రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం, రాజకీయాంశాలను పక్కకు పెడితే చాలా మంచి కార్యక్రమం. పూర్వకాలంలోనే కాదు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా ఊరు మధ్యలో రచ్చబండలు కనిపిస్తాయి. గ్రామంలో నివసించే ప్రజలు తమ కష్టనష్టాలను చర్చించుకుని పరిష్కరించుకునే స్థలమే రచ్చబండ. సామాన్యంగా నీడనిచ్చే పెద్ద వృక్షం కింద బల్లపరుపు రాళ్ళను పరిచికాని, సిమెంటు చేసి కాని వేదికలా తయారుచేసి ఉంచుతారు. ఊరి పెద్ద తీర్పుకు గౌరవమివ్వటం ఉండేది. లోపల్లోపల అనుకుంటూ మనసులో బాధపడుతూ, కోపం, విద్వేషాలు పెంచుకోకుండా, ఒక దగ్గర చేరి మనసు విప్పి మాట్లాడుకోవటం కోసం ఉన్నదే రచ్చబండ. మధ్యవర్తుల మాటల వలన అంతరాలు పెరిగిపోయి విషయం కత్తులూ కటారుల వరకూ పోకుండా ఈ లోపులోనే చర్చల ద్వారా పరిష్కరించుకోవటం ఏర్పాటు చేసుకున్నదే రచ్చబండ.
పాలకవర్గం రచ్చబండను నిర్వహించటానికి ఎంతో ధైర్యముండాలి. తమ పనిమీద తమకు నమ్మకముండాలి. తాము అమలుపరచిన సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలుంటే సరిదిద్దుకోవటానికి, ప్రయోజనాలు చేరవలసిన లబ్ధిదారులకు చేరకపోతే ఆ విషయాన్నివారు పాలకుల దృష్టికి తేవటానికి ఇదో మంచి సదుపాయం, చక్కటి అవకాశం. అటూ ఇటూ మాట్లాడి మధ్యలో లాభాలు కొట్టేసే మధ్యవర్తులు, అమలు చెయ్యటంలో అవినీతికి పాల్పడ్డ అధికారుల వ్యవహారాలకు దీనితో అడ్డుకట్ట పడుతుంది.
అయితే మన రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ దాదాపూ అన్నిచోట్లా రసాభాసకే గురైంది. అన్యాయం జరిగిందని నిరసన ప్రదర్శించేవారిని పోలీసు బలగాలతో అరికట్టటం వలన నిజానికి ఆ కార్యక్రమం కేవలం ఇన్ని చోట్ల నిర్వహించాం, ఇన్ని పంపిణీలు చేసాం అనే లెక్కలకే పనికివస్తుంది, రాజకీయ పలుకుబడిని పెంచుకోవటానికి ఉపయోగపడుతుందేమో కానీ నిజమైన ప్రజాప్రయోజనం తక్కువగానేఆశించాలి.
పొగతాగటం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటిస్తూ, దానితోపాటే చట్టబద్ధమైన హెచ్చరిక అని కూడా రాయటంలో అలా రాయాల్సివచ్చింది కానీ అది మా మాట కాదు సుమా అని సిగరెట్ సంస్థలు చెప్పినట్టే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యాంత్రికంగా నిర్వహించి హమ్మయ్య అయిపోయిందని రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు, పోలీసులు, కార్యకర్తలు అనుకోవటం జరుగుతోంది. పాలకపక్షం చేసే ప్రతి పనీ రాజకీయమే అన్నట్టుగా ప్రతిపక్షాలు ధ్వజమెత్తటం, అడ్డకోవటం, ప్రతిపక్షం చేసే వ్యాఖ్యలను విని సరిదిద్దుకోకుండా పాలకపక్షం వారిని తప్పుపట్టటం, ఇరువర్గాలూ ప్రజాహితంలోనూ పనిచేస్తున్నట్టుగానే మాట్లాడుతుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకొస్తుంది.
