శరన్నవరాత్రులలో ఒకటైన మహానవమి నాడు శ్రీ సరస్వతీ పూజ చేసుకుంటారు. శ్రీ సరస్వతి పరమశివునికి సోదరి. ఆశ్వయుజ శుక్ల పక్షమున మూల నక్షత్రంనాడు చక్కని పీఠముపై తెల్లని శుభ్రమైన పట్టు వస్త్రాలను పరిచి, దానిపై పుస్తకాలను అమర్చి పెట్టాలి. ఆ పుస్తకాలపై సరస్వతీదేవిని ఆహ్వానించాలి. ఆహ్వానించే ముందు కాస్త ధ్యానం చేసుకోవాలి. అందుకై చేతిలో అక్షతలు, పూలు పెట్టుకుని, పూజాపీఠానికి ముందు సుఖాసనంలో కూర్చుని - వెన్నుపూస, మెడ, తల ఒకే వరుసలో వుండేటట్లు నిటారుగా కూర్చోవాలి. ఆ అమర్చిన పుస్తకాలలో సరస్వతీ దేవి అమ్మవారు ప్రకాశిస్తున్నట్లు భావించాలి. ఈ క్రింది శ్లోకాలను చదువుతూ - వాటి అర్థాన్ని గుర్తు చేసుకుంటూ పూలను, అక్షతలను ఆ పుస్తకరూప సరస్వతీదేవిపై వేయాలి. అమ్మవారు ఆ దివ్య ప్రకాశము మన శ్వాసరూపంలో మనలోనికి ప్రవేశిస్తున్నట్లు భావించుకోవాలి.
ధ్యాన శ్లోకములు :
నమస్కృత్య జగత్పూజ్యాం శారదాం విశద ప్రభామ్!
శ్రిత పద్మాసనాం దేవీం త్ర్యంబకీం శశి భూషణామ్!!
పద్మముపై కూర్చుని వున్నది, మూడు కళ్లతో చన్ద్ర రేఖతో, నిర్మలమైన కాంతితో శోభిల్లుచున్నది - సమస్త జగత్తులకు (బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త దేవతలకు కూడా) పూజ్యురాలైన శారదా (సరస్వతీ) అమ్మవారికి నమస్కరించుచున్నాను - అని శ్లోక భావము. ఇది ‘‘వ్రత చూడామణి’’ అను గ్రంథమున వున్న శ్లోకము.
ప్రణవాసన మారూఢాం తదర్థత్వేన నిశ్చితామ్!
సితేన దర్ఫణాభేన వస్త్రేణ పరిభూసితామ్!!
శబ్దబ్రహ్మాత్మికాం దేవీం శరచ్చన్ద్ర నిభాననామ్!!
ప్రణవమే (ఓంకారమే) అమ్మవారి ఆసనం. ఆ ఓంకారము తెలియజేసే వస్తువు అమ్మవారే అని ఉపనిషత్తులు నిర్ణయించి చెప్తున్నాయి. శబ్దము (వేదము/నాదము) ఆమె స్వరూపము. సాకార రూపమున ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. ఆమె అద్దమువలె స్వచ్ఛముగా తెల్లగావున్న వస్త్రముతో భాసిల్లుచున్నది. అట్టి దేవిని ధ్యానించుచున్నాను - అని ఈ శ్లోక భావము. ఇది కల్పయజ్ఞరి అను గ్రంథములోనిది. ఇలా ధ్యానించిన పిదప - ఆహ్వానించాలి.
అత్రాగచ్ఛ జగద్వన్ద్యే సర్వలోకైక పూజితే!
మయా కృతామిమాం పూజాం సంగృహాణ సరస్వతి!!
సమస్త లోకాలచే పూజింపదగిన దానివి, అందరిచే పూజింపబడే ఏకైక దేవతవూ అయిన ఓ సరస్వతీ దేవి, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి మా పూజని స్వీకరించు తల్లీ! - అని దీని భావం.
