తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కుతుందా? స్పెషల్ ప్యాకేజీతోనే సరిపెడతారా ? ఈ రెండు కాకుండా మరెదైనా ఆఫ్షన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందా? అలా కాకుండా అసలేమీ ఇచ్చేది లేదని అంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం నేడు రాజ్యసభలో దొరకనుంది. గురువారం ఆయా పార్టీల సభ్యులు రాజ్యసభలో చేసిన డిమాండ్లపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేడు వివరణ ఇవ్వనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై నిన్న సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలోని అధికార, విపక్షాలకు చెందిన సభ్యులతో పాటు జాతీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా కేవీపీ బిల్లుపై ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని అన్ని పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో సభలో బీజేపీ ఒంటరి అయిపోయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా దీనిపై ప్రసంగించినా... బీజేపీకి ఏమాత్రం లాభం చేకూరకపోగా, విపక్ష నేతలు ఎదురు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల సభ్యులు చేసిన డిమాండ్లపై ప్రభుత్వం తరఫున నేడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ... రాజ్యసభ నాయకుడి హోదాలో సమాధానం చెప్పనున్నారు. ఈ ప్రసంగంలోనే కేంద్రం నుంచి ఏపీకి ఏఏ ప్రయోజనాలు చేకూరనున్నాయన్న విషయాన్ని జైట్లీ స్పష్టంగా పేర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జైట్లీ ప్రసంగంపై ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా ఆసక్తి నెలకొంది.
ఎవరెవరు ఏం మాట్లాడారు:
ఏపీకి ప్రత్యేకహోదాపై ఐదు నిమిషాలు మాట్లాడాలని కేవీపీకి డిప్యూటీ ఛైర్మన్ చెప్పగానే ఈ చర్చ జరుగుతోందే తనవల్ల అని, అలాంటిది తనకు ఐదు నిమిషాలు ఇవ్వడమేంటని ఆయన మండిపడ్డారు. రాజ్యసభకు వచ్చే ఏ బిల్లు అయినా బడ్జెట్ బిల్లేనని కేవీపీ రామచంద్రరావు తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభకు వచ్చే ప్రతి బిల్లు చిట్ట చివరన మనీ బిల్లుగా మారేదేనని అన్నారు. అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు మాత్రమే మనీ బిల్లు ఎందుకు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను ప్రతిపాదించిన బిల్లును వెనక్కి తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. తన బిల్లు ఎప్పుడు చర్చకు వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుట్రతోనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. దర్మోరక్షితిః రక్షితః అని ఆయన ఆర్యోక్తిని ప్రస్తావించారు.
కాంగ్రెస్ తరపున గులాంనబీ అజాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడానికి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వడానికి చాలా తేడా ఉందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు కనీసం రాజధాని కూడా లేదని అన్నారు. పదేళ్ల పాటు వాళ్లు వేరే రాజధానిలో ఉండాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అలాంటి వారు నిలబడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన అన్నారు. ఇది మనీ బిల్లా? లేక సాధారణ బిల్లా? అన్న మీమాంసను పక్కన పెట్టి, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన సూచించారు. ఏపీ ప్రజలంతా నిరాశలో ఉన్నారని, వారి నిరాశను ఆశగా మార్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన తెలిపారు.
టీడీపీ తరపున టీజీ వెంకటేష్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఐదేళ్లు ఇస్తామని నాటి ప్రధాని ప్రకటించారని, అయితే, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని అప్పుడు ఈ సభలోనే డిమాండ్ చేశారని తెలుగుదేశం సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఏపీ డెవలెప్ అయ్యేందుకు అవసరమైన సహాయం చేస్తామని చట్టంలోనే ఉందని ఆయన చెప్పారు. ఆర్థిక లోటు రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా ఇస్తే... రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్రం అందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు అందుకు సహకరించడం లేదని ఆయన తెలిపారు. ఏపీలో 2019 వరకు ఆర్థిక లోటు ఉంటుందని ఆర్థిక సంఘం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ తరపున విజయసాయి రెడ్డి : బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని అన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సంజీవనేనని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం ద్వారా ప్రజలకు నిలదొక్కుకునే వెసులుబాటు కలుగుతుందని ఆయన తెలిపారు. ప్రజాసమస్యలు పరిష్కరించడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమైనప్పుడు, ప్రజాకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని, అందుకే ఏపీకి తక్షణం ప్రత్యేకహోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ తరపున కేకే : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. రాజ్యసభలో దేనినైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని అన్నారు. మాజీ ప్రధాని చేశారు కనుక తాము చేయమని అనడం సరికాదని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదాలో ఏమేం ఇవ్వాలనుకుంటున్నారో ఒక క్లారిటీకి వచ్చి, ఏపీకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన సందర్భంగా తెలంగాణకు కూడా అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ రాజ్యసభలో తెలంగాణకు మద్దతుగా ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ రెండు రాష్ట్రాలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏపీతో పాటు తమకు కూడా సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు.
వీరితోపాటు వామపక్షాల సీపీఎం తరపున సీతారాంఏచూరి, సీపీఐ తరపున డీ.రాజా, బిజూ జనతాదళ్, జేడీయూ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీ, టీఎంసీ ఎంపీ సుఖేందు రాయ్ తదితర జాతీయ పార్టీలు హోదాకు మద్ధతుగా గళం వినిపించాయి.
చివరగా బీజేపీ తరపున వెంకయ్యనాయుడు :
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మనసులో ఉందన్న సంగతిని తాను కూడా అంగీకస్తానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే అది చట్టంలో లేనప్పుడు తాము మాత్రం ఏం చేయగలమని ఆయన ప్రశ్నించారు. ప్రాథమికంగా కాంగ్రెస్ తప్పులు చేస్తే... వాటిని తాము సరిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. అయితే మనసులో ఉన్న కోరికలు చట్టాలు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ కు చాలా చేయాలని తమకు ఉందని ఆయన తెలిపారు. అయితే తాము కేంద్ర ప్రభుత్వంలో భాగమని అన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రము ఎలాగో ఏపీ కూడా అలాగేనని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఏపీ భవిష్యత్ తరాలను గుర్తుంచుకుని అక్కడి ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్న సంగతి తమకు తెలుసని, అయితే తమకు కూడా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించుకుని వెళ్తున్నామని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదాపై చర్యలకు అటార్నీ జనరల్ ను అధ్యయనం చేయాలని ఆదేశించామని, ఆ నివేదిక వచ్చిన తరువాత ప్రత్యేకహోదాపై చర్చలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more