ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు వీఐ ఆనంద్. మరోవైపు శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో హిట్ కొట్టిన అల్లు శిరీష్ తో కలిసి ‘ఒక్క క్షణం’గా మన ముందుకు వచ్చాడు. మన చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
విశ్లేషణ:
తన గత చిత్రంతో ఒక కొత్త కథను చెప్పడమే కాదు.. హై టెన్షన్ ఫీలింగ్ ను.. ఒకరకమైన ఎమోషన్ ను అందించాడు దర్శకుడు ఆనంద్. అయితే‘ఒక్క క్షణం’లో కూడా అతను చెప్పిన కథ కొత్తది. కొన్ని ఆసక్తికర మలుపులతో కథను తీర్చిదిద్దాడు కూడా. కానీ, ఆ కథను ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో తెరకెక్కించలేకపోయాడు. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని ప్రేమకథ, సాదా సీదా సన్నివేశాలు, ఇంటర్వెల్ దాకా అసలు కథ లేకపోవటం చిత్రానికి ప్రతికూల అంశాలు.
ప్యారలల్ లైఫ్ రీవీల్ అయ్యాక ఇక సెకండాఫ్ లో దాన్ని సీరియస్ గా తీసుకునేలా సన్నివేశాలు ఉండవు. అసలు కథకు మూలమైన అవసరాల-సీరత్ కపూర్ ఎపిసోడ్ అసలు ఆసక్తి రేకెత్తించదు. ఐతే ఒకానోక టైంలో ప్రేక్షకులు సీరియస్ గా ఇన్వాల్వ్ అయినప్పటికీ.. అప్పటికే పుణ్య కాలం ముగిసిపోతుంది. అలాగని సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్లు లేవనటం కూడా సరికాదు. ద్వితీయార్దంలో చాలా విషయాలనే చూపిస్తూ.. కథను అనేక రకాల మలుపులు తిప్పాడు. ప్రేక్షకులకు చాలా సర్ప్రైజులే ఉంటాయి ఇక్కడ.
కానీ, ఒక దశ దాటాక ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ నుంచి కథ పక్కకు వెళ్లిపోతుంది. మర్డర్ మిస్టరీ మీద నడిచే థ్రిల్లర్ రూపంలోకి మారుతుంది. కొత్తగా అనిపిస్తున్నా.. మలుపులూ బాగున్నా.. ఏదో మిస్సవుతున్న ఫీలింగ్ మాత్రం ఆద్యంతం వెంటాడుతూనే ఉంటుంది.
నటీనటుల విషయానికొస్తే... అల్లు శిరీష్ ఫర్వాలేదు. ‘శ్రీరస్తు శుభమస్తు’ తరహాలోనే తన పాత్రను క్యాజువల్ గా చేసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అతడికి నటుడిగా పరీక్ష పెట్టే సన్నివేశాలేమీ లేవు. అలాగని ఎమోషన్స్ సన్నివేశాల్లో సరిగ్గా నటించకపోగా.. కొన్ని చోట్ల అన్న అల్లు అర్జున్ ను ఇమిటేట్ చేయటం చూడొచ్చు. ఇక సురభి గ్లామర్ డాల్ గా ఆకట్టుకుంది. నటన ఓకే అయినా అందాలను మాత్రం బాగా గుప్పించింది. ఇక అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ పాత్రలు తేలిపోయాయి. కొత్తగా విలన్ అవతారం ఎత్తిన దాసరి అరుణ్ కుమార్.. మామూలుగా అనిపిస్తాడు. ఈ పాత్ర కానీ.. అతడి నటన కానీ ప్రత్యేకంగా అనిపించవు. తమిళ నటుడు జయప్రకాష్, రోహిణి.. సత్య.. ప్రవీణ్ తమ వంతుగా బాగానే చేశారు.
సాంకేతికవర్గం విషయానికొస్తే... మణిశర్మ పాటలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో బీజీఎం ఆకట్టుకుంది. శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం బాగుంది. అబ్బూరి రవి మాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి.
ఇక దర్శకుడు వీఐ ఆనంద్ మరోసారి కొత్త కథతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు. కథ డిఫరెంట్ కావటం అభినందనీయం. కానీ, మరింత బిగితో స్క్రీన్ ప్లే ఉండాల్సింది.
తీర్పు :
గత సినిమా తర్వాత అతడి మీద పెట్టుకున్న అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయాడు. మలుపులు ఆసక్తికరమే కానీ.. సన్నివేశాల్లో ఇంటెన్సిటీ మాత్రం లేకపోయింది. ఓవరాల్ గా ఆనంద్ ఓకే అనిపిస్తాడు కానీ.. పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.
చివరగా... ఒక్క క్షణం.. హాఫ్ థ్రిల్లింగ్ కథ