మొదటి అధ్యాయము :
ఈ జగత్తులో సృష్టి లయానికి కారకుడు, దానికి వ్యతిరేకుడు ఎవరో, ఈ సమస్త జగత్తుకు కర్త ఎవరో, తన సొంత సిద్ధ జ్ఞానముతో విరాజిల్లువాడు ఎవరో, బ్రహ్మదేవునికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఎవరో, తన మనస్సు ద్వారా తత్త్వజ్ఞానాన్ని ప్రభోదించినవాడు ఎవరో, ఇంద్రాద్రి దేవతలను కూడా తన మొహంతో పరవశింప చేసినవాడు ఎవర, తనకు సత్వగుణము, రజోగుణము, తమో గుణము వున్నప్పటికీ వాటిలో విలీనం కానివాడు, ఎవనిలో కపటమయితే లేదో... అట్టి సత్యస్వరూపుడైన పరమేశ్వరున్ని నేను ధ్యానిస్తున్నాను.
ఈ భాగవత పురాణం ఏ మాత్రం మచ్చలేని సత్పురుషులు పవిత్రమైన భక్తిరూపంలో కనిపించే విధంగా ఈ ధర్మాన్ని ఆవిస్కరించారు. ‘‘భాగవత పురాణం’’లో మన నిత్య జీవితంలో జరిగే అన్ని తాపత్రయాలను నిర్మూలించే తత్వము.. సమస్త మానవాళికి శుభాలను కలిగించే తత్వము.. సత్యం - నిత్యం అయిన నాశనం లేని తత్వము నిరూపించబడింది. ఈ భాగవత గ్రంథము అందుబాటులో వుండగా.. ఇతర గ్రంథములతో పని ఏముంటుంది? భాగవతం చదవడం వల్ల, వినడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల పరమాత్ముడైన శ్రీహరి కరుణా కటాక్షములు సిద్ధిస్తాయని అనడంలో సందేహమే లేదు. అటువంటి వారి హృదయాలలో శ్రీమహా విష్ణువు స్థిరంగా కొలువుంటాడు.
ఈ భాగవత పురాణము మొట్టమొదటిసారిగా శుకమహర్షి నుండి వెలువడింది. తరువాత ఆయన శిష్యులు, వారి శిష్యుల ద్వారా లోకంలో వ్యాప్తి చెందింది. ఈ భాగవత పురాణము అన్ని వేదముల సారము. ఈ పురాణము అనే పలం పామరులే కాదు.. పండితులు కూడా మాటి మాటికీ తినతగ్గ ఫలము. ఈ భాగమత పల ఆస్వాదనకు స్వర్గ సుఖములు కూడా సాటిరావు. అట్టి భాగవత పురాణమును, గంగాతీరంలో, వ్యాసుని కుమారుడు శకుడు పరీక్షిత్తు మహారాజుకు చెప్పగా విన్న.. సూతి అనే పౌరాణికుడు శౌనకాది మహామునులకు నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో చెప్పాడు.
దేవతలకు ఆవాసమైన నైమిశారణ్యం క్షేత్రంలో, స్వర్గలోకము తమకు ప్రాప్తించడం కోసం, మహామునులందరూ కలిసి వేయి సంవత్సరములు సాగే యాగాన్ని సంకల్పించారు. ఉదయం పూజలు, యజ్ఞకార్యక్రమాలు, అగ్ని హోత్రములు జరుగుతాయి. సాయంత్రము పురాణ కాలక్షేపములు జరుగుతాయి. ఈ సందర్భంలో ఒకనాటి ఉదయము.. మహర్షులు అందరూ అగ్నిహోత్రము కార్యములు నిర్వర్తించిన తరువాత, ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ మహా మునులందరూ సూతపౌరాణికుని సాదరంగా ఆహ్వానించి, ఉచితాసనము మీద కూర్చోబెట్టి, ఆయనను ఇలా అడిగారు...
‘‘ఓ సూతపౌరాణిగా! నీవు మహాభారతము మొదలగు ఇతిహాసములను, 18 పురాణములను, ఇతర గ్రంథములను, నీ గురువుల వద్ద అధ్యయనం చేశారు. వాటిని చక్కగా వ్యాఖ్యానం చేశావు’’.
‘‘ఓ సూత మహర్షీ! వేదములను బాగా తెలిసినవాడు, బ్రహ్మస్వరూపమునకు చక్కగా తెలుసుకున్న వాడు అయిన వ్యాసభగవానుడు ఇంకా ఇతర మహామునుల దయతో నీవు వారినుండి ఇతిహాసములను, పురాణములను ఇంకా ఎన్నో విషయాలను అవగాహన చేసుకున్నావు. నీవు వారికి ప్రియశిష్యుడవు కాబట్టి వారు నీకు అన్ని విషయాలను బోధించి వుంటారు. నీవు వారి వలన తెలుసుకున్న విషయాలను, ఆ ఇతిహాసములలో పురాణములలో మానవులకు శ్రేయస్సును కలిగించే విషయాలు, రహస్యాలు, అన్నీ మాకు చెప్పడానికి నీవే తగిన వాడవు.’’
‘‘ఓ పౌరాణికుడా! ప్రస్తుతం కలియగం నడుస్తోంది. ఈ కలియుగంలో మానవులకు ఆయుష్షు తక్కువ. పైగా వారికి సోమరితనం, బుద్ధిమాంద్యము బాగా అలవడింది. వారికి ఆలోచనా శక్తి సన్నగిల్లింది. అదీ కాకుండా వారు సగతం జీవితం రోగాలతో బాధపడుతున్నారు. అందువల్ల వారికి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే శక్తి లేదు.’’
‘‘ఈ ప్రపంచంలో చేయతగ్గ పనులు చాలారకాలుగా అధికంగా వున్నాయి. వినతగ్గ శాస్త్రాలు, పురాణాలు కూడా ఎన్నో వున్నాయి. వాటిని చదవడానికి, అధ్యయనం చేయడానికి, వినడానికి మానవునికి జీవితం కాలం సరిపోదు. అందువల్ల నీవు అధ్యయనం చేసిన ఇతిహాసాలలో, పురాణములలోని అత్యంత శ్రేష్టమయిన విషయాలను మాకు వినిపించు. వివిధ శాస్త్రములను క్లుప్తంగా మాకు వివరించు. దీనివల్ల మానవుల బుద్ధి వికసిస్తుంది అని, మానవాళికి శ్రేయస్సు కలుగుతుందని మా నమ్మకం.’’
‘‘ఓ సూతపౌరాణికుడా! ఆ వాసుదేవుడు భూభారమును తగ్గించడం కోసం, జగత్కల్యాణం కోసం ఈ భూమి మీద తనకు తానుగా అవతరించాడు. ఆ శ్రీకృష్ణుని అవతార విశేషాలను మాకు వివరంగా తెలపండి’’.
‘‘ఆ భగవానుని లీలలు ఎన్నిసార్లు విన్నా, ఎంతసేపు విన్నా తనివితీరదు కదా! ఎందుకంటే శ్రీకృష్ణలీలలు ఎంత విన్నా ఇంకా వినాలనే వుంటుంది! వినేకొద్దీ కొత్త కొత్త రసాయనుభూతి కలుగుతుంది కదా!’’
