మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని మహా ప్రయత్నమిది... ఉన్న భూమిపై వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో, అవసరాలు పెరిగిపోతున్న తరుణంలో... అపురూపమైన ఖనిజాల కోసం మనిషి అంతరిక్షం బాటపట్టాడు.. ప్రపంచ కుబేరులు జతకట్టారు... ఓ సరికొత్త కంపెనీని సృష్టించారు. ఉల్కా శకలాల్లోని విలువైన వనరులను తోడేసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నం ముందు, వెనుక...
అవతార్ సినిమా గుర్తుందా? పండోరా అనే గ్రహంపై విలువైన ఖనిజాల తవ్వకానికి వెళ్లిన మానవులకు స్థానికుల నుంచి ఎదురైన వ్యతిరేకత ఈ సూపర్హిట్ హాలీవుడ్ సినిమా ఇతివృత్తం. అదృష్టవశాత్తూ ఇప్పటికైతే భూమి మినహా మరే ఇతర గ్రహంలోనూ జీవం ఆనవాళ్లు లేవు. లేదంటే మన కళ్లముందే ‘అవతార్’ సినిమా వాస్తవ రూపం దాల్చి ఉండేది. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసా? అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరికొందరు కలిసి ‘ప్లానెటరీ రిసోర్సెస్’ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేయడం. మానవ టెక్నాలజీ ప్రగతి కొనసాగేందుకు ప్రతిబంధకంగా మారుతున్న వనరులను అంతరిక్షంలోని ఉల్కా శకలాల నుంచి తోడి తెచ్చుకోవడం ఈ కంపెనీ ప్రణాళిక!
ఉల్కల్లో ఏముంటాయి?
భూమి ఏర్పడి సుమారు 450 కోట్ల సంవత్సరాలు అవుతోందని అంచనా. ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన వందల గ్రహ, ఉల్కాశకలాలు భూమిని ఎడాపెడా ఢీకొట్టాయి. ఈ క్రమంలో వాటిల్లోని ప్లాటినం, కోబాల్ట్ ఇనుము వంటి విలువైన లోహాలు, ఖనిజాలు భూమిపై పోగుబడిందని, వాటినే మనమిప్పుడు తవ్వుకుంటున్నామని శాస్త్రవేత్తలు చెబుతారు. అంటే ఈ ఉల్కాశకలాల్లో అత్యంత విలువైన ప్లాటినం, బంగారు, నికెల్, మాలిబ్డినం, పల్లాడియం, రీనియం, రోడియం, టంగ్స్టన్ వంటి లోహాలు విరివిగా ఉన్నాయన్నమాట. మన సహజ ఉపగ్రహం చంద్రుడిపై భారీ మొత్తంలో హీలియం - 3 నిల్వలు ఉన్నాయని, వాటిని నేలకు తీసుకురాగలిగితే ఇంధన అవసరాలు పూర్తిగా తీరతాయన్నది మనకు ఇప్పటికే తెలిసిన విషయం.
ఎంత మోతాదులో...?
సరే... ఉల్కా శకలాల్లో ఖనిజాలు ఉన్నాయి. ఎంత మోతాదులో ఉన్నాయి? చిన్న ఉదాహరణ చూద్దాం. కేవలం 1.6 కిలోమీటర్ల వ్యాసమున్న ఉల్కా శకలాన్ని పూర్తిగా తవ్వుకోగలిగితే 20 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఖనిజాలు లభిస్తాయని కొంత మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే అంచనా కట్టారు. ఈ లెక్క కూడా ఇప్పటి ధరలు కాదు. 1997 నాటివి కావడం గమనార్హం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కిలోమీటర్ వ్యాసమున్న ఎం తరహా ఉల్కాశకలంలో దాదాపు 200 కోట్ల టన్నుల ఇనుము -నికెల్ సమ్మేళనం ఉంటుందని అంచనా. ఇక ‘16 సైకీ’ తరహా ఉల్కా శకలంలోని నికెల్ ఐరన్లు మన అవసరాలను కొనిన వేల ఏళ్లపాటు తీర్చగలవట. ఇక గురుగ్రహపు పరిసరాల్లోని చాలా శకలాలు, తోకచుక్కల్లో మంచు రూపంలో భారీ మోతాదులో నీరు ఉందని 2006లోనే కెక్ వేధశాల అంచనా కట్టింది.
ఒకొక్కరికీ వందకోట్ల డాలర్లు!
