మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో హైప్ అధికంగా వుంది. ఇటీవలే ఓ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న రాంచరణ్.. తన తండ్రితో కలసి మరో హిట్ అందుకుంటాడని మెగా అభిమానులు సంబరపడుతున్నారు. వరుస విజయాలతో తక్కువ సమయంలోనే స్టార్ దర్శకుడిగా ఎదిగిన కొరటాల శివ సినిమాలపై... మొదట్నుంచీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది 'ఆచార్య'. అభిమానుల్నైతే మరింతగా ఊరించిన కలయిక ఇది. అయితే కరోనా కష్టాలతో చాలా రోజులు సెట్స్పైనే మగ్గిందీ చిత్రం. అయినా సరే, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఎట్టకేలకి ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
800 యేళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ టౌన్ ధర్మస్థలి. ధర్మానికి... ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి. అక్కడ అధర్మం చోటు చేసుకున్నప్పు అమ్మవారే ఏదో రూపంలో వచ్చి ధర్మాన్ని నిలబెడుతుంటుంది. అమ్మవారి పాదాల చెంత ధర్మమే పరమావధిగా నివసిస్తున్న ఓ చిన్న తండాకి పాదఘట్టం అని పేరు. ఆ పాదఘట్టం, దానిపక్కన ఉన్న సిద్ధవనంపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడుతుంది. ధర్మస్థలిపై కూడా బసవ (సోనూసూద్) పాగా వేస్తాడు. ఎదురొచ్చినవాళ్లని అంతం చేస్తూ అక్రమాలు కొనసాగిస్తుంటాడు. పాదఘట్టం జనాల్ని, ధర్మస్థలిని కాపాడేవారే లేరా అనుకునే సమయంలో కామ్రేడ్ ఆచార్య (చిరంజీవి) వస్తాడు. ఇంతకీ ఆచార్య ఎవరు?ఆయన్ని ఎవరు పంపించారు? ధర్మస్థలిలోనే పెరిగిన సిద్ధ (రామ్చరణ్)కీ, ఆచార్యకీ సంబంధమేమైనా ఉందా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
తన మార్క్ రచనతో ప్రేక్షకులపై బలమైన ప్రభావం కనిపించేలా చేసే దర్శకుడు కొరటాల శివ. ఆయన్నుంచి సినిమా అదీ కూడా చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడు తోడయ్యాడు కాబట్టి ఓ కొత్త కథో, లేదంటే ఇంకేదైనా బలమైన అంశమో ఊహిస్తారు ప్రేక్షకులు. కానీ కొరటాల మాత్రం ఈసారి తన రచనలోని బలం కంటే కూడా... చిరంజీవి, రామ్చరణ్ల స్టార్ వ్యాల్యూనే ఎక్కువగా నమ్ముకున్నట్టున్నారు. వాళ్ల ఇమేజ్కి తగ్గ కమర్షియల్ అంశాల్ని మాత్రమే జోడించి 'ఆచార్య'ని తీర్చిదిద్దారు. ఇందులో కాలం చెల్లిన కథ, కథనాలు తప్ప కొరటాల మార్క్ అంశాలు ఎక్కడా కనిపించవు. టెంపుల్ టౌన్ అంటూ ప్రేక్షకుల్ని ధర్మస్థలి ప్రపంచంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు.
పాదఘట్టం పరిచయం తర్వాత, ఆచార్య ధర్మస్థలిలోకి అడుగు పెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ధర్మస్థలిలో అధర్మానికి కారణమవుతున్న బసవ ముఠా ఆగడాల్ని ఆచార్య అడ్డుకోవడమే ప్రథమార్ధమంతా. పోరాట ఘట్టాలు, పాటలతో సినిమా ముందుకు సాగుతుంది. కథలో మాత్రం ఎక్కడా ఆసక్తి రేకెత్తదు. విరామానికి ముందు సిద్ధ పాత్ర పరిచయం కావడంతో ద్వితీయార్ధంపై కాసిన్ని ఆశలు రేకెత్తుతాయి. సిద్ధగా రామ్చరణ్ కాసేపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడు. కానీ, కాసేపటి తర్వాత తొలి భాగంలో చూసినట్టుగానే మళ్లీ అదే పాదఘట్టం, అక్రమార్కుల ఆగడాలే ఆవిష్కృతమవుతాయి. సిద్ధ ఎవరు? తను ఎలా ధర్మస్థలిలోకి వచ్చాడనే విషయాలు కాసిన్ని భావోద్వేగాల్ని పంచుతాయి.
సిద్ధపై బసవ గ్యాంగ్ దాడి తర్వాత కథ అడవుల్లోకి మారుతుంది. ధర్మస్థలికి ముప్పు పొంచి ఉందని అర్థమైనా... దాన్ని మరిచిపోయి ఆచార్యతో కలిసి సిద్ధ ప్రయాణం చేయడంతో కథ పక్కకు మళ్లినట్టు అనిపిస్తుంది. చిరంజీవి, రామ్చరణ్ల పాత్రల్ని, కథ నడిచే టెంపుల్ టౌన్నీ, ఇతరత్రా పాత్రల్ని బలంగానే డిజైన్ చేసినా... కథ కథనాల పరంగా మాత్రం దర్శకుడి పనితనం తేలిపోయింది. దాంతో ప్రతీ సన్నివేశం గ్రాండియర్గా కనిపించినా దాని తాలూకు ప్రభావం మాత్రం ప్రేక్షకుడిపై మచ్చుకైనా కనిపించదు. చిరంజీవి, రామ్చరణ్ కలిసి కనిపించే సన్నివేశాలు మాత్రం అభిమానులకి కిక్నిచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా భలే భలే బంజారా పాటలో ఇద్దరి నృత్యం చాలా బాగుంటుంది.
నటీనటుల విషాయానికి వస్తే..
మెగాస్టార్ చిరంజీవి కామ్రేడ్ ఆచార్యగా చక్కటి అభినయం ప్రదర్శించారు. ఆయన కనిపించిన విధానంతోపాటు పోరాట ఘట్టాలు, డ్యాన్సులతో అలరించారు. అటు మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ద్వితీయార్ధం మొత్తం కనిపిస్తారు. వాళ్లిద్దరివే బలమైన పాత్రలు. సోనూసూద్, జిషూసేన్ గుప్తా ప్రధాన ప్రతినాయకులుగా కనిపిస్తారు. పూజాహెగ్డే పాత్రకిపెద్దగా ప్రాధాన్యం లేదు. సిద్ధని ప్రేమించిన యువతిగా కనిపిస్తుందంతే. నీలాంబరి పాటలో అందంగా కనిపించింది. రెజీనా శానాకష్టం అంటూ సాగే ప్రత్యేకగీతంలో సందడి చేసింది. బెనర్జీ, తనికేళ్ల భరణి తదితరలు తమ పాత్ర పరిధి మేరకు పండించారు.