ఆ భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు అయినప్పటికీ, ఈ ప్రపంచంలో వున్న మానవులకు తన దర్శనభాగ్యం కలిగించడం కోసం మానవునిగా అవతరించాడు. ఎన్నో లీలలను ప్రదర్శించాడు. ఆ లీలలు అన్నీ మాకు వివరంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’.
కలియుగము ప్రవేశించినది అని తెలుసుకొని మేము సుదీర్ఘమైన యాగం చెయ్యడానికి ఈ నైమిశారణ్యంలో సమావేశం అయ్యాం. మా అదృస్టవశాత్తూ భగవంతుడు మిమ్మలను మాకు చూపించాడు. మీ వల్ల మాకు శ్రీహరి కథలను వినే అద్భుతమైన అవకాశం కలిగింది’’.
ఈ కలికాలము మానవుల బుద్ధిబలమును, శారీరక బలమును నాశనం చేస్తూ వుంది. ఈ కలికాలము అనే భయంకరమైన సముద్రాన్ని దాటడానికి మేము వాసుదేవుని కథలను వినడానికి సంకల్పించాము. ఆ పరమాత్ముడు మాకు నిన్ను కలికాలము అనే సముద్రాన్ని దాటడానికి ఒక నావికూడిగా చూపించాడు.’’
‘‘ఓ సూతపౌరాణికుడా! యోగేశ్వరుడు, ధర్మరక్షకుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ము ఈ లోకంలో తన అవతారం చాలించి వైకుంఠమునకు వెళ్లిన తర్వాత ఈ లోకంలో సనాతన ధర్మం ఎవరిని ఆశ్రయించిందో మాకు చెప్పండి’’ అని శౌనకాది మహామునులు సూత పౌరాణికుని అడిగారు.
(ఇది ఈ భాగవతంలోని ప్రథమ స్కంధంలో మొదటి అధ్యాయము)
రెండవ అధ్యాయము :
శౌనకుడు మొదలగు మహామునులు పై విధంగా అడుగగా.. రోమ మహర్షణుని పుత్రుడు సూత పౌరాణికుడు ఈ విధంగా చెప్పాడు.
‘‘బ్రాహ్మణోత్తములారా! వ్యాసుని కుమారుడు శుకుడు, తండ్రిని వదిలిపెట్టి వనములకు వెళ్లిపోతున్నాడు. కుమారుని ఎడబాటును భరించలేని వ్యాసుడు పెద్దగా ఎలుగెత్తి ‘కుమారా! కుమారా!’ అని పిలిచాడు. వ్యాసుని కంఠస్వరము ఆ అడవిలో వున్న వృక్షములకు, పర్వతములకు తగిలి ప్రతిధ్వనించింది. ఆ శుకయోగీంద్రుడు ఈ ప్రకృతి అంతా నిండి నిబిడీకృతము అయి వున్నాడా అని భ్రమకలిగింది. అటువంటి శుకయోగీంద్రులకు భక్తితో నమస్కరిస్తున్నాను.’’
‘‘నిరంతరము ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి వున్న మానవులను, ఈ సంసార సాగరము నుండి తరింపజేయడానికి, వేదవేదాంగముల సారము, అనుపమము, ఆత్మతత్వమును బోధంచునదీ, అజ్ఞానము అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నవారికి దీపకళికలాంటింది, సర్వపురాణ రహస్యములను కలిగి వున్నది అయిన భాగవత పురాణమును ఈ లోకానికి అందించిన ఆ శుకమమర్షికి ముందుగా భక్తితో సమస్కరిస్తున్నాను.’’
‘‘ఈ భాగవత పురాణానికి అధిదేవత శ్రీమన్నారాయణుడు. ఆయన సఖుడు నరుడు. ఆ నరనారాయణులకు నమస్కరిస్తున్నాను. చదువులతల్లి సరస్వతికి, వ్యాసభగవానుడికి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ జయము కలగాలని కోరుకుంటూ భాగవత పురాణమును చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను’’.
‘‘బ్రాహ్మణోత్తములారా! మీరు నన్ను లోకములకు మంగళకరమైన గొప్ప ప్రశ్నలు అడిగారు. మీరు కోరుకున్న శ్రీకృష్ణకధామృతమును వింటే బుద్ధి ప్రసన్నమవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు’’.
‘‘శ్రీకృష్ణుని యందు, ఏవిధమైన ఫలాపేక్షలేకుండా, ఏకాగ్రతతో కూడిన స్వభావ సిద్ధమైన భక్తి కలిగి వుండటం ధర్మములలో కెల్లా చాలా గొప్పధర్మము. ఆ భక్తిభావము చేతనే మానవులకు సర్వఅనర్థములు తొలిగిపోయి మనస్సుకు శాంతి చేకూరుతుంది. ఆత్మసాక్షాత్కారము జరుగుతంది’’.
‘‘భగవంతుడైన వాసుదేవుడనియందు నిరంతరము భక్తి కలిగి వుంటే, అది జ్ఞానమును, వైరాగ్యమును పెంపొందిస్తుంది’’.
మానవులు వారికి తోచిన ఏయే ధర్మములను ఎంత గొప్పగా ఆచరించినా, భగవంతుని కథలయందు ఆసక్తి లేకపోతే, ఆ ధర్మాచరణము నిష్ర్పయోజనము. కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది. కాబట్టి మానవులు భగవంతుని కథలను చదవడంలో, వినడంలో, భగవంతుని కీర్తించడంలో శ్రద్ధ చూపాలి’’.
‘‘పురుషార్థములలో వున్న అర్థము, మోక్ష ధర్మమునకు యోగ్యము కాదు, ఎన్ని భోగములు అనుభవించినను ఇంద్రియములు తృప్తి చెందవు. ఇంకా కావాలని వుంటాయి. కామమునకు అంతం లేదు. కాబట్టి జీవితమునకు అవసరమైనంత మేరకే కోరికలను పరిమితం చేసుకోవాలి. మానవులు జీవించేది అర్థం సంపాదించడానికి, కామములు (కోరికలు) అనుభవించడానికే కాదు. భగవంతుని తత్వమునందు ఆసక్తి కలిగి వుండటం కూడా ముఖ్యము. తత్వజిజ్ఞాసలేని జీవితము వ్యర్థము. యజ్ఞములు, యాగములు చేసి స్వర్గసుఖములు పొందడం వల్ల ప్రయోజనం లేదు’’.
‘‘పరమాత్మను గురించి తెలుసుకోవడానికి అద్వైతజ్ఞానము ఒక్కటే సత్యమైనది. అదే పరమార్థము. ఆ నిత్యము, సత్యము అయిన జ్ఞానమే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని చెప్పబడుతూ వుంది’’.
‘‘భగవంతుని యందు అపారమైన విశ్వాసము కల మునులు, తాము శాస్త్రములు చదివి, విని సంపాదించిన జ్ఞానంతోనూ, వారు చేసిన మంచి పనులతోనూ, ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేకపోవడం వల్ల కలిగిన భక్తితోనూ తమ హృదయములందు ఆ పరమాత్మ తత్వమును దర్శించగలుగుతున్నారు’’.
‘‘కాబట్టి ఓ మహామునులారా! మానవులు ఏ వర్ణమునకు చెందినవారైనా, ఏ ధర్మమును అనుష్టించినా, దానికి ఆఖరి ఫలము ఆ వాసుదేవునికి ప్రీతి కలిగించడమే. ఆ శ్రీహరి తప్ప వేరే దైవము లేదు’’.
