రోఫెసర్లు చెప్పేదేంటో తెలియక నానా అవస్థలు పడతారు. ఫీజులు కట్టి కాలేజీల్లో చేరినంత ఈజీ కాదు అక్కడి ప్రోఫెసర్లు లెక్చర్లు అర్థం చేసుకోవడం. దీంతో తమ తల్లిదండ్రులు చూపిన మార్గానే గుడ్డిగా ఫాలో అవుతారు. అదే ప్రాక్సీ విధానం. తమ తరపున ప్రాజెక్టులు చేయడం, పరీక్షలు రాయడానికి ప్రాక్సీ విధానాన్ని ఆశ్రయించి ఇక్కడ బడాయిలు కోట్టిన వారు అక్కడ ప్రాక్సీలను మాత్రం బతిమాలుకుని.. ఏర్పాటు చేసుకుంటారు. కాగా తమ విద్యార్థుల తరపున ఎవరో బయటివారు పరీక్షలు రాస్తున్నారన్న విషయం తెలియకపోవడంతో తమ విద్యార్థులే పరీక్షలు రాస్తున్నారని అక్కడి యూనివర్సిటీలు సెర్టిఫికేట్స్ జారీ చేస్తున్నాయి.
అయితే ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చి యూనివర్సిటీలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే అగ్రరాజ్యంలోని వందల యూనివర్సిటీలలో ఇలా ప్రాక్సీలతో పరీక్షలు రాస్తున్నారన్న వివరాలు తెలియకో లేక అలాంటి సాంకేతికత అందుబాటులోకి రాకో మొత్తానికి వీరిపై నిఘాను ఏర్పాటు చేయలేకపోతున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇక మరో విషయం ఏమిటంటే అగ్రరాజ్యంలోని టాప్ కాలేజీలను మినహాయిస్తే అనేక యూనివర్సిటీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ కాలేజీల్లో అడ్మీషన్లు అడగడమే పాపం ఠక్కున ఇచ్చేస్తామని ఆయా కాలేజీలు తీరు వుంది. మరీ లక్షల రూపాయల పీజులు చెల్లించేందుకు ముందుకు వచ్చేవారు లేక.. వారు స్వయంగా రాసినా లేక ప్రాక్సీల చేత రాయించినా పెద్దగా పట్టించుకోకుండా తమ వద్దకు వచ్చిన విద్యార్థి పరీక్షా కాయితంలో సమాధానాలు సక్రమంగా ఉన్నాయా.? లేదా.? వాటికి ఎన్ని మార్కులను అవార్డ్ చేయవచ్చు అన్న కోణంలోనే పరిశీలిస్తున్నాయన్నది కూడా కాదనలేని వాస్తవం అని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదంతా సరే కానీ, అమెరికాకు వెళ్లిన విద్యార్థులు అటు కాలేజీలకు హాజరుకాక.. పరీక్షలు రాయక ఇంతకీ ఏం చేస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. డబ్బు మరీ ఎక్కువగా ఉన్న మారాజుల పిల్లలు అమెరికాలో ఫ్రెండ్స్ తో కలసి వారాంతాలు ఎంజాయ్ చేయడం.. మిగతా రోజుల్లో ఏదో పర్యాటక ప్రదేశాలను వీక్షించడానికి వెళ్తున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం యూనివర్సిటీలలో నేర్పించే కోర్సులను నేర్చుకుంటూ.. వీకెండ్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అలా కాకుండా డబ్బున్న మారాజుతో కలసి వచ్చిన కొందరు మధ్య తరగతి విద్యార్థులు మాత్రం ఏదో ఒక పార్ట్ టైమ్ ఉద్యోగం చూసుకుని దానిని చేసుకుంటూ ఇంటికి వచ్చాక స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే వీరు చదివేది వీరికి ఎంతో కొంత వచ్చు అని చెప్పడానికి మాత్రమే కానీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు కాదు. మరీ పార్ట్ టైమ్ జాబ్ చేసిన డబ్బును తమ పరీక్షలు రాసే ప్రాక్సీలకు చెల్లించేందుకు వెచ్చిస్తారు. ఇలా మొత్తానికి ఆ కాలేజీల నుంచి పాస్ అవుట్ గా నిలుస్తారు.
