భూపతి (ప్రకాష్రాజ్) రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగిన ఓ మాఫియా నాయకుడు. ఆయన ముగ్గురు కొడుకులే వరద (అరవిందస్వామి), త్యాగు (అరుణ్ విజయ్), రుద్ర (శింబు). వరద తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ చెప్పిన పనుల్ని చక్కబెడుతుంటాడు. త్యాగు, రుద్రలు విదేశాల్లో స్థిరపడి స్వతంత్రంగా బతుకుతుంటారు. ఇంతలో భూపతి, ఆయన భార్య లక్ష్మి (జయసుధ)పై హత్యాయత్నం జరుగుతుంది. అందుకు కారణం భూపతి శత్రువైన చిన్నప్ప (త్యాగరాజన్)ను అందరూ అనుమానిస్తారు.
కానీ, అది ఆయన పని కాదని భూపతికి తెలుస్తుంది. అయితే తనపై ఎవరు హత్యాయత్నం చేశారన్నది భూపతికి తెలిసిపోతుంది. ఇంతకీ హత్యకు పాల్పడింది ఎవరు? వాళ్లపై భూపతి, అతని కొడుకులు కక్ష తీర్చుకునేందుకు ఏం చేశారు? తండ్రి స్థానంలో ఎవరు అనే ప్రశ్న మొదలయ్యాక ముగ్గురు అన్నదమ్ముల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? వాళ్ల కుటుంబానికి దగ్గరగా ఉండే ఇన్ స్పెక్టర్ రసూల్ (విజయ్ సేతుపతి) కథేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
మాఫియా కథలను తనదైన శైలిలో రూపోందించడం మణిరత్నంకు వెన్నతో పెట్టిన విద్య. మరోసారి ఆ నేపథ్యాన్ని ఎంచుకుని.. దానికి కుటుంబ ఆధిపత్య పోరుని మేళవించి రూపొందించిన చిత్రమే నవాబ్. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ కథ ఇది. అయితే మణిరత్నం మార్క్ కవితాత్మకత వల్ల కథలో స్టోరి నరేషన్ నెమ్మెదిగా సాగింది. దాంతో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తూ, కథ ఎంతకీ ముందుకు సాగడం లేదనే అభిప్రాయాన్ని కలగజేస్తాయి. ఈ తరహా చిత్రాలకి వేగమే కీలకం.
ముందు ఇదొక గ్యాంగ్ వార్ కథగా మొదలవుతుంది. ఆ తర్వాత కుటుంబ ఆధిపత్య పోరుగా మలుపు తిరుగుతుంది. ఆ మలుపులో నుంచే అసలు సిసలు ఆసక్తి మొదలవుతుంది. మనపై హత్యాయత్నం చేసింది శత్రువులు కాదని తన భార్యతో చెప్పడంతో కథలో ఉత్కంఠ మొదలవుతుంది. మరి అందుకు కారకులెవరనే సందేహం తలెత్తుతుంది. అక్కడ్నుంచి అన్నదమ్ముల మధ్య మొదలయ్యే డ్రామా ఒకెత్తయితే, హత్యకి అసలు కారకులెవరనే ఉత్కంఠ మరో ఎత్తు.
ఇందులోని ప్రతి పాత్రకీ ఓ నిగూఢమైన వ్యక్తిత్వం ఉంటుంది. దాంతో ఏ పాత్ర ఎప్పుడు ఎలాంటి మలుపుకి కారణమవుతుందో అర్థం కాని పరిస్థితి. దర్శకుడు మణిరత్నం ప్రభావం కథ, కథనాలపై అడుగడుగునా కనిపిస్తుంది. రేసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకి అలవాటు పడిన సగటు ప్రేక్షకుడికి అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మింగుడు పడవేమో కానీ... మొత్తంగా చూస్తే మాత్రం మణిరత్నం ఆయన స్థాయికి తగ్గ చిత్రాన్నే తీశారు.
తండ్రి చాటున ఉంటూ శత్రువుల్ని దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న వరద, తన తమ్ముళ్లకి భయపడుతూ ఊరి నుంచి పారిపోవడం స్టోరీ లైన్ ను కాసింత దెబ్బతీసింది. మాఫియా గుట్టు తెలిసిన ఆయన శత్రువులను అడ్డుతొలగించుకునే వరద.. తమ్ముళ్లకు ఎందుకు జంకుతుపారిపోయారన్నది అతకని విషయంగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలైతే ప్రేక్షకుడికి మరింత అనుభూతిని పంచుతాయి. చివరి ఫ్రేమ్ వరకూ ఉత్కంఠను కొనసాగించిన విధానం చిత్రానికి ప్రధాన బలం.
నటీనటుల విషానికి వస్తే
అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబుల నటన చిత్రానికి ప్రధానబలం. అరవింద్ స్వామి పోషించిన వరద పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆయన భార్యగా జ్యోతిక చక్కటి అభినయం ప్రదర్శించారు. వరద ప్రేయసిగా అదితి రావు హైదరి నటించారు. అరుణ్ విజయ్, శింబులు పోషించిన తమ్ముళ్ల పాత్రలు చాలా స్టైలిష్గా కనిపిస్తాయి. ఐశ్వర్య రాజేష్, డయానా పాత్రల పరిధి తక్కువే. ప్రకాష్రాజ్, జయసుధ, త్యాగరాజన్ వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. విజయ్ సేతుపతి స్నేహితుడిగా, ఇన్స్పెక్టర్గా చక్కటి అభినయం ప్రదర్శించాడు. చివరి వరకు ఆయన పాత్ర పలు సందేహాల్ని రేకెత్తిస్తూ, చివర్లో ఓ రకమైన అనుభూతిని పంచుతుంది.
టెక్నికల్ అంశాలకు వస్తే..
మణిరత్నం మార్క్ సాంకేతికత సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. సంతోష్ శివన్ కెమెరా మాయాజాలం వల్ల ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపించింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం కథలో ఫీల్ని పెంచింది. నేపథ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. మణిరత్నం కవితాత్మకతకి ఏమాత్రం అంతరాయం కలిగించలేదు. దాంతో సినిమా సుదీర్ఘంగా సాగినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మణిరత్నం రచన, దర్శకత్వంలోని పస అడుగడుగునా కనిపిస్తుంది.
తీర్పు..
సినిమాకు కథ, కథనం, పతాక సన్నివేశాలు, సంగీతం, ఛాయాగ్రహణం అన్ని ప్లప్ పాయింట్లే అయినా.. స్లో నరేషన్ మాత్రం ప్రేక్షకులను బోర్ కొట్టిస్తుంది.
చివరగా.. మణిరత్నం మార్క్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చే సినిమా..