‘‘కావున అంకిత భావంతో శ్రీహరిని గురించిన కథలు వినడం, శ్రీహరిని కీర్తించడం, స్మరించడం, గానం చేయడం, పూజించడం మానవులు చేయతగ్గ పని’’.
‘‘బుద్ధిమంతులైనవారు శ్రీహరి నామస్మరణము అనే కత్తితో, అహంకారముతోనూ భోగాసక్తితోనూ కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలములను నరికివేస్తారు. అటువంటి శ్రీహరి నామస్మరణ యందు, కథల యందు ఎవరికి ఆసక్తి వుండదు చెప్పండి’’.
‘‘ఓ బ్రాహ్మణోత్తములారా! శ్రీహరి కొలువై వున్న తీర్థములను దర్శించడం వల్లకానీ, మంచి గురువులను సేవించడం వల్ల కానీ, కృష్ణభక్తుల ఎడల భక్తి కలిగి వుండటం వల్లగానీ, శాస్త్రములను అధ్యయనం చేయడం వల్ల కానీ, వాటి మీద నమ్మకం వుంచడం వల్ల కానీ, భగవంతుని కథలను వినడంలో కానీ, కోరిక, ఆసక్తి వున్న మానవులకు శ్రీహరి కథలను వినడంలో కూడా ఆసక్తి వుంటుంది’’.
‘‘శ్రీహరి కథలను నిరంతరమూ శ్రవణం చేసే భక్తుల హృదయాలలో ఆ కృష్ణుడు ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుని వుంటాడు, వారి పాపములను నాశం చేస్తూ వుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు’’.
‘‘భాగవత పురాణము చదవడం వల్ల, వినడం వల్ల, భగవద్భక్తులైన భాగవతులను సేవించడం వల్ల సర్వపాపములు నశిస్తాయి. ఆ శ్రీకృష్ణుని యందు అఖండమైన, అచంచలమైన భక్తి కలుగుతుంది’’.
‘‘అటువంటి నిర్మలమైన, అచంచలమైన, ఏకాగ్రతతో కూడిన భక్తి మనసులో పుడితే, మానవుల మనస్సు రజోగుణము, తమో గుణమో వల్ల పుట్టిన కామమునకు, క్రోధమునకు లోను కాకుండా సత్వగుణముతో నిండి ప్రసన్నంగా వుంటుంది’’.
శ్రీకృష్ణుని మీద వున్న అచంచలమైన భక్తి భావంచేత మానవుడు కామము, క్రోధము, మోహము మొదలగు వాసనలకు దూరంగా వుంటాడు. అప్పుడు అతని మనసులో భగవంతుని తత్వము గురించిన జ్ఞానము వర్ధిల్లుతుంది’’.
‘‘అప్పుడు అతనిలోని అనుమానాలన్నీ తొలగిపోతాయి. ఫలాసక్తి నశిస్తుంది. అహంకార రూపంలో వున్న బంధనాలు (ఇది నాది, అది నీది, అంతా నేనే, నన్ను మంచినవాడు లేడు, అనే భావనలు) తొలగిపోతాయి’’.
‘‘అందుకనే సాధకులు అనునిత్యమూ శ్రీహరి సేవ చేస్తూ, శ్రీహరిని స్మరిస్తూ, శ్రీహరిని కీర్తిస్తూ, ఆత్మానందాన్ని పొందుతూ వుంటారు’’.
‘‘సత్వగుణము, రజోగుణము,తమోగుణము అనే మూడూ ప్రకృతి గుణములు. ఈ మూడు గుణములకు అతీతుడు, అధీశుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే సృష్టించేటప్పుడు బ్రహ్మగానూ, పోషించేటప్పుడు విష్ణువుగానూ, లయం చేసేటప్పుడు శివుడు గానూ మూడు రూపములలో ప్రవర్తిస్తూ వుంటాడు. ఈ మూడు రూపములలో శ్రీమన్నారాయణరూపము మాత్రమే విశిష్టమైనది. సమస్తఫలములను ఇస్తుంది’’.
‘‘భూమి నుండి పుట్టిన కట్టెలు మంచివి. ఆ కట్టెల కన్నా అవి కాలుతున్నప్పుడు వచ్చే పొగ మంచిది. ఆ పొగకన్నా ఆ కట్టెలను కాలుస్తున్న అగ్ని మంచిది. ఎందుకంటే ఆ అగ్ని యజ్ఞయాగములను చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే తమోగుణము కన్నా రజోగుణము, రజోగుణము కన్నా సత్త్వగుణము శ్రేష్ఠమైనవి. ఎందుకంటే సత్త్వగుణము ద్వారానే బ్రహ్మపదమును పొందగలము’’.
‘‘సత్త్వగుణ ప్రధానులైన మహాఋషులు ఎల్లప్పుడూ సత్యగుణ స్వరూపుడు, వైకుంఠాధీశుడు అయిన శ్రీ మహా విష్ణువునే సేవిస్తూ వుంటారు. భక్తి తత్పరులైన మానవులు ఆ మహాఋషులను అనుసరిస్తూ వారిని సేవిస్తూ తరిస్తుంటారు’’.
‘‘ముముక్షువులు, అసూయ, ద్వేషములు లేనివారు, శాంతికాముకులు అయిన మునులు ఇతర దేవతలను సేవింపక, కేవలము శ్రీమన్నారాయణుని, ఆయన అవతారములను సేవిస్తూ వుంటారు’’.
‘‘కాని చాలామంది మానవులు రజోగుణమును, తమోగుణమును ఆశ్రయించి, ధనం కోసం, భోగముల కోసం, ఐశ్వర్యం కోసం, సంతానం కోసం పితృదేవతలను, భూతములను, ప్రజాపతులను, ఇతర దేవతలను ఆశ్రయిస్తూ వుంటారు’’.
‘‘కర్మకాండలు, జ్ఞానకాండలు, భక్తి కాండలు బోధించు వేదములు అన్నీ వాసుదేవ స్వరూపాలే. అలాగే మానవులు చేసే యజ్ఞములు, యాగములు అన్నీ వాసుదేవ స్వరూపాలే. ఇంతెందుకు సర్వకర్మలు విష్ణుమయాలే’’.
‘‘మానవులు సముపార్జించే జ్ఞానము, చేసే తపస్సు, ఆచరించే ధర్మము, వైరాగ్యము, చేసే ధ్యానములు, ధర్మములు, వ్రతములు, అన్నీ వాసుదేవుని పరంగానే చేయబడుతున్నాయి. స్వర్గసుఖములను కోరి చేసే యజ్ఞయాగములు, అశాశ్వతమైన ఇహలోక సుఖములను కోరి చేసే పూజలు, వ్రతాలు అన్నీ కూడా ఆ వాసుదేవునికే చెందుతాయి’’.
‘‘ఆ వాసుదేవుడు, తాను ఏ గుణములు అంటని వాడై వుండి కూడా, త్రిగుణములతో కూడిన తన మాయతో ఈ విశాల విశ్వాన్ని సృష్టించాడు’’.
‘‘వాసుదేవుడు తాను నిర్గుణుడు, స్వతంత్రుడు, ఎలాంటి అతిశయము లేని వాడూ, సర్వాధికారి అయి వుండి కూడా, తన మాయతో ఉద్భవించి ఆకాశాది పంచభూతములలో ప్రవేశించి, అన్నీ తానే అయి సగుణుడిగా ప్రకాశిస్తున్నాడు’’.
