పరుగుల రాణి అంటే పి.టి.ఉష మాత్రమే అనే అభిప్రాయానికి ‘ప్రాయం’ చెల్లించిందో అమ్మాయి. కండలు మెలితిరిగిన దేహంతో ఉండే అథ్లెట్స్ గ్లామర్ రంగంలో సక్సెస్ కావడం కష్టమేననే భావన కు నూకలు చెల్లించిందో స్లిమ్ ట్రిమ్ గాళ్. భారతీయ క్రీడా రంగానికి గ్లామర్ అద్దిన ఆ తొలి స్పోర్ట్స్ స్టార్... రన్నర్గా ‘రాణి’ చింది... రంగుల లోకంలోనూ తళుక్కుమంది. పేరులోనే హార్స్ పవర్ వున్న ఆ పరుగుల కుప్ప... ఇప్పుడు ఏం చేస్తోంది? ఏ విజయం వైపుగా పరుగు తీస్తోంది?
స్టార్ల గురించి చెప్తున్నప్పుడు సినిమా రంగంలోకి వచ్చి దూసుకు పోయారంటాం. అయితే అశ్వినీ నాచప్ప మాత్రం దూసుకుపోతూనే సినీరంగంలోకి వచ్చారు. కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన అశ్విని అథ్లెట్గా ఎన్నో సంచలనాలను నమోదు చేశారు. అర్జున అవార్డుతో సహా అత్యున్నత పురస్కారాలెన్నో సొంతం చేసుకున్నారు. తన పేరుతోనే రూపొందిన చిత్రంతో సినిమారంగంలోకి సైతం ప్రవేశించారు. స్ప్రింటర్గా రాణిస్తోన్న యువతి సిల్వర్స్క్రీన్ మీద హీరోయిన్గా వెలవెలబోవడం ఖాయమనే అంచనాలను తలకిందులు చేస్తూ... తొలి చిత్రంతోనే హిట్ కొట్టారు. దాదాపు 12 సంవత్సరాల సుదీర్ఘ క్రీడారంగ కెరీర్ తర్వాత అత్యంత విజయవంతమైన ఈ మాజీ స్పోర్ట్స్స్టార్ ఎటువైపు మళ్లారు? ఐదు సినిమాలలో నటించి నటిగానూ గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ ఇప్పుడేం చేస్తున్నారు?
రన్నర్... విన్నర్... సోషల్ వర్కర్...
అశ్వినీ నాచప్ప తన సినీ-స్పోర్ట్స్ కెరీర్ అనంతరం 2003 దాకా విజయాబ్యాంక్ ఉద్యోగినిగా కొనసాగారు. అనంతరం బెంగ ళూరు పరిసరాల్లోని అనాథ పిల్లలను ఆదు కునేందుకు ‘పరిక్రమ హ్యుమానిటీ ఫౌండే షన్ బోర్డ్’లో జాయినయ్యారు. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ నాలుగు సెంటర్లలో వెయ్యిమంది దాకా చిన్నారులకు చేయూత నిస్తోంది. అదే విధంగా మానసిక వికలాంగులకు క్రీడలలో శిక్షణ అందించేందుకు ఏర్పాటైన స్పెషల్ ఒలింపిక్ ప్రోగ్రామ్లో కూడా అశ్విని భాగం పంచుకున్నారు. గ్రామ ప్రాంతాల్లో క్రీడా సమాజాలను నిర్మిస్తే ఆ పునాది మీద మరింతమంది చాంపియన్లు ఉద్భవిస్తా రనేది అశ్విని నమ్మకం. అందుకు అను గుణంగా తన భర్త దత్తా కరూంభయ్యా (మాజీ హాకీ క్రీడాకారుడు)తో కలిసి గ్రామీణ ప్రాంతానికి సేవ చేయడానికి స్వస్థలంలో అకాడెమీ ఆఫ్ లెర్నింగ్ అండ్ స్పోర్ట్స్ (కేఏఎల్ఎస్)ను ప్రారంభించారు. దక్షిణాది కూర్గ్ పర్వతశ్రేణుల్లో నెలకొల్పిన ఈ సంస్థ నిలకడగా తన ఆశయసాధనవైపు సాగిపోతోంది. అశ్వినీ నాచప్ప స్పోర్ట్స్ ఫౌండేషన్ పేరిట అత్యాధునిక క్రీడా కార్య క్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
స్వీట్ కోసం పరుగెత్తేదాన్ని...
