మనం విక్రమార్కుడు సినిమా చూశారా? అందులో ఇద్దరు అన్నదమ్ములు ఒక ఊరిలో అరాచకాలు చేస్తుంటారు! వారు ఆ ఊరి ఇన్స్పెక్టర్ భార్యను ఎత్తుకెళ్లి రేప్ చేసినా.. ఆమెను ఇంటికి పంపాలంటూ వారి ముందు తలవంచుకుని నిలబడి మరీ అడుగుతాడు ఆ పోలీసు! అంతటి దారుణాలు సినిమాల్లోనే సాధ్యం అనుకుంటున్నారా.. కాదు! పశ్చిమ బెంగాల్లోని చాలా ప్రాంతాల్లో సరిగ్గా దశాబ్దం క్రితం అలాంటి అరాచకమే రాజ్యమేలింది. సుటి యా అనే గ్రామంలో 33 మంది మహిళలు వరుసగా సామూహిక అత్యాచారాలకు గురయ్యారు.తల్లిదండ్రుల ఎదుట.. కట్టుకున్న భర్త ఎదుటా.. కడుపున పుట్టిన పిల్లలు చూస్తుండగా.. నిస్సహాయంగా గ్యాంగ్ రేప్లకు గురవుతున్న మహిళలను ఆ ఘోర దుస్థితి నుంచి రక్షించడానికి పుట్టుకొచ్చాడో విక్రమార్కుడు! వందమందిని ఒకే వేటుతో నరకడానికి అతడేమీ తెలుగు సినిమా హీరో కాదు.. ఒక సాదాసీదా టీచర్! చట్టమే అతని ఆ యుధం. ఊళ్లో ఉన్న యువకుల్ని కూడగట్టాడు. పోలీసుల చుట్టూ.. అధికారుల చుట్టూ.. కోర్టుల చుట్టూ తిరిగాడు. గ్యాంగ్రేప్లకు మూలకారకులైన ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశాడు. సినిమా కథ అయితే.. అక్కడితో శుభం కార్డు పడిపోతుంది. కానీ.. ఇది జీవితం! తమను జైలుకు వెళ్లేలా చేసిన ఆ టీచర్ని ఇటీవలే నడిరోడ్డు మీద.. వందల మంది చూస్తుండగా.. కాల్చి చంపారు!! ఊరి పడుచుల కోసం నిలిచి గెలిచి చివరికి అసువులు బాసిన ఆ అజ్ఞాత యోధుడి పేరు.. బరుణ్ బిశ్వాస్!! అతడిని తల్చుకుని ఇప్పుడా ఊరు ఊరంతా కన్నీరు కారుస్తోంది.పన్నెండు రోజుల క్రితం: జూలై 5, 2012! కారుచీకట్లు కమ్ముకుంటున్న వేళ.. పశ్చిమబెంగాల్లోని గోబర్దంగ్ రైల్వే స్టేషన్ ముందు తుపాకీ రెండుసార్లు పేలింది. ఆడపడుచుల మీద జరుగుతున్న అత్యాచారాలను అరికట్టిన ఓ అజ్ఞాత యోధుడి గుండెల్లో రెండు గుళ్లు దిగబడ్డాయి!