‘‘అన్ని కట్టెలలో ఒకే రకమైన అగ్ని దాగి వుంటుంది. కానీ ఆ అగ్ని మండేటప్పుడు వివిధ రకాలుగా ప్రకాశిస్తుంది. అలాగే, ఈ విశాల విశ్వంలో వున్న సమస్తప్రాణులలో ఆ శ్రీమహా విష్ణువు అంతర్యామిగా వుండి, వివిధ రూపములలో ప్రకాశిస్తున్నాడు.’’
‘‘విశ్వమంతటా విస్తరించిన ఆ శ్రీమహావిష్ణువు తాను సృష్టించిన సమస్త ప్రాణులతో ఆత్మగానూ, ఇంద్రియములుగానూ, విషయములుగానూ, సత్త్వ, రజస్, తమోగుణాలతో కూడిన భావములు గానూ ప్రవేశించి, వాటిని లీలా మాత్రంగా అనుభవిస్తున్నాడు’’.
‘‘అంతేకాదు.. ఆ మహావిష్ణువు తాను సృష్టించిన వివిధప్రాణుల ద్వారానే ఈ భూమి మీద సత్త్వగుణ ప్రధానుడై అవతరించాడు. ప్రకటిత మయ్యాడు. పరిపాలించాడు’’.
(ఇది ప్రథమ స్కంధంలోని రెండవ భాగం)
మూడవ అధ్యాయం:
ఓ మహామనులారా... భగవంతుడైన శ్రీహరి ఈ విశ్వాన్ని సృష్టించడానికి 16 కళలతో కూడిన విరాట్ స్వరూపాలను ధరించాడు. అవి పంచభూతాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, ఇంకొకటి మనస్సు.
యోగ నిద్రలో వున్న ఆ పరమాత్మ నాభినుండి ఒక కమలం పుట్టింది. ఆ పద్మంలోనుండి బ్రహ్మ జన్మించాడు.
ఆ పరమాత్ముడి శిరస్సు నుండి పాదాలవరకు వున్న అన్ని అవయవాలనుండి సమస్త లోకాలను సృష్టించాడు. ఆ భగవంతుడి రూపం రజోగుణము, తమోగుణము లేని శుద్ధసత్త్వగుణ ప్రధానం.
ఆత్మసాక్షాత్కారం పొందిన యోగులు ఈ శుద్ధసత్త్వగుణ ప్రధానమై, అనేక ముఖాలు, అసంఖ్యాకములైన హస్తాలు, పాదాలు, తలలు... వాటిని అలంకరించిన కిరీటాలు, చెవులు, కళ్లు, ముక్కులతో శోభిల్లుచున్న విరాట్ రూపాలను తమ జ్ఞాననేత్రంతో దర్శిస్తుంటారు.
అన్నిటికన్నా ముందు వున్న ఈ ఆదినారాయణ స్వరూపమే అన్ని అవతారాలకు మూలం. ఆ ఆదినారాయణ అంశతోనే బ్రహ్మ, బ్రహ్మ అంశతోనే మొదలగువారు, వారినుంచి దేవతలు, జంతువులు, నరులు ఇలా ఈ విధంగా సృష్టించబడ్డారు.
శ్రీమహావిష్ణువు మొట్టమొదట సనక, సనాతన, సనందన రూపంతో ఉద్భవించాడు. జీవితాంతం అస్ఖలిత బ్రహ్మచర్యం అవలంభించాడు. ఇది మొదటి అవతారం.
రసాతలానికి తీసుకుపోబడిన భూమిని తిరిగి తీసుకునిరావడానికి యజ్ఞవరాహ అవతారాన్ని ధరించాడు. ఇది రెండవ అవతారం.
పరమాత్మ దేవర్షి అయిన నారద మహర్షిగా మూడవ అవతారాన్ని ధరించాడు. ఈ అవతారంలో పరమాత్మ లోకానికి సాత్వత తంత్రాన్ని బోధించాడు. దానివల్ల మానవులకు భక్తిభావం పెంపొంది, సంసారసంబంధాలనుండి, ప్రాపంచిక విషయవాసనల నుండి విముక్తి కలుగుతుంది.
ధర్మునికి, మూర్తికి నరనారాయణులు అనే ఋషులరూపంలో నాలుగవ అవతారాన్ని ధరించాడు శ్రీమహావిష్ణువు. ఈ అవతారంలో ఆత్మను ప్రసన్నం చేసుకునే విధానం అయిన తపస్సును నరనారాయణులు ప్రతిష్టించారు.
పరమాత్ముడు తన ఐదవ అవతారంగా సిద్ధులలో శ్నేష్టుడు అయిన కపిల మహర్షిగా జన్మించాడు. ఆ అవతారంలో, కాలవశంలో అంతరించిన తత్వాలను నిర్ణయించే సాంఖ్య దర్శనమును ఆసురి అనే బ్రాహ్మణునికి ఉపదేశించాడు.
అత్రి మహాముని భార్య అనసూయ... శ్రీహరిని తన కుమారునిగా పుట్టమని కోరింది. ఆమె కోరికను మన్నించి, పరమాత్మ ఆ దంపతులకు ఆరవ అవతారంలో దత్తాత్రేయుడిగా జన్మించాడు. ఈ అవతారంలో అర్కుడు అనే బ్రాహ్మణునకు, ప్రహ్లాదునకు, హైహయవంశీయులైన రాజులకు ఆత్మవిద్య ఉపదేశించాడు.
ఋచి అనే బ్రాహ్మణుని భార్య ఆకూతి. ఈ దంపతులకు యజ్ఞరూపంగా శ్రీహరి ఏడవ రూపాన్ని ధరించాడు. ఏ అవతారంలో దేవతల తోడ్పాటుతో స్వాయంభువ మన్వంతరమును రక్షించాడు.
నాభికి, మేరుదేవికి కుమారుడిగా ఏడవ అవతారాన్ని ధరించాడు శ్రీహరి. ఆ కుమారుడి పేరు ఋషభుడు. ఈ అవతారంలో సన్యాసాశ్రమాన్ని ఆచరించి, సత్పురుషులకు చూపించాడు.
తన తొమ్మిదవ అవతారంగా శ్రీహరి ఈ భూమి మీద ఔషధాలుగా జన్మించాడు.
చాక్షుష మన్వంతరంలో సముద్రంపొంగి పోయింది. అప్పుడు మానవజాతిని, ఓషధులను రక్షించడానికి శ్రీహరి తన పదవ అవతారంగా మత్స్యావతారాన్ని ధరించాడు. ఈ అవతారంలో శ్రీహరి, మానవులను, ఋషులను, ఓషధులను ఒక నావలో కూర్చోబెట్టుకుని రక్షించాడు.
తన పదకొండవ అవతారంలో శ్రీహరి కూర్మావతారం ధరించాడు. దేవతలు, దానవులు మంథర పర్వతంతో క్షీరసాగరంను మథిస్తుంటే.. ఈ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా, తన వీపు మీద ధరించాడు.
క్షీరసాగరం నుంచి అమృత కలశంతో ధన్వంతరిగా శ్రీహరి పన్నెండవ అవతారాన్ని ధరించాడు.