మూలనక్షత్రం రోజున ఇలా అమ్మవారిని ఆహ్వానించి, లఘుపూజ చేయాలి. మరునాడు పూర్వాషాఢనాడు కూడా పున:పూజ చేయాలి. మహానవమినాడు ఉత్తరాషాఢలో మహానైవేద్యాన్ని సిద్ధం చేసుకుని - ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, మధుపర్కము, పంచామృతస్నానము, వస్త్రయుగ్మము (పట్టుచీర, రవిక),ఉపవీతము (వల్లెవాటు), ఆభరణములు, పసుపు, కుంకుమ, కాటుక, గంధము, అక్షతలు, పూలమాలలు సమర్పించి, పుష్పాదులతో పూజించి, ధూప, దీప, నైవేద్య, తాంబూలాదుల సమర్పించి, కర్పూర హారతినిచ్చి, మంత్ర పుష్పాంజలి నొసగి, ప్రదక్షిణ నమస్కారాలను చేయాలి. ఆయా ఉపచారాలకై పూజా గ్రంథాలలో శ్లోకాలు వుంటాయి. వాటితో చేయాలి. పూజలు ముందుగా అష్టవిధ పుష్పాలని సమర్పించాలి.
అవి -
అర్క చంపక పున్నాగ నన్ద్యావర్తం చ పాటలం!
బృహతీ కరవీరం చ ద్రోణపుష్పాణి చార్చయేత్!!
అర్క (జిల్లేడు), చంపక (సంపెంగ), పున్నాగ, నన్ద్యావర్త (నందివర్ధన), పాటల (కలికొట్టు/ఎర్రలొద్దుగ), బృహతి (వాకుడు), కరవీర (ఎర్రగన్నేరు), ద్రోణ (తుమ్మి) అనునవి. ఈ సమర్పణ ఈ క్రింది విధముగా అమ్మవారి ఎనిమిది నామములను స్మరిస్తూ చేయాలి.
1. సరస్వత్యై నమ:- అర్కపుష్పం పూజయామి.
2. భారత్యై నమ: - చంపక పుష్పం పూజయామి
3. వాగ్దేవతాయై నమ:- పున్నాగ పుష్పం పూజయామి
4. మాతృకాయై నమ: - నన్ద్యావర్త పుష్పం పూజయామి.
5. హంసాసనాయై నమ:- పాటల పుష్పం పూజయామి.
6. చతుర్ముఖ ప్రియాయై నమ: - బృహతీ పుష్పం పూజయామి.
7. వేద శాస్త్రార్థ తత్త్వజ్ఞాయై నమ:- కరవీర పుష్పం పూజయామి.
8. సకల విద్యాధిదేవతాయై నమ:- ద్రోణ పుష్పం పూజయామి.
ఆపైన సర్వాంగ పూజ, అష్టోత్తర శతనామ పూజ, సహస్రనామ పూజలు (వీలువెంట) చేయాలి.
1. దోర్భిర్యుక్తా చతుర్భి: స్ఫటిక మణిమయీ మక్షమాలాం దధానా
హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ!
భాసా కున్దేన్దుశజ్ఞ స్ఫటిక మణినిభా భాసమానాఁ సమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా!!
2. చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ!
సా దేవీ కృపయా మహ్యం జిహ్వాసిద్ధం కరోతు చ!!
అను శ్లోకాలతోనూ, ఇంకా కల్ప (పూజా) గ్రంథాలలోని మరికొన్ని శ్లోకాలతోనూ (అర్థ భావన చేస్తూ) ప్రార్థన చేయాలి.
పై రెండు శ్లోకాలా భావాలు....
