ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల తర్వాత స్వప్నాసినిమాస్ సంస్ధ ముచ్చటగా మూడో చిత్రంగా నిర్మించిన సినిమా జాతిరత్నాలు. దీంతో జాతిరత్నాలు చిత్రంపై మొదటి నుంచి అంచానాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే వున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరో నవీన్ పోలిశెట్టి.. అంతుకుముందు వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది. దీంతో పాటు అతను హిందీలో నటించిన చిచోరే చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో నవీన్ నటిస్తున్న జాతిరత్నాలు చిత్రంపై మొదటి నుంచి అంచనాలు బాగానే వున్నాయి.
ఇక దీనికి తోడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ట్రైయిలర్ విడుదల చేయడంతో అది కూడా చిత్ర ప్రచారానికి మంచి ఊపు తీసుకువచ్చింది. ఇక దీనికి తోడు విజయ దేవరకోండ తో చిత్ర ప్రి-రిలీజ్ కు ముఖ్యఅతిధిగా విచ్చేసి.. వరంగల్ వేదికగా చిత్ర ప్రమోషన్ చేయడంతో జాతిరత్నాలు చిత్రాన్నికి అన్ని కలిసివచ్చాయి. దీంతో జాతి రత్నాలు చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్ని ఎదురుచూపులు కూడా మొదలయ్యాయి. మరిన్ని అంచనాలకు, ఎదురుచూసులకు సరిపోయే రేంజ్లో జాతిరత్నాలు సినిమా ఉందా లేదా….అంటే ఆ వివరాలలోకి వెళితే తెలుస్తుంది.
కథ
జోగిపేట అనే ఓ గ్రామంలో శ్రీకాంత్ అనే కుర్రాడు, వాడి ఇద్దరు ప్రెండ్స్ ఇద్దరు. ముగ్గురూ కలసి బలాదూర్గా ఊళ్ళో వాళ్ళవాళ్ళ తలిదండ్రులకి తలనొప్పి తెప్పించే పనులు చేస్తూ ఇష్టానికి తిరుగుతుంటారు. తాము తెలివైన వాళ్లమని భావించుకునే తింగరి కుర్రాళ్లు. జోగిపేటలో అల్లరి చిల్లరగా తిరుగుతూ జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటారు. అందులో శ్రీకాంత్కి ఓ శారీ, మేచింగ్ గాజుల దుకాణం నడుపుతుంటాడు. కానీ శ్రీకాంత్కి ఆ ఆడంగి గుర్తింపు ససేమిరా ఇష్టం లేక హైదరాబాద్ వచ్చి, మెడలో టేగ్ వేసుకుని స్టయిల్గా అందరి యూత్లాగే ఉండాలన్నది తాపత్రయం.
లైఫ్లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్లతో ఛాలెంజ్ చేసి జోగిపేట నుంచి హైదరాబాద్కి వస్తారు.చివిరికి రెండు నెలలలో హైదరాబాద్లో ఉద్యోగం సంసాదించి సెటిల్ అవుతానని, సంపాదించలేకపోతే మళ్ళీ జోగిపపేట తిరిగొచ్చి శారీ సెంటరే నడుపుకుంటానని ప్రామిస్ చేసి మరీ హైదరాబాద్ ప్రయాణమవుతాడు. శ్రీకాంత్తో పాటు వాడికిష్టం లేకపోయినా కూడా ఇద్దరు ఫ్రెండ్స్ శ్రీకాంత్తో పాటు వెంటపడి మరీ హైదరాబాద్ వచ్చేస్తారు. తీరా వచ్చాక అసలైన తిప్పలు మొదలవుతాయి ముగ్గురికి. ఈ ప్రయాణంలోనే అనుకోకుండా ముగ్గురూ ఓ మర్డర్ కేసులో వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇరుక్కుంటారు. ఆ మర్డర్ కేసులోనుంచి ఎలా ముగ్గురూ బైటపడతారు అన్నదే కధా సారాంశం.