తాను ధన్వంతరిగా తీసుకువచ్చిన అమృతాన్ని దేవదానవులకు సమానంగా పంచిపెట్టి, అసురులకు ఇవ్వకుండా మోహినీ రూపంలో పదమూడవ రూపంలో అవతరించాడు.
పద్నాలుగవ అవతారంగా శ్రీహరి నరసింహావతారాన్ని దాల్చాడు. ఈ అవతారంలో తన భక్తుడు ప్రహ్లాదున్ని కాపాడటానికి హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చి సంహరించాడు.
తన పదహేనవ అవతారంగా శ్రీహరి వామనావతారం ధరించాడు. ఈ అవతారంలో శ్రీహరి, దేవతలకు స్వర్గాధిపత్యాన్ని ఇవ్వడానికిగాను, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వెళ్లి, బలిని మూడు అడుగుల భూమి దానంగా ఇమ్మని అడిగి, ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి, తన మూడవ పాదాన్ని బలిచక్రవర్తి తలమీద పెట్టి పాతాళానికి అణగదొక్కాడు. దేవతలకు స్వర్యాధిపత్యాన్ని ఇచ్చాడు.
శ్రీహరి తన పదహారవ అవతారాన్ని పరశురాముడిగా ధరించాడు. ఆ సమయంలో క్షత్రియులు దేవతలను, బ్రాహ్మణులను ద్వేషిస్తూ వుండేవారు. ఆ పరిణామాలను కోపించిన పరశురాముడు, క్షత్రియులమీద 21సార్లు దండెత్తి, వారిని సమూలంగా నిర్మూలించాడు.
ఆ తరువాతికాలంలో మానవులు అల్పమేధస్సులుగాను, హీనులుగా వున్నారు. వేదాలను చదివి అర్థం చేసుకోగల శక్తి వారిలో లేకపోయింది. అందువల్ల ఆ సమయంలో శ్రీహరి తన పదనేడవ అవతారంగా వ్యాసుని రూపంలో పరాశరునికి, సత్యవతికి జన్మించాడు. వేదాలను నాలుగు భాగాలుగా చేసి, వాటిని తన శిష్యులకు బోధించి, శాఖోపశాఖలుగా విస్తరింపజేశాడు. ఆవిధంగా అవి మానవులకు చేరువయ్యాయి.
త్రేతాయుగంలో అయోధ్య మహారాజు దశరథునికి, కౌసల్యకు శ్రీరామునిగా జన్మించాడు. సముద్రం మీద సేతువును నిర్మించి, తన బలంతో, వానరుల సాయంతో రావణకుంభకర్ణలను సంహరించాడు. అది శ్రీహరి పద్దెనిమిదవ అవతారం.
ద్వాపరయుగంలో దేవకీ, వసుదేవులకు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. అలాగే బలరామునిగా కూడా అవతరించాడు. ఇవి శ్రీహరి పంతొమ్మిది, ఇరవై అవతారాలు.
కలియుగప్రవేశం తరువాత మానవులు దైవద్వేషులుగా మారారు. కామాతురులు అయ్యారు. ఆ సమయంలో శ్రీహరి బుద్ధుడు అనే పేరుతో అవతరించాడు. బౌద్ధమతాన్ని స్థాపించి, మానవులను సన్మార్గంలో నడిపించాడు. ఇది శ్రీహరి ఇరవైఒకటవ అవతారం.
కలియుగాంతంలో, యుగసంధి కాలంలో రాజులందరూ క్రూరులుగా, రాక్షసులుగా మారిపోతారు. అధర్మాన్ని వృద్ధి చెందిస్తారు. ఆ సమయంలో శ్రీహరి కల్కి అనే పేరుతో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుని ఇంట్లో జన్మిస్తాడు. ఇది ఇరవైరెండవ అవతారం.
ఓ శౌనకాది మహామనులారా! బ్రాహ్మణోత్తములారా! ఒక పెద్ద జీవనది నుండి అనేక ఉపనదులు, కాలువలు వచ్చినట్లుగా, శ్రీహరినుండి అనేక అవతారాలు వెలువడ్డాయి. ప్రజాపతులు, తపోధనులైన మహాఋషులు, మునులు, మానవులు, దేవతలు, అందరూ శ్రీహరి నుంచి వచ్చినవారే.
నిజానికి పరమాత్ముడైన శ్రీహరికి ఏ రూపం లేదు. నిర్గుణుడు, నిరాకారుడు. తన మాయా విశేషంతో అనేక రూపాలలో, అనేక దేహాలను ధరిస్తూ, అవతరిస్తూ వుంటాడు.
కానీ మూఢులు అయిన మానవులు ఆకాశంలో ఆవరించిన మేఘాలను చూసి అదే ఆకాశం అనుకుంటారు. అలాగే నిరాకారుడయిన శ్రీహరికి అనేక రూపాలు ఆపాదించి, ఆ రూపాలనే కొలుస్తూ వుంటారు.
మానవులు తమ అజ్ఞానంతో పరమాత్మకు ఒక స్థూలదేహాన్ని, రూపాన్ని కల్పించి, వివిధ రూపాలతో పూజిస్తూ వుంటారు. ఏ వికారం లేనివాడూ, జనన మరణాలు లేనివాడు, అంతటా తానే వ్యాపించి వున్నవాడయిన ఆ పరమాత్మ అవతారాలను పండితులు, జ్ఞానులు కీర్తిస్తూ వుంటారు. నిర్మలమైన మనస్సుతో ఎల్లప్పుడూ శ్రీహరి పాదపద్మాలను సేవించేవాడు, ఆ శ్రీహరి తత్త్వాలను తెలుసుకోగలడు.
ఓ మహాఋషులారా! మీరందరూ కృతార్థులు. మీరు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగి, శ్రీహరి మీద మీకున్న ఏకాగ్రబుద్ధి, భక్తిప్రతిపత్తులు చాటుకున్నారు. మీరు ఇదే నిశ్చలభావంతో వుంటే, మీకు ప్రతిసారి పుట్టడం, చావడం అనే జననమరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది. దానినే జన్మరాహిత్యం అంటారు.
ఓ మహాఋషులారా! శుకమహర్షి పరీక్షిత్తుకు భాగవత పురాణమును వినిపించేటప్పుడు నేను అక్కడే వున్నాను. ఈ శుకమహర్షి విన్న భాగవతాపురాణాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను.. సావధానండి వినండి.
(ఇది మూడవ భాగం)
నాలుగవ అధ్యాయం :
ఆ విధంగా సూతపౌరాణికుడు పలికిన విధానాన్ని చూసి దీర్ఘసత్రయాగం చేస్తున్న మునులలో శ్రేష్టుడయిన శౌనకమహాముని సూతపౌరాణికునితో ఇలా అన్నాడు... ‘‘ఓ సూత మహాభాగా! నువ్వు పురాణాలను చెప్పడంలో గొప్పవాడివి. శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన భాగవత పురాణాన్ని మాకు వినిపించు. ఈ భాగవత కథను వ్యాసుడు రచించాడు అని చెప్పారు కదా! వ్యాసుడు ఈ భాగవత కథను ఏ కాలంలో, ఏ ప్రదేశంలో, ఏ కారణంవల్ల, ఎవరి ప్రోద్బలంతో రచించాడు’’.