ఇక కాలేజీల నుంచి బయటపడగానే వారికి అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. ఏదో ఒక మిత్రుడి సహకారంతోనో లేక ప్రాక్సీ కన్సల్టెన్సీల మద్దతుతోనో ఉద్యోగం తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడతారు. అప్పటి వరకు ఉన్న జోష్ మెల్లిమెల్లిగా సన్నగిల్లుతూ.. జీవితం, భవిష్యత్తు అన్న దానివైపు దృష్టి మళ్లుతుంది. తమ స్నేహితులందరికీ చక్కని సంస్థల్లో ఉద్యోగాలు రావడం.. వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి రెండు రోజులు సెలవులు లభించడంతో వీరిలో తెలియని అందోళన కూడా ప్రారంభమవుతుంది. ఎంతసేపు ఆడ్ జాబ్స్ చేయడం.. మంచి సంస్థలో ఏదో ఒక్క ఉద్యోగం వచ్చినా చాలు అంటూ చేసే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అందుకు మిత్రుల ద్వారా పని కాకపోతే మళ్లీ ప్రాక్సీ ఏజెన్సీల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. ప్రాక్సీ ఏజెన్సీలు ఈ యువకులను ఆశలను సోమ్ముచేసుకుని వారికి ఏదో ఒక సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తాయి. హెచ్ ఆర్ మేనేజర్లను ఈ ఏజెన్సీలు మ్యానేజ్ చేస్తాయని అందుకు వారికి విలువైన కానుకలు కూడా ఇస్తాయని టాక్.
అయితే ఇలా ప్రాక్సీ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన ఉద్యోగాలలో చేరిన విద్యార్థులు.. వారు కష్టపడిన సొమ్ములో అర్థభాగానికి పైగానే ఆయా ఏజెన్సీలు చెల్లించాల్సి ఉంటుంది. అదేంటి ఉద్యోగం ఇప్పిస్తే నెల నెలా వారికి మామూలు ఇవ్వాలా అంటే.. తప్పదు మరి. అయితే అది ప్రతి నెల ఇవ్వాల్సిన పనిలేదు. కానీ ఆయా ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు తమకు రాని పనిని.. తాము నేర్చుకునేంత వరకు.. లేదా తాము స్వంతంగా పని చేయగలిగే వరకు ప్రాక్సీల సాయం తీసుకోక తప్పదు. ఎందుకంటే సంస్థలకు కావాల్సిన అవుట్ పుట్ ఏ రోజుకా రోజు ఇవ్వక తప్పదు కదా. దీంతో సపోర్ట్ అదే ప్రాక్సీలకు చెల్లించక తప్పదు. అయితే ప్రాక్సీలు నేరుగా అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఏజెన్సీల ద్వారా తీసుకుంటాయి. ఎందకంటే వీరిద్దరినీ కలిపేది ఏజెన్సీలే. దీంతో అటు ఏజెన్సీల కమీషన్, ఇటు ప్రాక్సీలు ఫీజులు పోతే అభ్యర్థులకు నెల జీతంలో మిగిలేది నలభై శాతమే.
ఇక అమెరికాలోని బడా బడా సంస్థల్లో ఎంట్రీ లెవల్ జాబ్ లు చేసేవారిపై వర్క్ ప్రెజర్ అంతగా ఉండదు. కనుక ఒక్కో ప్రాక్సీలు సుమారుగా ముగ్గురు నుంచి నలుగురు ఉద్యోగస్థులకు ప్రాక్సీలుగా చేస్తుంటారు. ఇది వారికి పెద్ద కష్టమైన పనేం కాదు, అయితే వారిలో సంపాదించాలన్నా యావ మాత్రం ఉండాలి. అయితే ఆ విధంగా అడుగడుగునా ప్రాక్సీ అండతోనే సగం జీవితాన్ని వెల్లదీసిన యువకులు.. ఉద్యోగాల్లో స్థిరపడిన తరువాత మాత్రం క్రమక్రమంగా తమ భవిష్యత్తుపై ఆశలు చిగురించి.. కష్టపడటం.. అప్పటి దాకా ఒక లెక్క.. అప్పటి నుంచి మరో లెక్క అంటూ అప్పటి వరకు తాము చదువు కోవాల్సినదంతా ఆ ఆరు మాసాలు లేదా ఎనమిది నెలల్లో నేర్చుకుంటారు. ప్రతిభాపాటవాలతో క్రమక్రమంగా వటుడింతై అన్నట్లు ఉద్యోగాల్లో అనుభవంతో రాణించి పదోన్నతులు అందుకుంటారు. అయితే ఇలా మన దేశం నుంచి అనేకమంది వెళ్తుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉందని మాత్రం చెప్పక తప్పదు.