1. అమ్మవారు - నాలుగు చేతులలో ఒక దానితో స్ఫటిక మణులతో చేసిన అక్షమాలని (జపమాలని), మరొక చేతిలో తెల్లని పద్మాన్ని, మరొక చేతితో చిలుకనీ, నాలుగవ చేతితో పుస్తకాన్ని ధరించియున్నది. కుందములు (మొల్లపూలు), చంద్రుడు, స్ఫటికమణి, శంఖము వీటి వీటి రంగుల (కాంతుల)లోని శోభతో వెలుగొందుచున్నది. కాంతి, శక్తి, దయ ఇలా అన్ని విషయాలలో ఆమె సాటిలేని మేటి. వాగ్దేవత (విద్యాధీశ్వరియైన) ఆ సరస్వతీ తల్లి సర్వదా నిండు దయతో నా ముఖము నందు నివసించుచుండు గాక! (సమస్త శుభ విద్యలు - అనగా అందరికి అన్ని విధముల శుభమును కలిగించే విద్యలన్నీ నాకు లభించి - సర్వదా నా స్ఫురణలో వుండాలి - అని భావం)
2. పద్నాలుగు విద్యలలోను నిత్యం క్రీడిస్తూ ఆనందిస్తూ వుండే ఆ సరస్వతి - దయచేసి - నాకు వాక్సిద్ధిని అనుగ్రహించాలి (అనగా విద్యలన్నీ నా వాక్కుకి అందతూ వుండాలి). (నాలుగు వేదాలు + ఆరు వేదాంగాలు + తర్క + మీమాంసా శాస్త్రాలు + పురాణేతిహాసాలు + ధర్మశాస్త్రాలు = ఈ పద్నాలుగు మన భారతీయుల విద్యలు. చతుర్దశ విద్యలు. అందరికీ అన్ని విధములైన శుభములను కలిగించే విద్యలు).
వేదాంగాలు ఆరు ఏమనగా - శిక్ష (వేదోచ్చారణ పద్ధతిని తెలిపేది), వ్యాకరణమ్ (మాటల స్వరూప విశేషాలని తెలిపేది), జ్యోతిష్యమ్ (కాల విశేషాలని తెలిపేది), నిరుక్తము (మాటల అర్థాన్ని నిరూపించేది), చంధస్సు (అక్షర సముదాయాల విశేష ప్రభావాన్ని తెలిపేది), కల్పము (యజ్ఞయాగములు, వివాహోపనయనాది క్రియా కలాపములు, పూజలు మున్నగువానిని విధివిధానాలను తెలిపేది.
పరమాత్మ స్వత: నిరాకారుడే అయినా - భక్తులను అనుగ్రహించడానికి - వారివారి భావానుగుణాలైన దివ్య రూపాలని ధరిస్తూనే వుంటాడు. కరిగిన నెయ్యి చల్లారాక తెల్లగా ముద్దగా అయినట్లే - పరమాత్మ కూడా భక్తుల చల్లని ప్రేమాభిమానాలకి అనుగుణంగా దివ్యమైన స్వచ్ఛమైన శ్వేతవర్ణాన్ని స్వీకరిస్తాడు. సరస్వతీ దేవిని ధ్యానించేటప్పుడు, ఆరాధించేటప్పుడు అకారాది క్షకారాంత మాత్రా వర్ణములే (అక్షరములే) సరస్వతీ రూపమున మూర్తీభవించినట్లు భావించాలి. సరస్వతీదేవిని ఈ విధంగా పూజించి - మహానవమినాడు అన్నబలిని (నైవేద్యాన్ని) సమర్పించి, శ్రవణ నక్షత్రమున ఉద్వాసన చెప్పాలి. చెప్పి పుస్తకాలని చదువుకోవడం మొదలుపెట్టాలి. (దసరాలలోని) మూల - పూర్వాషాఢ - ఉత్తరాషాఢలలో మౌనము పాటించి - శ్రవణం నాడు పుస్తక పఠనం ప్రారంభిస్తే చదువులు బాగా వస్తాయి. మాటలలో నేర్పరితనం కలుగుతుంది. చదువుల సారం వంటిబట్టి జ్ఞానం సత్ఫలితాలనిస్తుంది.
విమలపటీ కమలకుటీ! పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటీ!!
కామాక్షి పక్ష్మలాక్షీ! కలిత విపజ్ఞ్చీ విభాసి వైరించీ!!
ఓ కామాక్షీ! (క్రీగంటి చూపులతోనే కోరికలను ఈడేర్చే తల్లీ) నీవు శుభ్రమైన (తెల్లని) వస్త్రముతో - కమలాసనమున కూర్చుండి - చేతులతో పుస్తకమును రుద్రాక్షమాలని ధరించి అందమైన కళ్లు కలిగియుండి, వీణను చేపట్టి సరస్వతీ రూపమున విరాజిల్లుచున్నావు.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more