వ్యాసుని కుమారుడు శుకమహర్షి మహాయోగి. ఎప్పుడూ ఏకాంతంలో వుంటూ ధ్యానం చేసుకుంటూ వుంటాడు. ఈ లౌకిక ప్రపంచానికి ఒక జడుడి మాదిరి కనబడుతుంటాడు.
చిన్నవయసులోనే శుకుడు సన్యాసాశ్రమం చేసి ఇంటినుండి వెళ్లిపోయాడు. ముందు శుకుడు వెళుతుంటే వెనుకనుండి వ్యాసుడు ‘‘కుమారా! కుమారా!’’ అని శుకుడిని పిలుస్తూ వెళ్తున్నాడు. దారిలో కొంతమంది దేవతాస్త్రీలు బట్టలన్నీ విప్పి, గట్టున పెట్టి ఒక జలాశయంలో దిగి స్నానాలు చేస్తున్నారు. ఆ దారివెంటే వెళుతున్న శుకుడిని చూసి వారు ఏమాత్రం సిగ్గుపడకుండా తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. కాని శుకుని వెనుక వస్తున్న వ్యాసుడ్ని చూసి గబగబా ఒడ్డుకువచ్చి బట్టలు వేసుకున్నాడు. ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యపోయాడు.
యువకుడైన శుకుడిని చూసి సిగ్గుపడకుండా.. వయోవృద్ధుడయిన తనను చూసి సిగ్గుపడి బట్టలు కట్టుకోవడానికి కారణమేమి అని వారిని అడిగాడు. అప్పుడు దేవతాస్త్రీలు ఇలా అన్నారు.. ‘‘ఓ మహాత్మా! నీ కుమారుడు శుకుడికి స్త్రీపురుష భేదంలేదు. అతనిది పవిత్రదృష్టి. కాని నీకు స్త్రీపురుష భేదం వుంది. అందుకని నిన్ను చూసి బట్టలు ధరించాం’’ అని చెప్పారు. అటువంటి మహాత్ముడు శుకుడు.
అంతేకాకుండా శుకుడు ఒక పిచ్చివాడిలాగా, మూగవాడిలాగా తిరుగుతూ వుంటాడు కదా! అటువంటివాడిని హస్తినాపురవాసులు ఎలా గుర్తించారు. పరీక్షిత్తు మహారాజు శుకునిని ఎలా కలిశాడు? వారు ఏం మాట్లాడుకున్నారు?
శుకమహర్షి భిక్షకోసం గృహస్థుల ఇళ్లకు వెళ్లినప్పుడు, వారి ఇళ్ల దగ్గర గోవునుండి పాలు పితికే సమయం కన్నా ఎక్కువసేపు నిలవడు కదా! మరి హస్తినాపురంలో ఏడురోజులు ఎలా వున్నాడు. భాగవత కథను ఎలా చెప్పాడు.
అర్జునుని కుమారుడైన పరీక్షిత్తు మహాభాగవతుడు అని లోకప్రసిద్ధి కదా! ఆయన గురించి, జన్మ గురించి మాకు వివరించండి. రాజాధిరాజుగా వుండి, లక్షణంగా రాజ్యం చేసుకునేవాడు... రాజ్యాన్ని వదిలిపెట్టి ప్రాయోపవేశం ఎందుకు వేశాడు? ఆయనకు వచ్చిన కష్టమేంటి?
శత్రువులనుంచి కూడా కానుకలు, కప్పములు కట్టించుకునే ధర్మాత్ముడు అయిన పరీక్షిత్ మహారాజు.. నిండు యవ్వనంలోనే రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రాణత్యాగం చేయవలెనని కోరిక ఎందుకు పుట్టింది..?
ఈ లోకంలో భగవద్భక్తులు తమ స్వార్థపరత్వాన్ని వదిలిపెట్టి, జనుల సుఖం, క్షేమం కోసం జీవిస్తూ వుంటారు కదా! అటువంటి పరీక్షిత్తు మహారాజు.. తన స్వార్థాన్ని విడిచిపెట్టి నిరంతరం ప్రజలక్షేమంకోసం, వారి అభ్యుదయం కోసం పాటుపడే పరీక్షిత్తు మహారాజు ప్రాయోపవేశం ఎందుకు చేశాడు?
ఈ విషయాలన్నీ మీకు తెలిసినంతవరకూ మాకు తెలియదు. ఇటువంటి విషయాలు, వేదాలు, శాస్త్రములకు సంబందించిన వాటిగురించి చెప్పడంలో నువ్వు నిష్ణాతుడవు కదా!’’ అని అడిగాడు.
శౌనకుడు అడిగిన ప్రశ్నలకు సూతపౌరాణికుడు ఇలా జవాబిచ్చాడు.... ‘‘ఓ బ్రాహ్మణోత్తములారా! త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం ప్రవేశించింది. ఒకానొక శుభముహూర్తంలో ఉపరిచర వసువు వీర్యం విధివశాత్తు చేపనోట్లో పడింది. ఆ వీర్యం చేపకడుపులో శిశువుగా మారి, దాశరాజు ఇంటికిచేరి, ఆయన ఇంట్లో సత్యవతి అనే పేరుతో పెరిగి పెద్దదయింది. యవ్వనంలో వున్న సత్యవతికి, పరాశర మహర్షికి వ్యాసుడు జన్మించాడు. పుట్టీపుట్టగానే వ్యసుడు బదిరికాశ్రమానికి వెళ్లిపోయాడు. సరస్వతీ నదితీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ వున్నాడు.
వ్యాసుడికి అన్ని కాలాలలో జరిగే విషయాలు తెలుస్తూ వుంటాయి. యుగాలు గడిచేకొద్దీ మానవులలో శక్తి, సామర్థ్యాలు నశించిపోతూ వుండటం, తమ చేసే పనులలో శ్రద్ధ లేకపోవడం వంటి విషయాలు వ్యాసుడు తయ యోగదృష్టి ద్వారా గమనించాడు. యుగాలు గడిచేకొద్దీ మానవుల ఆయు:ప్రాణం తగ్గిపోతూ వుండటం, వారికి అదృష్టం అంతంతమాత్రంగానే వుండటం చూశాడు. ఈ పరిస్థితులలో అన్ని వర్ణాలు, జాతులవారికీ శుభం కలుగజేయాలని అనుకున్నాడు.
ఆ కాలంలో అన్ని వేదాలు కలిసి ఒకే వేదంగా వుండేది. ఏ విషయం ఎక్కడుందో తెలుసుకోవడం కష్టంగా వుండేది. కాబట్టి వ్యాసులు వేదాలను సులభతరం కోసం నాలుగు భాగాలుగా విభజించాడు. వాటికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని పేర్లు పెట్టాడు. తాను రచించిన ఇతిహాసాలు, పురాణాలు అన్ని కలిపి పంచమవేదంగా అభివర్ణించాడు.
అలా తాను విభజించిన నాలుగు వేదాలను లోకంలో ప్రచారం చేయడానికి శిష్యులను నియమించాడు. ఋగ్వేదం పైలునకు, జైమినికి సామవేదం, వైశంపాయనకు యజుర్వేదం, సుమంతునికి అధర్వణ వేదం అప్పగించాడు.
