రాజకీయాలు రకరకాల రంగులు మారుతుంటాయి. పార్టీలలో వలసలు ఎన్నో జరుగుతుంటాయి. సానుభూతి పవనాలు, ప్రత్యర్థుల కూటమిలు, విమర్శలు, అభియోగాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఏ వాతావరణంలోనైనా తప్పకుండా గెలిచే నాయకులు కొందరుంటారు. ఈ శీర్షికలో వారి గురించి విశ్లేషణ చెయ్యటం జరుగుతోంది.
ఈ రోజు ముందుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుందాం.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కూతురు భువనేశ్వరిని పెళ్ళి చేసుకున్న అల్లుడు నారా చంద్రబాబు నాయుడు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగు దేశం పార్టీ ప్రధమ విజయంతో అందులో చేరి ఎన్టీఆర్ కి సన్నిహితంగా పనిచేసారు.
అంతకు ముందు 1978 లో కాంగ్రెస్ టికెట్ మీద చంద్రగిరి నియోజక వర్గం నుంచి గెలిచిన చంద్రబాబు నాయుడు అంజయ్య ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కాలంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖలకు మంత్రిగా పనిచేసి అతిచిన్న వయసులో రాజకీయ నాయకుడిగానూ మంత్రిగానూ పని చేసిన ఘనత సంపాదించారు.
తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కి చేదోడువాదోడుగా అత్యంత విశ్వసనీయుడుగా పనిచేసిన చంద్రబాబు పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ తన సొంత వర్గాన్ని కూడా కూడగట్టారు.
1989లో కుప్పం నుంచి 5000 మార్జిన్ తో గెలిచిన చంద్రబాబు అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం వలన ప్రతిపక్షంలో ఉండిపోయారు.
1994 లో తెలుగుదేశం పార్టీ మరోసారి నిలదొక్కుకున్నప్పుడు ఎన్టీఆర్ సారధ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో చంద్రబాబు ఫైనాన్స్ రెవిన్యూ శాఖలకు మంత్రిగా పనిచేసారు. అయితే 1995 ఆగస్ట్ లో చంద్రబాబు పార్టీలో ప్రతిఘటన చేసి ఎన్టీఆర్ వివాహమాడిన లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ని అడ్డుపెట్టుకుని అధికారాలను చేపట్టాలని చూస్తున్నదంటూ పార్టీ నాయకులతో మంతనాలు సాగించి తనకు మద్దతుగా వాళ్ళని నిలబెట్టుకోగలిగారు. దానితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గానూ పార్టీకి అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. ఆ ప్రతిఘటనలో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ హరికృష్ణల మద్దతుకూడా చంద్రబాబు సంపాదించగలిగారు.
రెండు సార్లు ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు దాన్ని సమర్ధవంతంగా నిలబెట్టుకోగలిగారు కూడా. సాంకేతికంగా ముందు నడుస్తూ, డేటాను భద్రపరచటానికే కాకుండా నిర్ణయాలు తీసుకోవటానికి ల్యాప్ టాప్ ని ఉపయోగిస్తూ, జిల్లా కలెక్టర్లు ఇతర నాయకులతో టెలిఫోన్ లోచర్చలు జరపటం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చెయ్యటం లాంటి పనులకు కంప్యూటర్ ని ఉపయోగిస్తూ మేధావిగా, ద్రష్టగా పేరుగాంచారు.
ఆంధ్రప్రదేశ్ ని 20 సంవత్సరాలలో ఆసియా ఖండంలోనే బెబ్బులిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని అన్న చంద్రబాబు అదేవిధంగా రాష్ట్రంలో పెనుమార్పులు తీసుకునివచ్చారు. వర్షపు నిలువనీరు నిలిచే ప్రదేశాన్ని టెక్నాలజీ హబ్ గా మార్చివేసారంటూ సిఎన్ ఎన్, టైం లాంటి పలు పత్రికలు ప్రశంసించాయి. టోనీ బ్లెయర్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళని హైద్రాబాద్ కి రప్పించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి హైద్రాబాద్ వచ్చారు. సీటెల్ తర్వాత మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ అభివృద్ధి సంస్థను స్థాపించింది హైద్రాబాద్ లోనే.
బైబై బెంగళూర్, హలో హైద్రాబాద్ అనే నినాదంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు హైద్రాబాద్ కి వచ్చేట్టుగా చేసారాయన. ఐబిఎమ్, డెల్, ఒరాకిల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు హైద్రాబాద్ లో పెట్టుబడి పెట్టేట్టుగా చేసారు చంద్రబాబు.
అయితే కేవలం పట్టణాభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి మీదనే దృష్టి నిలిపిన చంద్రబాబు గ్రామీణాభివృద్ధిని విస్మరించారనే ఆరోపణ రావటంతో ఇంకా ఇతర కారణాల వలన 2004 ఎన్నికలలో అధికారాన్ని చేపట్టలేకపోయిన చంద్రబాబు దరిమిలా తన తప్పులను తెలుసుకుని బహిరంగంగా వాటిని అంగీకరించారు కూడా.
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ నుంచి కూడా చంద్రబాబు విముక్తులయ్యారు.
తెలంగాణా విషయంలో ఊగిసలాటలో ఉన్న చంద్రబాబు పోయిన సంవత్సరం మహానాడులో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి తన అంగీకారాన్ని తెలియజేయటం జరిగింది. దానితో సీమాంధ్రలో కొంత వ్యతిరేకత వచ్చినా, రాష్ట విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆ పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన దుందుడుకు వ్యవహారంతో కాంగ్రెస్ కి వ్యతిరేకతను చూపిస్తున్న సీమాంద్ర ప్రజలు ఇప్పటికీ చంద్రబాబు పాలనలో కొన్ని లోపాలున్నా అందరిలోకీ ఎక్కువ దూరదృష్టితో పనిచేసేవాడు, అభివృధ్దిని చూపించగలిగేవాడు, ప్రగతిపథంలో నడిపించే సమర్ధత కలవాడు చంద్రబాబు నాయుడేనని చాలా మంది నమ్ముతున్నారు.
ప్రతిపక్షంలో ఉండి కూడా ఉత్తరాఖండ్ విధ్వంసంలో తెలుగువాళ్ళకి చేయూత నివ్వటం, మహరాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి ఆ రాష్ట్రంలో అరెస్ట్ అవటం, తుఫాన్ బాధితులకు సాయంగా నిలవటం లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నా, వాటిన్నిటికంటే ప్రధానంగా సీమాంధ్ర ప్రజలు చంద్రబాబు సమర్థతనే ఎక్కువగా నమ్ముతూ ఆయనతో తులతూగే నాయకుడు వేరెవరూ లేరని ప్రగాఢంగా నమ్ముతున్నారు కాబట్టి రాబోయే ఎన్నికలలో గెలుపు గుర్రంగా చంద్రబాబు నాయుడు విజయాన్ని సాధించటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయితే తెలంగాణా పోగా మిగిలిన ఆంద్రప్రదేశ్ లో అధికారం చేపడతారా లేదా అన్నది వేచి చూడవలసిందే. తెలంగాణా ప్రాంతంలో మాత్రం తెలంగాణాకు వ్యతిరేకం కాదని అన్నా, తెరాస, కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యానాల వలన చంద్రబాబుకి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more