పన్నెండు సంవత్సరాల క్రితం: అది 2000 సంవత్సరం. పశ్చిమ బెంగాల్లోని చాలా ప్రాంతాల్లో అరాచకం రాజ్యమేలుతున్న సమయం. అక్కడి 24 పరగణా జిల్లాలోని సుటియా గ్రామంలో సుశాంత్ చౌదరి అనే నీచుడు కండ బలంతో జులుం సాగించేవాడు. ఆ ఊళ్లో అతడు చెప్పిందే చట్టం. కాదంటే.. అతడి వద్ద పనిచేసే దాదాపు 70 మంది గూండాల దాడికి కుటుంబాలకు కుటుంబాలే బలవ్వాల్సిన దుస్థితి. ఒకసారి ఒక వ్యక్తి మామూలు ఇవ్వడానికి నిరాకరించడంతో అతడి భార్యను సుశాంత్ చౌదరి బ్యాచ్ గ్యాంగ్ రేప్ చేసింది. అది మొదలు.. వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. దాదాపు రెండేళ్లపాటు స్వైరవిహారం సాగించారు. కంటికి నచ్చిన మహిళలపై అఘాయిత్యం చేయడం నిత్యకృత్యమైంది. ఇళ్లల్లోకి చొరబడి.. అయినవారందరూ చూస్తుండగా అత్యాచారాలు చేశారు. రోడ్డు మీద కలబడి.. ఊరిజనమంతా చూస్తుండగా చెరిచారు! అన్ని ఆగడాలు చేస్తున్నా.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న చైతన్యం గ్రామస్థుల్లో లేదు. దీంతో.. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు 28 ఏళ్ల బరుణ్ బిశ్వాస్ నడుం బిగించాడు. 'సుటియా గోనోధోర్షన్ ప్రతివాది మంచ్'అనే సంస్థను ఏర్పాటుచేశాడు. మొదట్లో అందులో సభ్యుల సంఖ్య కేవలం ఏడు. ఆ ఏడుగురూ ఇంటింటికీ తిరిగారు.
సుశాంత్చౌదరి, అతని గుండాల అఘాయిత్యాల్ని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పారు. ఊరిజనంలో చైతన్యం రగిల్చారు. ఫలితం.. ఆ నరరూప రాక్షసులపై తొలిసారి కేసులు నమోదయ్యాయి. అవి నిలిచి కోర్టుల దాకా వెళ్లాయి. ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి. నాటి నుంచీ సుటియాలో అఘాయిత్యాల బెడద తగ్గింది. ఊరిజనం గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయారు. కానీ జైల్లో ఉన్న సుశాంత్ మాత్రం పగతో రగిలిపోయాడు. కారాగారంలో ఉంటూనే.. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేశాడు. కిరాయి హంతకులకు డబ్బులు అందే ఏర్పాటు చేసి బరుణ్ ప్రాణాలు తీయించాడు. సుశాంత్ చౌదరి అనుచరుల్లో ఒకడైన భీమ్.. బరుణ్ హత్య గుట్టును విప్పాడు. జైల్లో ఉన్న సుశాంత్ కుట్ర మేరకే అతణ్ని కాల్చి చంపారని చెప్పాడు. శుభాంకర్ బిశ్వాస్ అలియాస్ ఫోట్కే అనే వ్యక్తి సుశాంత్ ఆదేశాలతో కిరాయి హంతకులను సంప్రదించి బరుణ్ హత్యకు ప్రణాళిక వేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు.
డీల్ కుదిరాక: హంతకులు బరుణ్ కదలికలపై నిఘా వేశారు. జూలై 5 రాత్రి ఏడు-ఏడున్నర మధ్య.. గోబర్దంగా రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి పార్కింగ్లో ఉన్న తన బండి వద్దకు వెళ్తున్న బరుణ్ను వెనక నుంచి తుపాకీతో కాల్చారు. బుల్లెట్ వచ్చి శరీరంలో దిగబడినా బెదరని బరుణ్ వెంటనే వారివైపు తిరిగి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అంతలోనే.. హంతకుడి చేతిలోని తుపాకీ రెండోసారి నిప్పులు కక్కింది.. ఇంకో బుల్లెట్ ఈసారి గుండెలో! తూటా దెబ్బకు కిందపడినా బరుణ్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. వెంటనే జేబులోంచి ఫోన్ తీసి తన మేనమామకు ఫోన్ చేశాడు. తనపై హత్యాయత్నం జరిగిందని.. అయినా, తన ప్రాణాలకేం ప్రమాదం లేదని చెబుతూనే క..