ఇలా ప్రాక్సీ బతుకులు బతుకుతున్న వారిలో మన తెలుగువాళ్లే చాలా ఎక్కువ అని ఇటీవల ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఎక్కువగా కనపించరు. ఇది సంతోషించదగిన పరిణమామే. తెలుగువాడంటే తెలుగువాడికే పడదు అని నిన్నమొన్నటి వరకు అనేవారు. నలుగురు కలసి వెళ్లే చోట, ఒకరి కాలు మరోకరు పట్టుకుని ఎవరినీ ముందుకు వెళ్లనీయరని అనేవాళ్లు.. కానీ తెలుగువారు పెద్ద సంఖ్యలో అమెరికాలో కనబడుతున్నారంటే.. తెలుగువాడికి తెలుగువాడే శత్రువన్న వాదన తప్పని స్పష్టంగా కనబడుతోంది. ఆ వాదనను కొట్టిపారేస్తుంది.
అమెరికాలో తెలుగువారి కన్సల్టెన్సీ పేరుతో ఇలాంటి ప్రాక్సీ వ్యాపారం చేస్తున్నారన్న వార్తలు వినబడుతున్నా.. తెలుగువారిని తమ తోటివారిని అగ్రరాజ్యానికి తీసుకెళ్తున్నారంటే అది సంతోషించదగ్గ పరిణామమే. అయితే అక్కడికి వెళ్లిన తెలుగువాళ్లు ఏదో ఏడాది ఎంజాయ్ చేస్తారు.. జీతాన్ని సమర్పించుకుంటారు కానీ.. ఆ తరువాత పని నేర్చుకుని వృద్దిలోకి రావడం అన్నది తప్పక జరుగుతుంది. ఇలా వృద్దిలోకి వచ్చాడా.. ఇక రాణించేస్తాడు. అయితే యూనివర్సిటీలలో చదువుకునేప్పుడు మాత్రం ఆడ్ జాబ్స్ చేసుకోవడం అన్నది అందరికీ కామన్. తమ తల్లిదండ్రులపై భారం కాకూడదనే వారు ఆడ్ జాబ్స్ చేసుకుంటారు.
ఈత కొలనులో ఈత నేర్చుకోమ్మని ఓ బిడ్డను తన తండ్రి రోజు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్లినా.. ఆ పిల్లాడు నేర్చుకోడు. అటు ఇటు తిరుగుతూ.. నడుముకు వడ్డానంలా ఓ ట్యూబ్ కట్టుకుని ఓ మూలన తక్కువ లోతుగా ఉన్న చోటే తిరుగుతుంటాడు. కానీ అదే పిల్లాడ్ని బావిలోనో, చెరువులోనే వదిలితే.. తప్పక ఈత నేర్చుకుంటాడు. ఈతకొడుతూ బయటకు వస్తాడు. ఇది కూడా అలాంటిదే. తల్లిదండ్రులు మేమున్నాం అన్న ధైర్యం చెబితే వాళ్లు ఉన్నారులే అన్న భరోసా కలిగే విద్యార్థులు జీవితాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అదే ఏకాంతంగా ఉంటే ప్రదేశంలో ఉంటే తాను బతకాలి.. నలుగురిలో ఒకరిలా.. అంటూ సాగే అతని ప్రయాణం.. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచేలా సాగుతుంది. విద్యార్థులు తమ జీవితాలను సీరియస్ గా తీసుకునే వరకు మాత్రమే ఈ ఎంజాయ్ మెంట్ అంటారు. ఒక్కసారి పని నేర్చుకుని అందులో నిమగ్నమయ్యారా.? ఇక తమ ఎంజాయ్ మెంట్ ను పనిలోనే వెతుక్కుంటారు. ఇది నిజం.
అమెరికాపై ఆశలతో ప్రాక్సీల చేతుల్లో పడి తమ జీవితాలను, జీతాలను సమర్పించుకున్న యువత.. అలాంటి ఆశలతో అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టే వారికి ఆదర్శంగా నిలుస్తూ తమ జీవిత ఘట్టాలను పంచుకుంటూ ఇలా చేయాలన్న వారిలో ఒక్కరు మారినా.. అది మిలియన్ డాలర్ల ఆనందాన్ని ఇస్తుంది. ఇక అమెరికాలాంటి దేశాల్లో ఉద్యోగమనే స్వప్నం సాకారం చేసుకోవాలని భావించే యువత.. అవకాశం ఉన్నప్పుడే సరైన దారిలో వెళ్లి విజయాలను అందుకోవాలని, అక్రమమైన మార్గంలో వెళ్లి భవిష్యత్తును బలి చేయవద్దు. ఇక అక్కడి ప్రభుత్వాలు మారుతూ ఏ క్షణంలో ఏలాంటి నిర్ణయం తీసుకుంటాయో కూడా తెలియని నేపథ్యంలో అమెరికా ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాల యువత వాటిని అందుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more