గురుసేవ చెయ్యటం పరమావధిగా భావించే రోజులు కాబట్టి, గురువుగారు పడుకోగానే శిష్యులు ఆయన కాళ్ళు పడుతుంటారు. ఉన్న కాళ్ళు రెండే కాబట్టి ఇద్దరు శిష్యులు చెరోకాలు పంచుకుంటారు. తనవాటాకి వచ్చిన కాలుకి సపర్యలు చెయ్యటమే కాకుండా, దరిమిలా మరో శిష్యుడి వాటాకి పోయిన కాలు మీద కోపం పెంచుకుంటారు. తను సపర్యలు చేస్తున్న కాలుని సున్నితంగా చూసుకుంటూ రెండో కాలు మీద గట్టిగా కొట్టటం, బాధ కలిగించటం చేస్తారు. నాకాలినే తంతావా చూడు నీ కాలుని ఏం చేస్తానో అనే స్థాయిలో పోటీలు పెరిగిపోయి ప్రత్యర్థిగా మారిన రెండో శిష్యుడు వత్తుతున్న కాలిని హింసించటం వరకూ వచ్చేసరికి గురువు గారు లేచి, "నాయనా, ఆ రెండూ నా కాళ్ళురా " అంటారు.
పాలకపక్షం, ప్రతిపక్షాలు చేసే పనులన్నీ ప్రజలకోసమేనని కేవలం ప్రకటించటమే కాదు, నిజంగా దాన్ని జీర్ణించుకుని ఇది నా ప్రణాళిక, ఇది నా పథకం అంటూ కాకుండా ఇదంతా ప్రజాసేవలో భాగమే అనుకుని పనిచేసే రోజులు వస్తే ప్రజలకు పరమానందయ్య బాధలు దూరమౌతాయి.
రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించటం, దాన్ని అడ్డుకుంటానని వేరొకరు ప్రకటించటం, ముందస్తు చర్యగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవటం, లేనిపక్షంలో వారు రచ్చబండను రసాభాసు చెయ్యటం, లబ్ధిదారులకు అందని ప్రయోజనాలను ఏకరువు పెడితే అడ్డుకుంటున్నట్టుగా నిర్వాహకులు భావించటం, మామూలుగా జరగవలసిన పంపిణీని కేవలం జరగబోయే రచ్చబండ కోసమే నిలిపివేసి ఆ రోజు అదో వేడుకగా పంపిణీలు చేసి అదో గొప్ప విషయంగా ప్రభుత్వం ప్రకటించటం, ఇవన్నీ పరమానందయ్య శిష్యుల గురసేవ పంథా రచ్చబండే అవుతుంది.
అసలు రచ్చబండకు ప్రభుత్వం తయారుగా లేకపోవటమే దీనికి కారణం. ఏదో కొత్త పనిగా చరిత్రను సృష్టించటానికి చేపట్టటం జరిగింది కానీ, సంక్షేమ పథకాలను నిజంగా సరైన విధానంలో సంపూర్ణంగా అమలుపరచి, ఇంకా ఏమైనా లోపాలున్నాయేమో, మాకు తెలియజేయండి, వాటిని సరిచేసుకుంటాం అనే ధోరణితో చేస్తే బాగుండేది కానీ, రాజకీయ రణరంగంలో తీరికే లేకుండా ఉన్న పాలకపక్ష నేతలు ఉన్నట్టుండి రాష్ట్రంలో పర్యటించటానికో మిషగా ప్రభుత్వ నిధులనుపయోగించి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించటం ప్రజాహితం అనిపించుకోదు. అలాగే, ఏదో మొదలు పెట్టరు సరే, సందర్భాన్ని ఉపయోగించుకుని ఇందులో నిజంగా ప్రజలకు లాభం చేకూరేట్టుగా మనం కూడా పనిచేద్దాం అని ప్రతిపక్షాలు అనుకోకుండా, తాము సహకరిస్తే తమ పార్టీకి తలవంపులవుతుందేమో, పేరంతా వాళ్ళే కొట్టేస్తారేమో, అది వాళ్ళ పథకం, వాళ్ళ ప్రణాళిక అనుకుంటూ దాన్ని అడ్డుకోవటం కానీ, సరిగ్గా జరగనివ్వకపోవటం కాని చెయ్యటంతో అసలు లబ్ధిదారులైన సామాన్యప్రజలు, వెర్రెత్తి తన కాళ్ళతో వాళ్ళు కొట్టుకుంటున్న శిష్యులను చూసి మొత్తుకోవటం తప్ప ప్రజలనబడే పరమానందయ్యలు మరేమీ చెయ్యలేరు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more