శ్రీనివాస కళ్యాణం సినిమాకు పెళ్లి అనే మూడు ముళ్ల బంధమే కథ. ఏడు అడుగులు అనే సప్తపదులే ఈ చిత్రానికి బలం. విడాకులు కోసం న్యాయస్థానాల్లో పిటీషన్లు పెరుగుతున్న వేళ.. చూడయక్కని చిత్రం బంధాలు, బాంధవ్యాలు విలువను తెలిపే చిత్రం. శ్రీనివాసరాజు (నితిన్), శ్రీదేవి (రాశీ ఖన్నా) ఒకరినొకరు ఇష్టపడతారు. ఆర్కే ఇండస్ట్రీస్ అధినేత ఆర్కే (ప్రకాష్ రాజ్) కూతురు శ్రీదేవి అలియాస్ శ్రీ. సఖినేటిపల్లికి చెందిన పెద్దమనిషి రాజు (రాజేంద్రప్రసాద్) కొడుకు శ్రీనివాసరాజు అలియాస్ వాసు. శ్రీ తండ్రి ఆర్కే.. బంధాలు, సంప్రదాయాల కంటే వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఆయన దృష్టిలో పెళ్లంటే ఒక ఈవెంట్. మరోవైపు వాసు కుటుంబం తరాలు మారినా సంప్రదాయాలను మరిచిపోకూడదని, బంధుత్వాలను వదులుకోకూడదని భావిస్తుంది. వీళ్ల దృష్టిలో పెళ్లంటే ఒక పండగ. ఇలాంటి రెండు కుటుంబాల మధ్య కుదిరిన సంబంధం పెళ్లి పీటల వరకు ఎలా వెళ్లింది అనేదే సినిమా.
విశ్లేషణ
‘శతమానం భవతి’ సినిమాలో కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య బాంధవ్యాలను తెరపై ఆవిష్కరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న.. ఈ చిత్రంలో పెళ్లి ప్రాముఖ్యతను చాటిచెప్పాలనుకున్నారు. దాని చుట్టూ అల్లుకున్న అంశాలు, సంప్రదాయాలను పక్కన పెట్టకూడదనే పెళ్లంటే ఎంత పవిత్రమైనదో తెలియజేశాడు. పాతదే అయినా పెళ్లంటే నూరేళ్ల పంట అన్న సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు. చాలా స్పష్టంగా, ఎక్కడా తికమక లేకుండా సినిమాను నడిపించారు.
పెళ్లిని కూడా బిజినెస్లా భావించే ఓ అమ్మాయి తండ్రి.. పెళ్లంటే సంప్రదాయబద్ధమైన ఒక ఘట్టం అని ఎలా తెలుసుకున్నారు అనే విషయాన్ని బాగా చూపించారు. పెళ్లి అనగానే వ్యాపారంగా మారుతూ.. ఈవెంటు మాదిరిగా జరిగిపోతున్న ఈ రోజుల్లో.. పెళ్లి వెనక వుంటే పవిత్రతను తెలియజెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే శ్రీనివాస కళ్యాణం రెండు గంటల పాటు పండగను అస్వాదించడమే. తెర నిండా పాత్రలే. కథేమీ లేదు.. కానీ పాత్రల్లోనే ఏదో తెలియని ఆకర్షణ. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.
చిన్న చిన్న భావోద్వేగాలు, సంతోషాలు, నవ్వులు సినిమా అంతా ఇలానే ప్రశాంతంగా సాగిపోతుంది. కాకపోతే కథలో మలుపులు, ఊహించని ట్విస్టులు లాంటివి ఉండవు. ఇలాంటివి కోరుకునేవారికి ఈ సినిమా పెద్దగా రుచించకపోవచ్చు. తొలి భాగంలో హీరోహీరోయిన్ల ప్రేమకథను చూపించిన దర్శకుడు.. సెకండ్ హాఫ్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లిలో జరిగే తంతు మొత్తం తెరపై కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక అన్ని కుటుంబకథా చిత్రాల్లో ఉన్నట్టే భావోద్వేగానికి గురిచేసే క్లైమాక్స్.
