రైల్వే బడ్జెట్ బడ్జెటంటూ ఎదురు చూసినంత సేపు పట్టలేదు ఉస్సూరుమనటానికి. రాష్ట్రానికి ఏదో జరుగుతుంది, దేశానికి ఏదో ఒరుగుతుంది అని ఆశపెట్టుకున్నవారు నీరుగారి పోయారు. అతిగా ఆశపడటమే అందుకు కారణమేమో. కష్టనష్టాలలో కూరుకుని ఉన్న రైల్వే శాఖ నుంచి వరాలను ఆశించటం అందరి తప్పే. పేదల రవాణా సౌకర్యంగా నష్టాలను భరిస్తూ వస్తున్న రైల్వే శాఖ ప్రజల సౌకర్యం కోసం ఆ నష్టాలను భరిస్తూ నడిపించటం జరుగుతోంది. ఉన్న వాస్తవాన్ని వెలిబుచ్చుతూనే మళ్ళీ లోటు బడ్జెట్ ని ప్రవేశపెట్టటంలో అర్థం లేదు. సౌకర్యాలను, హంగులను పెంచుతూ, వాటి మీద వచ్చే ఆదాయంతో సామాన్య భోగీలతో కూడిన రైళ్ళను నడపుతామన్న ఆలోచనైతే మంచిదే కానీ ఎంతవరకూ అది జరగటానికి వీలుందన్నది చూడాలి.
ఛార్జీలు పెంచలేదు సుమీ అంటూనే రిజర్వేషన్ ఛార్జీలు, సరుకుల మీద రవాణా ఛార్జీలను పెంచటంలో ప్రభుత్వం జాణతనం కనిపిస్తోంది. రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చెయ్యటమనేది అసంభవంగా తయారైన పరిస్థితులివి. అందువలన అందరూ తప్పినిసరిగా పెరిగిన రిజర్వేషన్ ఛార్జీలను భరించాల్సిందే. ఇక సరుకుల రవాణా ఛార్జీలను పెంచటం వలన పరోక్షంగా భారం పడేది కూడా సామాన్యుడి మీదనే. విలాసవంతమైన భోగీల ద్వారా ధనిక వర్గాన్ని ఆకర్షించి తద్వార పేదలకు రైల్వే సేవలను యధావిధిగా అందిస్తామన్నది కాగితాల మీద బావున్నా, నిజానికి సామాన్య భోగీలలో ప్రయాణం చేసేవారి అతీ గతీ పట్టించుకోవటం ఉండదు. విమాన సేవలతో పోటీ పడే ఛార్జీలతో రైల్వే శాఖ ముందుకు రాబోతున్నదని అర్థమౌతూనేవుంది. దాని మీద వచ్చే లాభాలతో రైలు సేవలను మెరుగుపరుస్తామని అంటున్నారు కానీ ఆ తరగతి ప్రయాణీకులకే అది అందుతుంది. ఉదాహరణకు, ఎసి టికెట్టున్న ప్రయాణీకులు ఎసి వెయింటింగ్ రూంలలో వాళ్ళ రైలు వచ్చేంత వరకూ రుసుము చెల్లించకుండా వేచివుండవచ్చు అన్నది నియమం. అంటే, నాన్ ఎసి టికెట్టున్నవాళ్ళకి ఈ సదుపాయం లేదు కదూ. రైళ్ళలో సదుపాయాలను పెంచిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడే ఆ విషయం స్పష్టంగా ఉంది. కొంత కాలం క్రితం వరకూ ఎసి వెయిటింగ్ రూం లలో ఎసి టిక్కెట్టు కొన్ని వేచి చూసే వారు సేద తీర్చుకోవచ్చని చెప్పిన రైల్వే శాఖ, ఆ సదుపాయాన్ని కుదించి, సెకండ్ ఎసి ఆ పై టిక్కెట్టుకే దాన్ని పరిమితం చేసింది. రేపు విలాసవంతమైన భోగీలు వచ్చిన తర్వాత సామాన్య ప్రయాణీకుడిని అసలు పట్టించుకుంటారా అన్నది కూడా అనుమానమే- సేవలను మెరుగుపరచటం అటుంచి.