ఉల్కా శకలాలపై ఉన్న ఖనిజాల మొత్తం విలువపై అరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జాన్ ఎఫ్.లూయిస్ వేసిన లెక్క ఇది. ఉల్కా శకలాల నిర్మాణం, అందులోని ఖనిజాల సమ్మేళనాలపై పరిశోధనలు చేస్తున్న లూయిస్ లెక్క ప్రకారం మన సౌర కుటుంబంలో కిలోమీటర్ వ్యాసమున్న ఉల్కా శకలాలు కనీసం పది లక్షల వరకూ ఉన్నాయి. ఒక్కోటి 200 కోట్ల టన్నుల బరువు ఉంటాయనుకుంటే... అందులో మూడు కోట్ల టన్నుల నికెల్, 15 లక్షల టన్నుల కోబాల్ట్, 7500 టన్నుల ప్లాటినం ఉంటాయని ఆయన అంచనా. ఈ లెక్కన ఒక్క ప్లాటినం ఖరీదే 15000 కోట్ల డాలర్లు (ఆరు లక్షల కోట్ల రూపాయలు) ఉంటుందని ఆయన రాసిన ‘మైనింగ్ ది స్కై’లో పేర్కొన్నారు. ఇక మొత్తం ఉల్కా శకలాలపైని ఖనిజాల విలువను లెక్కిస్తే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చేయవచ్చుట!
వాడుకోవడం ఎలా?
ఉల్కా శకలాల్లో ఎంత విలువైన ఖనిజాలున్నప్పటికీ వాటిని తవ్వితీయడం, భూమికి తిరిగి తెచ్చుకోవడం అన్నది అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు. వాణిజ్యపరంగా చూస్తే లాభదాయకం కూడా కాదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ఖర్చులు తగ్గుతాయని, మానవ ప్రమేయం లేకుండా రోబోల సాయంతోనే మైనింగ్ చేపడితే ప్రయోజనం ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మనిషి భూమిని దాటి చంద్రుడు, ఇతర గ్రహాలపై నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో సుదూర అంతరిక్ష ప్రయాణాలకు అవసరమైన ఇంధనాన్ని ఉల్కాశకలాల మైనింగ్ ద్వారా తయారు చేసుకోవచ్చునని, తద్వారా ఖర్చులు తగ్గించవచ్చునని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే మనిషికి అత్యంత అవసరమైన నీటిని కూడా అంతరిక్షంలోనే పొందే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
ఎలా తవ్వితీస్తారు?
ఖనిజాలు తవ్వితీసేందుకు ఇప్పటికే చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. భూమ్మీద ఉపయోగించే పద్ధతులతోనే అక్కడ కూడా ఖనిజాలను తవ్వుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉల్కా శకలాల పైపొరలపై గుట్టలుగా పడి ఉన్న ఖనిజాలను స్ట్రిప్ మైనింగ్ పద్ధతిలో సేకరించవచ్చునని వారు అంటున్నారు. ఉల్కా శకలాల స్థానం, కదలికలపై స్పష్టమైన అవగాహన ఉంటే దానిపై ఓ మైనింగ్ యంత్రాన్ని దింపి ఖనిజాలు తవ్వవచ్చు, ఆ తరువాత శుద్ధి చేసే కేంద్రానికి తరలించవచ్చు. ఇనుము లాంటి ఖనిజాల విషయంలో అయస్కాంతాలను కూడా వాడవచ్చునని అంచనా.
అక్కడికక్కడే మైనింగ్ యంత్రాల తయారీ!
చంద్రుడిపైని మట్టిని శుద్ధి చేసి విలువైన ఇంధనం, ఖనిజాలను తవ్వితీసేందుకు 1980 ప్రాంతంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఓ వినూత్న ప్రతిపాదన చేసింది. అత్యంత ఆధునికమైన, సంక్లిష్టమైన ఫ్యాక్టరీ ఒకదానిని ఏర్పాటు చేయడం.. ఆ తరువాత అలాంటి ఫ్యాక్టరీలు అక్కడికక్కడే ఆటోమెటిక్గా తయారయ్యేలా చేయడం ఈ ప్రతిపాదన ముఖ్యాంశాలు. ఎలక్ట్రానిక్ పరికరాల సైజు ఎప్పటికప్పుడు తగ్గిపోతూండటం, త్రీడీ ప్రింటింగ్, నానోటెక్నాలజీలో సాధించిన పురోగతిని పరిగణలోకి తీసుకుంటే ఇది అసాధ్యమేమీ కాకపోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more