రంభ (తేజస్వి), ఆద్య (కృతిక) లు లగ్జరీ లైఫ్ లో బతకాలనుకునే అమ్మాయిలు. అందుకు తగ్గట్లుగా ఎవరినో పెళ్లి చేసుకోవాలో అని అల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు. రంభ తన ఎదుటి ఆఫీస్ కు చెందిన డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆద్యకు ఓ బడా వ్యాపారవేత్త కొడుకుతొ పెళ్లి చేసుకొని యుఎస్ లో సెటిల్ కావాలని అనుకుంటుంది. కానీ, వాళ్లను పడేయటం కోసం ఓ ఫ్రెండ్ సలహాతో శ్రీశైలం అడవుల్లో ఓ సాధువును కలుస్తారు. అయితే పెళ్లైన తర్వాత ఇద్దరు అమ్మాయిల భర్తలు చనిపోతారని చెబుతాడు ఆ సాధువు.
దీంతో తమను పిచ్చిగా ప్రేమించే .పీటర్ (చేతన్ మద్దినేని), అశ్వత్ (పార్వతీశం)లను పెళ్లి చేసేసుకుంటారు. దీంతో వాళ్ల లైన క్లియర్ అవుతుందని ఇద్దరు ప్లాన్ వేస్తారు. మరి సాధువు చెప్పినట్లు పీటర్, అశ్వత్ లు చచ్చిపొతారా..? రంభ, ఆద్యల ప్రేమ ఫలిస్తుందా? ఆ ఆరుగురి లైఫ్ ఏం అవుతుంది...? ఇదే రోజులు మారాయి కథ.
తెలుగులో యూత్ ఫుల్ సినిమాలను ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. బూతు లేకుండా కాస్త ఎంటర్ టైన్ మెంట్ ను తగిలిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తుంటారు. సరిగ్గా అలాంటి కథనంతో వచ్చిందే రోజులు మారాయి. ఎంటర్ టైనర్ దర్శకుడు మారుతి కథ, స్క్రీన్ ప్లే అందించగా, దిల్ రాజు, గుడ్ సినిమా, మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్వహించాయి. మురళీ కృష్ణ ముదిదాని దర్శకత్వంలో చేతన్ మద్దినేని, పార్వతీశం, తేజస్వి, కృతిక తారాగణంగా వచ్చిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. మరి ఈ చిత్ర ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
ప్లస్ పాయింట్లు:
ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది స్క్రీన్ ప్లే నే. మారుతి అందించిన కథను తానే స్వయంగా పర్యవేక్షించడంతో ఆసక్తికరంగా మలిచాడు. నటీనటుల విషయానికొస్తే హీరోల్లో చేతన్ మద్దినేని సహజంగా నటించాడు. మోసం చేస్తుందని తెలిసినా తన ప్రేయసిపై అతి ప్రేమను పంచే క్యారెక్టర్లో జీవించాడు. ఇక హీరోయిన్లలో తేజస్వి మదివాడ ఎప్పటిలాగే చేసింది. మరో నటి కృతిక కూడా బాగానే చేసింది. మిగతా వారంతా పరిధి మేరలో నటించారు. ఈ చిత్రానికి మరో మేజర్ పాయింట్ నిర్మాణ విలువలు. ముగ్గురు ప్రొడ్యూసర్ లు తలా ఓ చేయి వేయటంతో దానికి ఏం ఢోకా కనిపించలేదు. ఓ రిచ్ సినిమాను చూస్తున్నామనే భావన కలిగింది.
మైనస్ పాయింట్లు:
సినిమాకు పెద్ద మైనస్ కథ. తన లాభం కోసం ప్రేమను వాడుకోవటం, ఆపై వారి మనసులను గుర్తించి దగ్గరవ్వటం లాంటి కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే తో దాన్ని కవర్ చేసేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. కానీ, వినోదాత్మకంగా తెరకెక్కించడంలో మాత్రం దర్శకుడు ఫేలయ్యాడు. పార్వతీశం పాత్ర మరీ ఓవర్ గా అనిపించకమానదు. కొన్ని సన్నివేశాల్లో బాగా ఇబ్బంది పెడుతుంది. కీలకమైన సెకండాఫ్ ను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఆలీ ట్రాక్ విసుగుపుట్టిస్తుంది. కామెడీ కూడా రోటీన్ గానే ఉంది, పెద్దగా పేలలేదు.
విశ్లేషణ:
ఫస్టాఫ్ సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన డైరక్టర్ సెకాండాఫ్ మాత్రం నిర్లక్ష్యం చేశాడు. దీంతో ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. మొత్తం కామెడీ ట్రాక్ అంతా మొదటి భాగంలోనే కానిచ్చేయటంతో ద్వితియార్థంలో చూపించడానికి ఏం లేకుండా చేశాడు. అనవసరంగా ఇరికించిన సీన్లు ఉన్నాయే అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్, చేతన్ యాక్టింగ్, టైమింగ్ ఉన్న కొన్ని డైలాగులతో కాసేపు రిలాక్స్ కావొచ్చు. అయితే అవి సినిమాను ఎంత మేర కాపాడుతాయన్నది కాస్త డౌటే.
వెరసి రోజులు మారాయి సో.. సో... గానే అనిపించకమానదు.