ఆ తర్వాత ఆ నలుగురు తమకు అప్పగించిన వేదాలను అనేక విభాగాలు చేసి లోకంలో వ్యాప్తి చేశారు. వారినుండి వారి శిష్యులకు, వారి శిష్యులకు అలా అందచేస్తూ పోయారు. అలా వేదాలు శాఖోపశాకలుగా లోకంలో విస్తరించాయి.
కానీ ఆనాటి యుగధర్మం ప్రకారం స్త్రీలకు, శూద్రులకు, కేవలం పుట్టుకతో బ్రాహ్మణులు అయివున్నవారు మాత్రమే వేదాలను అధ్యయనం చేయడానికి, వినడానికి అర్హత వుండేది. మిగతావారికి శ్రేయస్సు కలిగించాలని భారతం అనే ఇతిహాసాన్ని రచించాడు. అందులో నాలుగువేదాలలో వున్న అన్ని విషయాలను పొందుపరిచాడు.
మానవజాతికి ఏదోవిధంగా శ్రేయస్సు చేయాలని తాపత్రేయపడే వ్యాసునికి, ఇతిహాసాలు, పురాణాలు రచించినా తృప్తి కలుగలేదు. ఇంకా చేయాల్సింది ఏదో వుందని అతని మనస్సు కలిచివేస్తూ వుంది. అందుకే నదీతీరంలో కూర్చొని ఈ ప్రకారంగా వ్యాసుడు ఆలోచిస్తున్నాడు.
‘‘నేను ఎంతో నిష్టగా బ్రహ్మచర్యం వ్రతాలను ఆచరించాను. నిత్యం అగ్నిహోత్రం చేశాను. గురువులను ఆచరించి, వారి ఆజ్ఞప్రకారం నడుచుకున్నాను. మహాభారతం పేరుమీద నాలుగు వేదాలకు అందరికీ వీలుగా వుండేవిధంగా కథల రూపంలో లోకానికి వెల్లడి చేశాను.
వేదాలను విభజించి, మహాభారతం రచనా చేసినా.. నేను చేసిన పనులకు పరిపూర్ణత చేకూరలేదని నాకు బాధగా వుంది. నా ఆత్మ బ్రహ్మతేజస్సుతో కూడింది అయినా.. ఇంకా అపరిపూర్ణంగానే వుంది.
నేను రచించిన మహాభారతంలో వేదాలగురించి వివరించాను గానీ, భగవంతుని దగ్గరకు చేరుకునే ఉపాయం ఎక్కడా వివరించలేదు. అందుకే నేను చేసిన రచనలన్నీ అసంపూర్ణంగా మిగిలిపోయాయి’’ అని ఆవేదన చెందుతున్నాడు వ్యాసభగవానుడు.
(ఇది ప్రథమస్కందంలో నాలుగవ అధ్యాయం)
ప్రథమ స్కంధం - ఐదవ అధ్యాయం :
అలా వ్యాసుడు ఆవేదన చెందుతున్న సమయంలో నారదుడు వచ్చాడు. నారుదుడిని చూసి వ్యాసుడు అతిథి సత్కారాలు చేసి, మథావిధిగా పూజించాడు.
అప్పుడు నారదుడు వ్యాసునితో... ‘‘ఓ పరాశరనందనా! ఎలా వున్నారు? నీ ఆత్మ.. నీ మనసు చేసే ఆలోచనలవల్ల, నీ శరీరం చేసే పనుల వల్ల సంతుష్టి పొందుతోందా! నువ్వు ఒక జిజ్ఞాసువు. నీకు తెలియని విషయం, ధర్మమంటూ లేదు. నీకు తెలిసిన ధర్మాలను మేరకు చక్కగా ఆచరించావు. వేదాలను విభజించి, ధర్మం, అర్తం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలను సంపూర్ణంగా మహాభారతంలో రచించావు.
అంతేకాకుండా సనాతనమైన బ్రహ్మతత్త్వాన్ని కూడా బాగా తెలుసుకున్నావు. కానీ నీ మొహంలో చింత కనిపిస్తూ వుంది. ఇన్ని చేసిన నువ్వు దేనికోసం చింతిస్తున్నావు. ఇంకా నువ్వు కృతార్థుడు కాలేదని సంకోచిస్తున్నావా?’’ అని అడిగాడు నారదుడు.
దానికి సమాధానంగా వ్యాసుడు ఇలా చెప్పాడు... ‘‘ఓ నారదుడా! నువ్వు చెప్పిందంతా నిజమే. నేను లోకకల్యాణం కోసం ఎన్నో పనులు చేశాను. కానీ నా శరీరం, మనస్సు తృప్తి చెందలేదు. ఇంకా ఏదో చేయాలని తపన. కానీ నాకు ఏమి తోచడం లేదు. నువ్వు బ్రహ్మమానసపుత్రుడవు. నీకు తెలియని విషయాలు ఏమీ లేవు. అందుకే నిన్ను అడుగుతున్నా... నా అసంతృప్తికి కారణమేంటి? ఏం చేస్తే నా శరీరానికి తృప్తి కలుగుతుంది. దయచేసి చెప్పండి.
ఎందుకంటే నువ్వు లోకసంచారం చేస్తుంటావు. ఈ విశ్వానికి సర్వాధికారి అయిన విష్ణువును నిరంతం ఉపాసిస్తూ భజిస్తుంటావు. ఆయన గురించిన రహస్యాలు నీకు బాగా తెలుసు. నీ యశస్సు మూడు లోకాలలో సూర్యతేజంలా వ్యపించి వుంది. నీ యోగశక్తి ద్వారా మానవుల మనోగతాన్ని అవగాహన చేసుకున్న సమర్థుడివి. నేను ప్రతిదినం వేదాధ్యానం చేస్తూ.. నియమనిష్టలతో జీవితం గడుపుతున్నాను. కానీ నాలో ఏదో లోపం కనబడుతోంది. అదేదో తెలియజేయండి’’ అని అడిగాడు వ్యాసుడు.
దానికి నారదుడు.. ‘‘ఓ వ్యాస మునీంద్రా! నువ్వు మహాభారతం రచించి.. అందులో లౌకిక విషయాల గురించి మాత్రమే చెప్పగలిగావ్. కానీ శ్రీహరి గురించి, ఆయన పవిత్రయశస్సు గురించి వివరంగా చెప్పలేదు. నువ్వు ఏం చేసినా, ఎంత చెప్పినా.. అందులో శ్రీహరి మహిమ గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే అవుతుంది.
నువ్వు రాసిన గ్రంథాలలో కేవలం ధర్మం, అర్థం, కామం గురించి ప్రధానంగా చెప్పావు. కాని వాసుదేవుని మహిమలు, అతని కథల గురించి చెప్పలేదు. పవిత్రమైన శ్రీహరి యశస్సు గురించి తెలుపకపోతే.. అది నిష్ర్పయోజనమే. భగవంతుని గురించి విచారించేవారు, ఆయన పాదపద్మాలను ఆశ్రయించినవారు నువ్వు రాసిన గ్రంథాల గురించి ఆలోచించరు.. చదవడానికి ఆసక్తి చూపరు.
ఏదయినా గ్రంధము అపశబ్దంతో కూడింది అయినా, ఛందోబద్ధం కానప్పటికీ.. అందులో శ్రీహరి యశస్సు కీర్తింపబడి వుంటే.. అది పవిత్ర గ్రంథం అవుతుంది. అందులో వున్న అంశాలనే భక్తులు వింటారు, కీర్తిస్తారు. ఎందుకంటే.. భక్తులకు భగవంతుని లీలలమీదే ఆసక్తి కానీ, అందులో వున్న అపశబ్దములు, అలంకార విషయాలలో కాదు.