‘‘బెంగళూరులో కాంతివీర స్టేడియం దగ్గర్లో ఉండేవాళ్లం. మా కోచ్ మహీందర్ సింగ్ మేం చేసిన ప్రతి పరుగుకూ ఒక స్వీట్ ఇచ్చేవారు. ఆ స్వీట్ కోసం తెగ పరుగు తీసేదాన్ని. ఎన్ని పోటీల్లో గెలిచినా, తొలి రాష్ట్రస్థాయి పోటీలో గెలుపు, 200 మీటర్ల పోటీలో పి.టి ఉషను ఓడించడం మరచి పోలేను’’ అంటారామె. అమెరికన్ అథ్లెట్ ఫ్లోరెన్స్ గ్రిఫ్త్ జాయ్నర్ (ఫ్లోజో)తో తనను పోల్చడం గురించి చెప్తూ... ‘‘ఆ పోలిక నాకు గొప్పగానే ఉండేది. అయితే నేనెప్పుడూ ఆమెను అనుకరించిందిలేదు’’ అంటారు. అంత గొప్ప క్రీడాకారిణి ఎపిలెప్సీతో మృతి చెందడం తననెంతో కలచివేసిందట!
నేనా... సినిమాల్లోనా...
‘‘ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో కలిసిన ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీద్దామనుకుంటున్నామని చెబితే వద్దన్నా. అయితే వాళ్లు పట్టు విడవక పోవడంతో ఓకె చెప్పేశా. షూటింగ్ సమయంలో నాకెంతో గౌరవం లభించేది. సినిమాలకు మళ్లగానే నా పనైపోయిందని విమర్శకులు అన్నారు. కాని నేను ఆ తర్వాత కూడా జాతీయస్థాయిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాను’’ అన్నారు. భర్త గురించి చెప్పమంటే.. ‘‘తెగ వాగేసే నాలా కాకుండా ఆయన ఇంట్రావర్ట్. అయితే మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవారు. పర్ఫెక్షనిస్టు. అది ఒక్కోసారి నొప్పిస్తుందనుకోండి’’ అంటారు నవ్వుతూ. అశ్విని కుమార్తెలలో అనీషా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గా జాతీయస్థాయి వేదికలపై సత్తా ప్రదర్శిస్తుంటే, దీపాలి గోల్ఫ్ ను ఎంచుకుంది. తన ఇద్దరు కూతుళ్లతో గడపడాన్ని ఇష్టపడతానంటున్న ఆమె... ‘‘వాళ్లిద్దరూ క్రీడాకారుల కంటే ముందు మంచి మానవతా వాదులు కావాలని ఆశపడుతున్నాను’’ అంటారు.
లంచాలు, అవినీతి క్రీడారంగాన్ని కూడా భ్రష్టుపట్టిస్తున్నాయని ఆవేదన చెందుతున్న అశ్విని, ఆ విషయంలో ఉద్యమిస్తున్నారు. క్రీడారంగాన్ని రాజకీయాలకు వేదికగా మార్చవద్దంటూ ఇటీవల చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించారు. ‘‘మన దేశంలో క్రీడాప్రతిభకు పట్టిన రాజకీయ గ్రహణం తొలగిపోతే మరిన్ని విజయాలు సాధించగలం’’ అంటారామె. భవిష్యత్తులో నటనపై మళ్లీ దృష్టి సారించే అవకాశం ఉందా అంటే... నేనా... నటించడమా అంటూ గట్టిగా నవ్వేస్తారు. నలభై ఐదేళ్ల వయసులోనూ సడలని సౌందర్యంతో మెరిసిపోయే ఈ అశ్వినీ ‘నక్షత్రం’... సినీ వినీలాకాశంలో మళ్లీ తళుక్కుమంటే చూడాలని అభిమానాలు ఆకాంక్షించడంలో తప్పేముంది!
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more