రైల్వే బడ్జెట్ వెల్లడి అయిన తర్వాత ప్రముఖులంతా వివిధ రకాలుగా స్పందించారు. అయితే కాంగ్రెస్ పెద్దలు తప్ప మరెవరూ బలపరచలేదు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రైల్వే బడ్జెట్ ని, రైల్వే మంత్రి కొనియాడటంలో పిసినారితనాన్ని ఎంతమాత్రమూ చూపించలేదు. ముందు చూపుతో తయారైన బడ్జెట్ అంటూ ప్రశంసించారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా అదే దారిపట్టారు. రైల్వే ఆర్థిక పరిస్థితిని ఉన్నదున్నట్టుగా చెప్పటాన్ని ప్రధానమంత్రి, కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబాల్ కూడా పొగిడారు. కేంద్ర సమాచార శాఖా మంత్రి మనీష్ తివారీ కూడా ఈ బడ్జెట్ ని విశాల దృక్పథంతో రూపొందించారని అన్నారు.
ఇది కాంగ్రెస్ బడ్జెట్ అని అందులోనూ రాయ్ పక్ష బరేలీ బడ్జెట్ అని, రాజకీయ లబ్ధి కోసం రూపొందించారు కానీ రైల్వే శాఖను ఇంకా ఊబిలోకి తీసుకెళ్ళే విధంగా ఉందని అంటూ పలువురు నేతలు విమర్శించారు. అందులో భాజపా నేత గోపీనాథ్ ముండే, భాజపా సీనియర్ నేత యశ్వంత్ సిన్హా, భాజపా ఎంపీ అనురాగ్ ఠాకుర్, భాజపా అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సిపిఎమ్ నేత సీతారామ్ ఏచూరి, సమాజ్ వాదీ పార్టీ అదినేత ములాయమ్ సింగ్ యాదవ్ ఉన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సిపిఎమ్ నేత డి.రాజా ఈ బడ్జెట్ చాలా అసంతృప్తికరంగా ఉందని, పేదల మీద మరింత భారం పడబోతున్నదని అన్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ప్రతి సారీ లాగానే భంగపడటం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే నుండి వచ్చే ఆదాయానికీ రైల్వే శాఖ కోటాయించే నిధులకూ పొంతన లేదు. పైగా ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారన్నది కూడా స్పష్టంగా ఉండదు. ఖర్చులన్నీ పోను రైల్వే శాఖకు సంవత్సరానికి 1800 కోట్ల లాభాలను తెచ్చిపెడుతున్న దక్షిణ మధ్య రైల్వే చేసుకున్న పాపం అది ఆంధ్రప్రదేశ్ లో ఉండటం. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు ప్రజాప్రయోజనం కోసం కేంద్రం నుంచి నిధులను సేకరించటంలోనూ ఖర్చులో మనకు రావలసిన వాటా కోసం పట్టుబట్టటంలోనూ ఎప్పిటిలాగానే ఈ సారి కూడా పూర్తిగా విఫలమయ్యారని విశ్లేషకులంతా వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్న 67 కొత్త ఎక్స్ ప్రెస్ లు, 26 ప్యాసెంజరు రైళ్ళలో రాష్టానికి 9 కొత్త ఎక్స్ ప్రెస్ రైళ్ళు, ఒక కొత్త ప్యాసెంజరు రైలు మాత్రం లభించాయి. లెక్కకి 9 రైళ్ళయినా, అందులో వారానికి ఒకరోజు సేవలో ఏడు, వారానికి రెండు రోజుల సేవలో ఒకటి ఉన్నాయి. కొత్త ప్యాసెంజరు మాత్రం ప్రతిరోజూ సేవకు నోచుకుంది.
ఎక్స్ ప్రెస్ రైళ్ళు –
1. కర్నూలు టైన్ – సికింద్రాబాద్ - ప్రతిరోజూ
2. కాకినాడ- మంబై –వారానికి రెండుసార్లు.
3. మంగళూరు – కాచిగూడ – వారానికి ఒక రోజు.
4. నిజామాబాద్ – లోకమాన్య తిలక్ – వారానికి ఒకరోజు.
5. తిరుపతి – పుదుచ్చేరి – వారానికి ఒకరోజు.
6. తిరుపతి – భువనేశ్వర్ – వారానికి ఒకరోజు
7. విశాఖపట్నం – జోధ్ పూర్ – వారానికి ఒకరోజు
8. విశాఖపట్నం- కొల్లం – వారానికి ఒకరోజు
9. గాంధీధామ్ – విశాఖపట్నం – వారానికి ఒకరోజు
పాసెంజర్
1. నంద్యల – కర్నూలు ప్యాసెంజరు - ప్రతిరోజు
ఏం చేస్తాం, ఇంతే రాసి పెట్టుంది (కేంద్ర బడ్జెట్ లో) మరి
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more