రంగస్థలం గ్రామానికి ప్రెసిడెంట్.. ముప్పై ఏళ్లుగా ప్రజలకు అందాల్సిన నిధులను కాజేస్తూనే.. సొసైటీ పేరు చెప్పి ఊరి ప్రజలకు అప్పిచ్చి.. వడ్డీ వసూలు చేస్తుంటాడు. అదే ఊరి చెందిన ఓ యువకుడు దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చి.. గ్రామంలో ప్రెసిడెంట్ చేస్తున్న అన్యాయాలను ఎదురిస్తాడు. అతని మరో రాజకీయ వేత్త అండ లభించడంతో.. గ్రామ ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ చేస్తాడు. దీంతో ప్రెసిడెంట్ ఆ యువకుడిని చంపించడానికి ప్రణాళిక రచిస్తాడు. అయితే ఆ యువకుడిని చంపింది ఎవరు..? చిత్రంలో హీరో రాంచరణ్ కు యువకుడు ఏమవుతాడు.? ప్రెసిండెంట్ కాకుండా మరో రాజకీయ నేతకు అ గ్రామంపై అంత అసక్తి ఎందుకు..? స్వతహాగా చెవిటివాడైన హీరో.. దోషులను ఎలా పట్టుకుంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమాను తప్పక చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ చిత్రం కథమొత్తం 1985నాటికాలంలో సాగుతుంది. భూస్వామ్య వ్యవస్థ.. ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉండటం.. 30 ఏళ్లుగా గ్రామాన్ని పాలిస్తున్న ఓ సర్పంచ్ చేసే అరాచకాలను నిలదేసే ఓ యువకుడు.. ఇదీ స్థూలంగా రంగస్థలం నేపథ్యం. ఈ తరహా కథలు గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ, ఇలాంటి కథకు సుకుమార్ శైలిని జోడిస్తే ఎలా ఉంటుందో అదే 'రంగస్థలం'. కథపరంగా పాత్రల ఎంపిక, వాటిని చిత్రీకరించిన విధానం, ఆకట్టుకుంటుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో కథ మొత్తం సాగుతుంది.
ప్రథమార్ధమంతా ఊళ్లో చిట్టిబాబు చేసే సందడి.. రామలక్ష్మితో వచ్చే సరదా సన్నివేశాలతో ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తూ సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా రామలక్ష్మిగా సమంత నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులుపూయిస్తాయి. పాటలు కూడా సన్నివేశాలకు ఉన్నాయి. మరోపక్క గ్రామంలో ప్రెసిడెంట్ చేసే అన్యాయాలను కుమార్బాబు నిలదీయడంతో పాటు, సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అయితే ఈ పరిణామాలేవీ చిట్టిబాబుకు తెలియవు. తన తండ్రి, అన్నను ప్రెసిడెంట్ అవమానించాడన్న విషయం తెలుసుకున్న తర్వత చిట్టిబాబు ఎలా స్పందించాడన్నదే ద్వితీయార్థం సినిమా.
కుమార్ బాబు నామినేషన్ వేయడం, ప్రెసిడెంట్ అరాచకాలను ఊరి వాళ్లకు తెలియజేయడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు తదితర సన్నివేశాలతో రెండోభాగంలో చూపించాడు. అక్కడి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని ఆశ్చర్య పరుస్తాయి. రంగమ్మత్తగా అనసూయ ఓ ట్విస్ట్ ఇస్తుంది. కుమార్ బాబుపై దాడి జరగడం ఆ తర్వాత పరిణామాలు కథకు మరింత బలాన్ని ఇచ్చాయి. రామ్చరణ్, ఆది పినిశెట్టిలు జగపతిబాబు ఇంటికి వెళ్లి అప్పటి వరకు తెలియని అతని పేరుని తనకు గుర్తు చేయడం.. క్లైమాక్స్లో అసలు చిక్కుముడి వీడటం. వంటి సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఇక చివర్లో ఎవరూ ఊహించని విధంగా ప్రకాశ్ రాజ్ ఇచ్చే షాక్ ప్రేక్షకులను మరింత ఆశ్చర్య పరుస్తుంది. ఇలా ద్వితీయార్థం మొత్తం సుకుమార్ శైలి ట్విస్టులతో సాగుతుంది.
నటీనటుల విషానికి వస్తే
రాంచరణ్ ఇంతకుముందే చెప్పినట్లుగా తన పదేళ్ల సినీ కెరీర్ లో బహుచక్కని నటనకు అద్దం పట్టిన చిత్రం రంగస్థలం. తనకిది నటనలో బెస్ట్ మూవీ అవుతుందని ఆయన ప్రకటించినట్లుగానే ఈ చిత్రంలో రాంచరణ్ అద్బుత నటన ఆయనను మరో మెట్టుకు చేర్చింది. పాక్షికంగా చెవుడు ఉన్న యువకుడిలా చెర్రీ ఒదిగిపోయాడు. గుబురు గడ్డం, గళ్ల లుంగీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తన ఇమేజ్ను పక్కన పెట్టి.. పక్కా కమర్షియల్ కు భిన్నంగా ఇందులో చిట్టిబాబు పాత్ర చేశాడు.
ఇక రామలక్ష్మిగా నటించిన సమంత గ్రామీణ అమ్మాయిగా కనిపించింది. ముఖ్యంగా యేరు శెనగ మీద.. సాంగ్,... `రంగమ్మ మంగమ్మ...` పాటలో తను చక్కటి హావభావాలను పలికించింది. ఆది పినిశెట్టి డీసెంట్ కుర్రాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక జగపతిబాబు ప్రెసిడెంట్ పాత్రలో ఓవర్ డైలాగ్స్ లేకుండా పరిధి మేర చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక అజయ్ ఘోష్, ప్రకాశ్ రాజ్, కాదంబరి కిరణ్, సత్య, నరేశ్, రోహిణి సహా అందరూ వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
దర్శకుడు సుకుమార్ రాసుకున్న స్టోరీ లైన్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, డీఎస్పీ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్, రామకృష్ణ, మోనికల ఆర్ట్ వర్క్ చిత్రానికి పెద్ద అసెట్ గానే చెప్పాలి. గోదావరి అందాలు, పాత కాలపు గ్రామీణ వాతావరణాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించడం అద్భుతంతా అకర్షించాయి. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా వెనుకాడకుండా పెట్టిన ఖర్చు క్వాలిటీ పరంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది.
తీర్పు..
రంగస్థలం సినిమా ప్రథమార్థంలో కొంత స్లో నరేషన్ తో సాగినా.. ద్వితీయార్థంలో మాత్రం పుంజుకుంటుంది. దాదాపుగా మూడు గంటల నిడివి వుండటం.. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను తికమక పెడుతున్నాయి. గ్రామ ప్రెసిడెంట్ ఎలాంటి వాడన్న విషయం అన్ని గ్రహించే చిట్టిబాబుకు తెలియకపోవడం.. అమె భర్త దుబాయ్ లో వున్నాడని చెప్పినా.. అసలు విషయాన్ని తరువాత రివీల్ చేయడం.. ప్రేక్షకులకు ఒక్కపట్టాన అర్థం కాకపోవచ్చు.
చివరగా.. రంగస్థలం గ్రామీణ కథతో వచ్చిన కొత్త చిత్రం.. ప్రేక్షకులను అలరిస్తుంది.