విభిన్నమైన సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దర్శకుడు చందు ముండేటి.. గతంలో తెరకెక్కించిన ‘కార్తికేయ’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్రానికి కొనసాగింపుగా దాదాపు 8 ఏళ్ల తరువాత మరో సీక్వెల్ చిత్రంగా రూపోందించారు. ఈ చిత్రంలోనూ యువహీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించాడు. ఈ చిత్రంపై ఆరంభం నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైయిలర్ విడుదల కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ మించిపోయాయి. పలు అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కథలోకి ఎంట్రీ ఇస్తే..
శాస్త్రాన్ని నమ్మే వైద్యుడు కార్తికేయ (నిఖిల్). ఇతరుల నమ్మకాలనూ గౌరవిస్తాడు. సైకాలజీలో తనదైన ప్రయోగాలు చేస్తుంటాడు. మరోవైపు ప్రొఫెసర్ మిస్టర్ రావ్ శ్రీకృష్ణుడి కంకణం కోసం రీసెర్చ్ కొనసాగిస్తుంటాడు. ఈ కంకణానికి ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారుల నుంచి మానవాళిని కాపాడే శక్తి ఉంటుంది. ఇది లభిస్తే మానవజాతికి ఎలాంటి ప్రమాదాల నుంచైనా రక్షణ లభిస్తుంది. కలికాలంలో మానవులను కాపాడే శక్తి తన కాలి కంకణానికి ఉందని చెబుతూ శ్రీకృష్ణుడే స్వయంగా ఉద్ధవుడి ద్వారా ఇచ్చి పంపిస్తాడు. సరైన వ్యక్తి ద్వారానే దీన్ని కనుగొనగలరని చెబుతాడు.
గతంలో పల్లవులు, ఛోళరాజులు వెతికినా దొరకని ఈ కంకణం కోసం పరిశోధనలు చేస్తుంటారు కొందరు శాస్త్రవేత్తలు. వారిలో ఈ కంకణాన్ని స్వార్థానికి వాడుకోవాలని చూస్తుంటాడు డాక్టర్ శంతను (ఆదిత్య మీనన్). అతని మాట వినలేదని మిస్టర్ రావ్ ను చంపాలని ప్రయత్నిస్తాడు. దైవ కంకణాన్ని కనుగొనే పనిని తన తర్వాత కొనసాగించే వ్యక్తి కార్తికేయ అని తెలుసుకున్న ప్రొఫెసర్ మిస్టర్ రావ్ తన చివరి ఘడియల్లో అతనికి తన మిషన్ గురించి అస్పష్టంగా చెబుతాడు. కార్తికేయకు మిస్టర్ రావ్ తన పరిశోధన రహస్యాలు చెప్పి ఉంటాడన్న అనుమానంతో కార్తికేయను పోలీస్ లతో అరెస్ట్ చేయిస్తాడు శంతను.
మరోవైపు శ్రీకృష్ణుడి వస్తువులను ఎవరు దొంగిలించాలని చూసినా చంపేసే అభీరుడు కార్తికేయ వెంట పడతాడు. మిస్టర్ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) కార్తికేయను చివరి నిమిషంలో కాపాడి పోలీస్ స్టేషన్ నుంచి బయటపడేలా సాయం చేస్తుంది. తాతయ్య తనకు అన్ని విషయాలు చెప్పాడని ముగ్ధ అంటుంది. దైవ కంకణం గురించి మిస్టర్ రావ్ కార్తికేయకు ఇచ్చిన వస్తువులేంటి, చెప్పిన క్లూస్ ఏంటి, వాటితో దైవ కంకణాన్ని కార్తికేయ ఎలా కనుగొన్నాడు. ఈ క్రమంలో శంతను, అభీరుడి ముప్పును కార్తికేయ ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ
విశ్లేషణ
దర్శకుడు చందూ మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లుగా ‘కార్తికేయ’ చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దైవం, సైన్స్ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్లో మొత్తం సాదాసీదాగా సాగుతున్నప్పటికీ.. సెకండాఫ్పై మాత్రం క్యూరియాసిటీ పెంచుతుంది. అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్ ద్వారా చూపించడం ఆకట్టుకుంటుంది.
ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారనమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తికేయలో మాదిరి ఇందులో భయపడే సీన్స్ పెద్దగా ఉండవు.
అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే విలన్, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి హీరో సింపుల్గా తప్పించుకోవడం లేదా ఆ సీన్ని హడావిడిగా ముంగించి వేరే సీన్లోకి తీసుకెళ్లడంతో థ్రిల్ మూమెంట్స్ మిస్ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్ ఖేర్తో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. కమర్షియల్ హంగుల కోసం సాంగ్స్, కామెడీని జోడించకుండా ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
నటీనటుల విషాయానికి వస్తే..
డాక్టర్ కార్తికేయ పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రని అల్రెడీ కార్తికేయ చిత్రంలో పోషించిన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చింది. కార్తికేయ మాదిరే కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్ న్యాయం చేసింది. కార్తిక్ని కాపాడే రెండు సీన్స్ అనుపమా క్యారెక్టర్ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్లో ఈలలు వేయిస్తాయి. కార్తిక్ మామగా శ్రీనివాస్రెడ్డి, ట్రాలీ డ్రైవర్గా వైవా హర్ష తమదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.