అలాగే పెళ్లికి ముందు శ్రీ తండ్రి పెట్టిన షరతుకు ఒప్పుకున్న వాసు.. పెళ్లి పీటల మీద కూర్చున్నాక తాను చేస్తున్న తప్పును తెలుసుకుని కుటుంబ సభ్యుల్ని, శ్రీని క్షమాపణ కోరే క్లైమాక్స్ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాకపోతే పతాక సన్నేశాలు ఇంకాస్త బలంగా, ప్రేక్షకుడి చేత కన్నీరు పెట్టించే విధంగా ఉంటే సినిమాకు ఇంకాస్త బలం చేకూరేది. సన్నివేశాలకు అనుగుణంగా నేపథ్య సంగీతం, సందర్భానుసారంగా వచ్చే పాటలు, ఆలోచింపజేసే సంభాషణలు ఇలా ప్రతి ఒక్కటి సినిమాకు ప్రాణం పోశాయి. ఏదేమైనా ఒక మంచి సినిమా చూశామనే భావన ప్రేక్షకుడి కలుగుతుంది. కుటుంబం మొత్తం ఆహ్లాదంగా చూడదగిన సినిమా ఇది.
నటీనటుల విషానికి వస్తే
సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జయసుధ పాత్ర గురించి. సంప్రదాయాలు, బంధాల గురించి ఇప్పటి తరానికి చెప్పే పెద్దావిడ పాత్రలో జయసుధ జీవించేశారు. నితిన్, రాశీ ఖన్నా జంట తెరపై చాలా అందంగా ఉంది. నితిన్ ఎప్పటిలానే జోష్తో నటించాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. ఇక తండ్రి అడుగుజాడల్లో నడిచే కూతురి పాత్రలో రాశీ ఖన్నా బాగా నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యువతను కట్టిపడేస్తుంది. అయినా నితిన్, రాశీఖన్నా పాత్రలు జస్ట్ ఓకే. లుక్ పరంగా ఇద్దరి జంట తెరపై చూడటానికి చక్కగా ఉంది. పాత్రలు, వాటిని మలిచిన తీరు, వాటి మధ్య భావోద్వేగాలు ఎఫెక్టివ్ గా అనిపించికపోయినా ఫర్వాలేదనిపిస్తాయి.
ఇక మిలయనీర్గా నటించిన ప్రకాశ్రాజ్ .. పాత్రను సునాయసంగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో నితిన్, ప్రకాశ్ రాజ్ మద్య నడిచే ఎమోషనల్ సీన్లో నితిన్ డైలాగ్స్ వివరణ మరీ ఎక్కువైనట్లు అనిపించేస్తుంది. నందితా శ్వేతా, రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, ప్రభాస్ శ్రీను, సితార, ఆమని ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. పాత్రధారులు కంటే పాత్రలను సరిగా డిజైన్ చేయకపోవడం అనేది సినిమాలో ఫీల్ ను క్యారీ చేయదు. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు, సత్యం రాజేశ్, హరితేజ, ప్రవీణ్, విద్యుల్లేఖ ఇలా అన్ని పాత్రల మధ్య సన్నివేశాలు ఏదో రన్ అవుతున్నాయంటే.. రన్ అవుతున్నాయనేలా వున్నాయి.
టెక్నికల్ అంశాలకు వస్తే..
ఇక సాంకేతికంగా చూస్తే.. సినిమా చాలా రిచ్ గా వుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కోనసీమ అందాలను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, పల్లెటూరిలో పెళ్లి సందడిని చాలా బాగా చిత్రీకరించారు. ఇక సినిమాకు మరో బలం మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం. భావోద్వేగ సన్నివేశాలకు నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. పాటలు కూడా బాగున్నాయి. సినిమాలో పాటలు ఎప్పుడొచ్చాయో తెలియకుండా అయిపోతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రల మధ్య వచ్చే కీలక సిచ్యువేషన్స్లోని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు..
ట్విస్టులు, ఫైట్లు, రొమాన్స్ లాంటి కమర్షియల్ అంశాల గురించి ఆలోచించకుండా సినిమాకు వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పెళ్లీడుకు వచ్చిన యువతీ యువకులు, పెళ్లైన నూతన దంపతులు కచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎలా పెళ్లి చేసుకోవాలన్న అంశంతో పాటు ఇలా చేసుకోలేదే అన్ని భావన కలిగించేలా సినిమాను రూపొందించాడు సతీష్ వేగేశ్న. శతమానం భవతి తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా కుటుంబ సమేతంగా వీక్షించవచ్చ.
చివరగా... పెళ్లి నిర్వచనాన్ని తెలిపిన చిత్రం..