విశ్లేషణ
కథగా చెప్పుకోవాలంటే ఇది చాలా చిన్నలైన్. ముగ్గురు సిల్లీఫెలోస్ని ఓ పెద్ద క్రైంలో ఇరికిస్తే ఏమవుతుంది? దాని నుంచి వాళ్లెలా బయటపడ్డారు? అన్నది అసలు కథ. ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా ఆద్యంతం వినోదం పంచడమే లక్ష్యంగా కొనసాగుతుంటుంది. అలాగని కథలో ఎక్కడా బలవంతంగా ఇరికించిన కామెడీ ట్రాక్లు ఉండవు. శ్రీకాంత్, శేఖర్, రవిల పాత్రల్ని దర్శకుడు తీర్చిదిద్దుకున్న విధానంలోనే చక్కటి వినోదం నిండి ఉంటుంది. అమాయకత్వంతో నిండిన అవతారాలతో తింగరి పనులు చేస్తూ వాళ్లు పంచే వినోదం ప్రేక్షకుల్ని కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఆరంభంలో ఈ ముగ్గురి పాత్రల్ని పరిచయం చేస్తూ వచ్చే సన్నివేశాలతో దర్శకుడు ప్రేక్షకుల్ని మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ ముగ్గురూ హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగే ప్రతి ఎపిసోడ్ సరదాగా సాగిపోతుంటుంది. శ్రీకాంత్ తొలి చూపులోనే చిట్టిని ఇష్టపడటం.. అతని అమాయకమైన చేష్టలకు ఆమె కూడా ప్రేమించటం.. ఈ నేపథ్యంలో చిట్టి తండ్రికీ శ్రీకాంత్కీ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో ఎలాంటి మలుపులు లేకుండా కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. ముఖ్యంగా వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ నవీన్ చేసే హంగామా.. ఫోన్లో సువర్ణ అనే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ రాహుల్ చేసే అల్లరి.. మధ్య మధ్యలో వంట పేరుతో ప్రియదర్శి పంచే నవ్వులూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఎమ్మెల్యేపై హత్యాయత్నంతో విరామం ముందు కథను మలుపు తిప్పాడు దర్శకుడు.
ప్రథమార్ధంలో నవ్వులు పంచుతూనే కథను పరుగులు పెట్టించిన దర్శకుడు.. ద్వితీయార్ధంలో ఆ నవ్వుల సందడిలో పడి కథని పూర్తిగా పక్కదారి పట్టించాడనిపిస్తుంది. ముఖ్యంగా సీరియస్గా సాగాల్సిన చాలా ఎపిసోడ్లని సరదాగా.. లాజిక్కులకు దూరంగా నడిపించేశాడు. అయితే ఓవైపు కథ గాడి తప్పినట్లు అనిపిస్తున్నా.. నవీన్, రాహుల్, దర్శిలు పంచే వినోదంలో ఆ లాజిక్కులు పెద్దవిగా కనిపించవు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఇంటారాగేషన్ సీన్లో, క్లైమాక్స్లో వచ్చే కోర్టు సన్నివేశాల్లో నవీన్ కామెడీ టైమింగ్ అందరినీ కట్టిపడేస్తుంది. నిజానికి సీరియస్గా సాగాల్సిన ఈ సన్నివేశాల్ని కాస్త పకడ్బందీగా రాసుకునే ప్రయత్నం చేస్తే ద్వితీయార్ధం, క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండేవి.
నటీనటుల విషాయానికి వస్తే..
నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలపైనే సినిమా అంతా రన్ అవుతుంది. ముగ్గురికి ముగ్గురూ పేరు పెట్టడానికి లేని విధంగా నటించారు. ఎవరి పాత్రలో వాళ్ళు ఇమిడిపోయి, మోస్ట్ నేచురల్ పెరఫారమెన్స్తో ఆడియన్స్ని నవ్వుల్లో ముంచెత్తారు అంటే అతిశయోక్తి కానేకాదు. ఇందులో మళ్ళీ నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాబట్టి, బలంగా లేని చాలా సన్నివేశాల్ని సైతం తన కామెడీ టైమింగ్తో ఎంతో చక్కగా నిలబెట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే కోర్టు ఎపిసోడ్లో నవీన్ నటన ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. సినిమా చాలా ఇంట్రస్టింగ్గా అనిపించడానికి ఎక్కువ బాధ్యత నవీన్ భుజాల మీదే పడింది. ఆ బాధ్యతని నవీన్ చాలా ఈజీగా నిర్వర్తించాడు.
నవీన్ బాడీ లాంగ్వేజ్ గానీ, ఎక్స్ప్రెషన్స్గానీ, డైలాగ్ డెలివరీ గానీ…..వేటికవే జోగిపేట శ్రీకాంత్ క్యారెక్టర్కి బాగా సూటయ్యాయి. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వారివారి పాత్రల పరిధి మేరకు ఎక్కడా ఏ లోటూ రానీయలేదు. మురళీశర్మ చనిపోయాడనుకొని.. ఆయన బాడీని మాయం చేసేందుకు వాళ్లు చేసే ప్రయాత్నాలు సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక చిట్టి పాత్రలో ఫరియా అబ్దుల్లా కొత్త అమ్మాయే అయినా తన షేర్ని బాగా క్యారీ చేసింది. కోర్టు డ్రామా సినిమాలు చూసి కోర్టులో వాదనలు వినిపించే లాయర్గా ఆమె పండించిన వినోదం అందరినీ అలరిస్తుంది. జస్టిస్ బల్వంత్ చౌదరిగా బ్రహ్మానందంని చూపించిన విధానం బాగుంది. మురళీశర్మ, బ్రహ్మాజీ తదితరులు గురించి ప్రత్యేకంగా వివరించనే అక్కర్లేదు. అనుభవజ్ఞులు కాబట్టి సులభంగా చేసేశారు.