ప్రయోగాలు చేయాలంటే శాస్ర్తవేత్తలే కానక్కర్లేదు... సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలంటే... డిగ్రీ పట్టాలు అవసరం లేదు... ప్రయోగాలు చేయాలంటే అత్యాధునిక ప్రయోగశాలలు అవసరం లేదు...అత్యథిక దిగుబడి రాబట్టాలంటే... రసాయన ఎరువులు అవసరం లేదు... కేవలం పేట, పుట్టమట్టి లాంటివి చాలని నమ్మి, తన నాలుగెకరాల చేనులో బంగారం పండించి అందరికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఢిల్లీలో మూడు నెలల క్రితం లాల్బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వేదికగా ట్రైనీ ఐఏఎస్ లకు లలితమ్మ పాఠాలు, అనుభవాలు చెప్పి అందరిచేత చప్పట్లు కొట్టించుకుంది. మరి ఈ ఆదర్శ రైతు మహిళా మూర్తి గురించి నాలుగు మాటలు.
మెదక్జిల్లా జహిరాబాద్ మండలం రాయ్పల్లి గ్రామానికి చెందిన లలితమ్మ పదేళ్ల కిత్రం లలితమ్మ రోజుకూలి. పొద్దునే కొడవలి పట్టుకుని పొలానికి వెళితేగాని పొట్టగడిచేది కాదు. సొంతంగా పొలం ఉన్నా...పెట్టుబడి పెట్టి పండించే స్తోమతలేక లలితమ్మ, ఆమె భర్త వ్యవసాయ పనులు చేసుకుని బతుకు బండినీడ్చారు. ఇందిర క్రాంతి పథకం కింద సుస్థిర వ్యవసాయ పద్ధతుల గురించి కొందరు సార్లు వచ్చి మాకు శిక్షణ ఇచ్చిండ్రు. మా చుట్టుపక్కల రైతులంతా మంచిగ విని ఊకుండ్రు. నాకు మాత్రం నచ్చి మా చేన్ల చాన ప్రయోగాలు చేసిన. ఇంకెవరో వచ్చి పాత పంటలకు ఇప్పుడు మస్తు గిరాకి ఉందని చెబితే వాటి గురించి ఆలోచన జేసిన’’ అంటూ తన తొలి అడుగుల గురించి పూసగుచ్చినట్టు వివరించింది లలితమ్మ. కొర్రలు, సామలు, తైదలు, పచ్చసజ్జలు, నల్లనువ్వులు వంటి పాత పంటల్ని పండించి పట్టణాలకు ఎగుమతి చేస్తుంది. వ్యవసాయం పేరు చెప్పగానే రైతులకు రసాయన ఎరువుల ధరలు గుర్తుకొస్తాయి. ఏళ్ల అనుభవం ఉన్న రైతులు కూడా వ్యవసాయం పేరు చెప్పేటప్పటికి చేతులెత్తేసే పరిస్థితుల్లో లలితమ్మ అద్భుతమైన లాభాలు గడిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆమె సొంతంగా తయారుచేసుకుంటున్న సేంద్రీయ ఎరువులే.
వాటి వెనకున్న రహస్యం కనుక్కోడానికే సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ)వారు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి కలెక్టర్ల ముందు కూర్చుబెట్టారు. సుస్థిర వ్యవసాయం అంటే ఎరువుల్ని, విత్తనాల్ని రైతులే తయారుచేసుకోవాలి. ఓపికుంటే అమ్మకాలు కూడా రైతులే చేసుకుంటే పెట్టుబడిలేని వ్యాపారంలా సాగుతుంది. లలితమ్మ విజయం వెనకున్న కారణాలు ఇవే. తనకోసం మాత్రమే కాదు ఆ చుట్ట్టుపక్కల యాభై మంది రైతులకు సేంద్రీయ విత్తనాలను, ఎరువుల్ని అమ్ముతుంది కూడా. ప్రస్తుతం ఆమె పదమూడు రకాల సేంద్రీయ పంటల్ని పండిస్తోంది. అమ్మకం పని కూడా తనదే. దళారీల ప్రసక్తే రానివ్వదు. ‘‘పొలముంది కదా అని ఒకటే రకం పంట ఏసుకుంటే బొమ్మ బొరుసులెక్క ఉంటది. అట్లగాకుండా నాలుగైదు రకాల పంటలేసుకుంటే అమ్ముకోడానికి బాగుంటుంది. ఒకదాన్ల నష్టమొచ్చినా ఇంకోదాన్ల లాభమొస్తది. మన దగ్గర రైతులు ఎక్కువ తలకాయి నొప్పిలేకుండా పంట పండాలంటరు. వ్యవసాయంలా ఎంత ఓర్పు ఉంటే గంత లాభముంటది. పంట సరిగ రాకుంటే దేవుడా....అంట కూసుంటరు. మొక్క లేవకుంటే ఎంబడే పీకేసి కూరగాయలు పెట్టుకుని మార్కెట్కి ఏస్కుంటే కాలం కలిసొస్తది, సొమ్ములొస్తయి’’ లలితమ్మ ఆలోచనతో కాదు...అనుభవంతో చెప్పిన మాటలివి. ఐదేళ్లపాటు పాతపంటలపై రకరకాల ప్రయోగాలు చేసి, ఆ తర్వాత ఐదేళ్లలో సేంద్రీయ పంటల్లో ఎవ్వరూ ఊహించని విజయాలు సాధించింది. అందుకుగానూ మూడేళ్లక్రితం ప్రభుత్వంవారు ఉత్తమరైతు అవార్డు కూడా ఇచ్చారు. సుస్థిర వ్యవసాయం పేరుతో అంతరించిపోతున్న పాత పంటల్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించి అధిక లాభాలు గడిస్తున్న లలితమ్మ తోటి రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more