సినిమా : గుండెల్లో గోదావరి
నటీనటులు: ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ , మురళీమోహన్, రవిబాబు, జీవా, అన్నపూర్ణ, తదితరులు
బ్యానర్ : మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవెట్ లిమిటెడ్
సంగీతం : ఇళయ రాజా
పాటలు: చంద్రబోస్, అనంత్శ్రీరామ్, రాము,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
కెమెరా: ఎం.ఆర్.పళనికుమార్
నిర్మాత: లక్ష్మీ మంచు,
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర.
మంచు లక్ష్మీ నటించి నిర్మించిన సినిమా ‘గుండెల్లో గోదారి ’. విడుదల వాయిదా పడుతూ పడుతూ నేడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్తగా మెగా ఫోన్ పట్టిన నాగేంద్ర కుమార్ 1986లో వచ్చిన వరదలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఇన్ని రోజుల ఊరిస్తూ, సాగదీస్తూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల గుండెలను హత్తుకునే విధంగా ఉన్నా, సునామీ లాగా భయాన్ని స్రుష్టించిందా ఓ సారి చూద్దాం.
కథ:
గోదావరి నది పరిసర ప్రాంతంలో ఓ యువకుడు మల్లేష్(ఆది పినిశెట్టి). రోజూ చేపల వేటకు పొట్ట పోసుకోవడం అతని వ్రుత్తి. రోజు నావను అద్దెకు తెచ్చుకొని చేపల వేటకు వెళ్లే మల్లికి సొంత నావ కొనుక్కోవాలనే కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి కష్టపడిన డబ్బును కూడబెడతాడు. ఈ నేపథ్యంలో తనకు నావను అద్దెకు ఇచ్చే అతని కూతురు బుజ్జి (తాప్పీ )ని మల్లి ప్రేమిస్తాడు. వీరి ప్రేమ బుజ్జి తండ్రికి తెలియడంతో ఏం జరుగుతుంది ? బుజ్జి ప్రేమను మల్లి పొందుతాడా లేదా ? దివిసీమ ఉప్పెన నేపథ్యంలో సాగే చిత్రకథలో మంచు లక్ష్మి (చిత్ర)ని మల్లి ఎందుకు పెళ్లి చేసుకుంటారు. అసలు మల్లి చిత్రను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాలను తెర పైన చూడాల్సిందే.
కళాకారుల పనితీరు :
ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన అతను ఆ పాత్రలో నటించాడు అనే కంటే ఒదిగిపోయాడు అనడం కరెక్ట్. పాత్రలో లీనమై చేస్తే ఓ కళాకారుడు ఎంతటి పాత్రనైనా అద్బుతంగా పండించగలడు అని చెప్పడానికి ఆది పిశెట్టి ఓ ఉదాహారణ. ఇక హీరోయిన్ పాత్ర పోషించిన తాప్పీ ఎప్పటిలాగే అందంగా కనిపించింది. తాప్పీకి, ఆది మధ్య సంభాషణలు కొన్ని సంధర్భాల్లో ఆకట్టుకోవు. ఇక సందీప్ కిషన్ తన పాత్ర మేరకు రాణించే ప్రయత్నం చేశాడు. ఇందులో అతని నటన బాగుంది. కానీ ఇంకా పరిణతి చెందాలి. ముఖ్యంగా రెండవ భాగంలో ముఖ్యపాత్ర పోషించిన మంచు లక్ష్మి నటన పరంగా బాగానే చేసింది. కానీ ఆది, లక్ష్మికి జత కుదినట్లుగా అనిపించలేదు. ఇక మిగతా నటులు వారి వారి మేరకు నటించారు.
సాంకేతికత:
ముఖ్యంగా ఈ సినిమాకి బలం సంగీతం. మ్యూజిక్ మ్యాస్ట్ర్రో ఇళయరాజా సంగీతానికి వంక పెట్టడానికి ఏమీ ఉండదు. ఈయన అందించిన సంగీతం బాగుంది. స్టోరీ పాతకాలంది కాబట్టి దానికి తగ్గట్టి సంగీతమే అందించాడు. ఇక కెమెరామెన్ ఎమ్.ఆర్.పలనీకుమార్ ప్రతి సన్నివేశంలో తన పనితనాన్ని మేళవించి తీశాడు. అందుకే ప్రతి సీన్ బాగా వచ్చింది. ముఖ్యంగా వదల సన్నివేశాల్ని, పల్లెటూరి వాతావరణాన్ని బాగా, సహజసిద్దంగా తీశాడు. కొత్తగా మెగాఫోన్ పట్టిన దర్శకుడు నాగేంద్ర కుమార్ ఈ కథను ఎన్నుకుందకు మొదటగా మనం మెచ్చుకోవాలి. ప్రస్తుతం కాలంతోపాటు సినిమా స్టోరీలు కూడా మారిన ఈ రోజుల్లో 1980 స్టోరీ తీసుకొని దానికి ఇంత అద్బుతంగా మలిచినందుకు ఆయన నూటికి తొంభై మార్కులు వేయాలి. రొటీన్ సినిమాలకు భిన్నంగా, వేరే కథలకు ఆస్కారం లేకుండా సొంతంగా ఈ సినిమాని తీర్చి దిద్దాడు దర్శకుడు. నూటికి నూరుపాళ్ళు మనదైన కథ ఇది. కొత్త దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
విశ్లేషణ:
గతంలో గోదావరి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమా ప్రత్యేకత దానిదే. దర్శకుడు 1980 స్టోరీకి కూడా గోదావరి నేపథ్యాన్ని ఎన్నుకున్న తీరును మెచ్చుకోవాలి. గోదావరి తీరంలో జీవనశైలి, వారి జీవితాలను దర్శకుడు వాస్తవికానికి దగ్గరగా చూపించాడు. పాత్రలకు తగ్గట్టుగానే నటీ నటుల్ని ఎంచుకున్నారు దర్శకుడు. కొత్తగా మెగా ఫోన్ చేతపట్టిన దర్శకుడు కుమార్ నాగేంద్ర అదే చేశాడు. కథని గాల్లో నడిపించకుండా భూమీద పుట్టిన కథను, భూమ్మీదకే తీసుకొచ్చి చూపించాడు. సాధారణ మనుషులు, వాళ్ళ జీవితాలు, ఆ వెనక భావోద్వేగాలు ఇలా ఉంటాయని కళ్ళకు కట్టాడు. తాను నమ్ముకున్న కథను ఉన్నదున్నట్టుగా తెరపై చూపించి దర్శకుడిగా విజయం సాధించాడు. తొలి సగ భాగంలో కథంతా మల్లి జీవతం ఆధారంగా సాగుతుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు వినోదాత్మకంగానూ, మరికొన్ని హృద్యంగానూ సాగుతాయి. మలి సగ భాగంలోకి వచ్చేసరికి కథ చిత్ర జీవతం ప్రధానంగా సాగుతుంది. మొత్తంగా చూస్తే దర్శకుడు చేసిన మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు. త్వరలో తమిళ వెర్షనల్లో కూడా విడుదల అయ్యే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
చివరగా...
‘గుండెల్లో గుబులు పుట్టించని గోదావరి ’