న్ను..మూ..శా..డు!!బరుణ్ హత్యతో సుటియా గ్రామం అట్టుడికి పోయింది. ఊళ్లో ఉన్న మహిళలంతా చీపుర్లతో స్థానిక పోలీస్ అవుట్పోస్టును చుట్టుముట్టారు. బరుణ్ ప్రాణాలను కాపాడలేని అసమర్థులు ఇక్కడెందుకంటూ పోలీసులకు చీపుళ్లతో దేహశుద్ధి చేశారు. ఔట్పోస్టులోని ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. జనాగ్రహానికి జడిసిన పోలీసులు చురుగ్గా స్పందించారు. బరుణ్ హత్యకు సూత్రధారులు, పాత్రధారులు అయిన ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సుమంత దేబ్నాథ్ పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థి కావడం గమనార్హం.అతనితోపాటు.. దేబాశిష్ సర్కార్, బిశ్వజిత్ బిశ్వాస్ అనే మరో ఇద్దరు విద్యార్థులు కూడా బరుణ్ హత్యలో పాలుపంచుకున్నారు. హత్యకు డీల్ కుదిర్చిన ఫోట్కేతోపాటు రాజు సర్కార్ అనే మరో నిందితుడు కూడా పోలీసులు అరెస్టు చేసినవారిలో ఉన్నాడు. ఇదంతా జరిగి ఇప్పటికి పదిరోజులు గడిచిపోయినా.. బరుణ్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఒకటి మాత్రం నిజం.. బరుణ్ను చంపి మునుపటి అరాచకాల్ని సాగించాలని సుశాంత్ చౌదరి, అతని గూండాలు అనుకుని ఉంటే అది వారి అమాయకత్వం. ఎందుకంటే.. ఇప్పుడు బరుణ్ లేకపోయినా ఊరివారందరిలో అతను నింపిన స్ఫూర్తి సజీవంగానే ఉంది! ఇప్పుడు ఆ ఊరిలో ఒక్కొక్కరూ ఒక్కో బరుణ్ బిశ్వాస్!
వీరమాత
కొడుకు చనిపోతే హృదయవిదారకంగా రోదించే తల్లుల్ని మీరు చూసి ఉండవచ్చు! కానీ.. బరుణ్ తల్లి గీతా బిశ్వాస్ మాత్రం కళ్లల్లో ఉబుకుతున్న నీటిలో ఒక్క చుక్క కూడా నేల చిందనివ్వడం లేదు! 'ఊరి కోసం ప్రాణాలు వదిలాడు నా బిడ్డ.. వాడి కోసం కంటతడి పెడితే వాడికి అది అవమానం' అంటోందా మాతృమూర్తి!!
కన్న తండ్రి ఎదుటే..
తల్చుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది! ఇప్పటికీ వెంటాడే పీడకలలవి. ఆ రాత్రి.. వారంతా మా ఇంట్లోకి చొచ్చుకొచ్చారు. మా నాన్న, సోదరుడి ఎదురుగా నాపై అత్యాచారం సాగించారు. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది. కళ్లముందే కన్నకూతురిపై జరుగుతున్న అఘాయిత్యాన్ని తట్టుకోలేని నాన్న ఎదురుతిరగడానికి ప్రయత్నిస్తే ఆయన నోట్లో తుపాకీ గొట్టం పెట్టి కాల్చేస్తామని బెదిరించారు. వాళ్లిద్దరినీ ఎక్కడ చంపేస్తారో.. నా చెల్లిని కూడా ఎక్కడ రేప్ చేస్తారో అనే భయంతో పళ్లబిగువున ఆ దారుణాన్ని భరించాను. ఒకరి తర్వాత మరొకరు వరుసగా.. రెండుగంటల నరకం అది! ఆ తర్వాత నేను సొమ్మసిల్లి స్పృహతప్పడంతో నెమ్మదిగా ఇంట్లోంచి వెళ్లిపోయారా రాక్షసులు!! -గ్యాంగ్ రేప్ బాధితుల్లో ఒక మహిళ (ఆంద్రజ్యోతి పత్రిక సౌజన్యంతో)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more