మానవులు నిష్కామకర్మలు ఆచరించినప్పటికీ.. అవి అచ్యుతిని మీద భక్తిభావంతో చేయకపోతే నిరర్థకాలు అవుతాయి. ఆ నిష్కామ కర్మలు సాధించేటప్పుడు దు:ఖము కలుగుతుంది కాని మనశ్శాంతి కలగదు. మానవులు ఏవిధమైన కర్మలు ఆచరించినా.. అవి భగవంతుని మీద భక్తి విశ్వాసంతో ఆచరించకపోతే.. వాటికి శోభ చేకూరదు.
ఓ వ్యాసమునీంద్రా! నీ జ్ఞానదృష్టి అమోఘం. నీ బుద్ధిబలం అద్వితీయం. అందులో సందేహం లేదు. నువ్వు నియమనిష్టలను పాటించడంతోపాటు ఎప్పుడూ సత్యాన్నే పలుకుతావు. కాబట్టి మానవులు ముక్తిచెందే మార్గం గురించి వివరించాలంటే.. శ్రీహరి లీలలను మనస్సుతో సంపూర్ణంగా వివరించు.
ఎందుకంటే.. మానవుడు శ్రీహరిలీలలు కాకుండా.. ఇతరులను ఇష్టపడేవాడు.. భగవంతునికి రకరకాలు రూపాలు, పేర్లు కల్పించి.. వాటినే సేవిస్తూ, కీర్తిస్తూ.. ప్రాపంచిక సంబంధ కోరికలను కోరుతూ, తీర్చకుంటూ కాలం గడుపుతాడు. వాడి మనస్సు నడిసముద్రంలో వున్న నావలా కొట్టుమిట్టాడుతుంది. వాడి బుద్ధి, మనస్సు ఏ దేవుడి మీద స్థిరంగా వుండదు.
మానవులు సహజంగా ప్రాపంచిక విషయాల మీదే ఆసక్తి చూపుతారు. నువ్వు రాసిన గ్రంథాలలో ధర్మంకోసం కోరికలతో కూడిన కర్మలను చేయమని విశదీకరించావు. అదే ధర్మం అని తెలిపావు. కానీ అది అన్యాయం. ఈ తెలివితక్కువ మానవులు నువ్వు చెప్పిందే ధర్మం అని భావించి, వాటినే ఆచరిస్తున్నారు. ఇప్పుడది ధర్మం కాదు అని చెప్పినా వినే పరిస్థితులలో లేరు ఈ మానవులు.
బుద్ధిమంతులయిన మానవులు ఆచరించవలసిన ధర్మమేమిటంటే.. అన్ని కర్మలను చేయడం విడిచి, సర్వత్రా వ్యాపించివున్న శ్రీహరి సేవలో తరించడం, అందులోనే ఆనందం పొందడం, ఆ ఆనందంలోనే శ్రీహరి స్వరూపం తెలుసుకోవడం. కాబట్టి ఓ వ్యాసమహర్షి! కేవలం కర్మలను ఆచరిస్తున్న మానవులకు, దేహం మీద వున్న అభిమానంవల్ల జీవిస్తున్న మానవజాతికి శ్రీహరి లీలల గురించి వివరించు.
ఎప్పుడూ భగవంతుడిని ఉపాసించేవాడు.. ఏ కారణం చేతనో పాపపు జన్మనెత్తినా.. అందులో లీనం కాడు. అందులో కూడా శ్రీహరి స్మరణ వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ భగవంతుని పాదాలను సేవిస్తూ వుంటాడు.
ఓ వ్యాసమునీంద్రా! ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే. నువ్వు కూడా ఆ పరమాత్మ అంశలోనే జన్మించావు. నువ్వు జన్మనెత్తాల్సిన అవసరం లేకపోయినా.. లోకకల్యాణం కోసం మళ్లీ వ్యాసుడిగా జన్మించావు. అది కూడా నీకు తెలుసు. అందువల్ల శ్రీహరి గురించి, ఆయన లీలల గురించి నీకన్నా బాగా తెలిసివాడు ఎవ్వరూ లేరు. కాబట్టి శ్రీహరి లీలలను మనోహరంగా వర్ణించు.
ఓ వ్యాసమహర్షి! ఇంతకుముందు కల్పంలో, నా పూర్వజన్మలో నేను ఒక దాసీ పుత్రుడిని. మా తల్లిగారు వేదవేదాంగపారంగతులైన కొంతమంది బ్రాహ్మణులవద్ద దాసీగా పనిచేస్తూ వుండేది. ఆ బ్రాహ్మణయోగులు చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభించారు. మా తల్లితోపాటు నేనుకూడా బాల్యం నుండి వారికి సేవ చేస్తున్నాను. వారు చెప్పిన సేవలను చేసుకుంటూ వుండేవాడ్ని. దానికి వారు నన్ను బాగా మెచ్చుకున్నారు.
ఒకసారి నేను వారు తిన్న తరువాత భిక్షపాత్రలో మిగిలిన ఆహారాన్ని తిన్నాను. అందువల్ల నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా మనసు పరిశుద్ధమయింది. ఈశ్వరసేవలో నాకు ఆసక్తి ఎక్కువైంది. ఋషులు సాయంత్రంవేళల్లో చెప్పే విష్ణుకథలను శ్రద్ధగా వినడంవల్ల శ్రీహరి యందు భక్తి కుదిరింది. దాంతో నా బుద్ధి నిశ్చలమయింది. దాని ప్రభావంవల్ల నేను అంతర్ముఖుడనై నా స్థూలశరీరంలో వున్న పరమాత్మను దర్శించగలిగాను.
తరువాత యోగులు ఆ చోటు విడిచి వెళ్లడానికి ముందు నాకు అత్యంత గుహ్యమైన ఈశ్వరజ్ఞానం ఉపదేశించారు. వాని ఫలితంగా నేను పరమాత్ముని అసలైన స్వరూపాన్ని తెలుసుకోగలిగాను. దానివల్లే కదా జీవులు కూడా పరమాత్మను చేరుకోగలుగుతారు. ఆ అదృష్టం నాకు లభించింది.
ఓ వ్యాసమహర్షి! ఏ పదార్థాలను తింటే రోగాలు వస్తాయో, అవే పదార్థాలు తింటే ఆ రోగం తగ్గిపోదుకదా! కాని అదే పదార్థంలో ఓషధులు కలిపి సేవిస్తే.. రోగం తగ్గిపోతుంది. అలాగే మానవులు శాస్త్రప్రకారం చేసే కర్మలు, వారిని సంసార బంధంలోకి నెడుతుంటాయి. అవే కర్మలను ఈశ్వరార్పణం చేస్తే మనలో వున్న అహంకారం నశించిపోతుంది. ఆ కర్మల ఫలాలు మనల్ని అంటవు.
కాబట్టి మానవులు ఏ కర్మలు చేసినా అవి శ్రీహరి ప్రతీకోసమే చెయ్యాలి. ఆ సమయంలో కృష్ణనామ సంకీర్తనం చేస్తూ కర్మలను ఆచరించాలి.
ఓ శ్రీకృష్ణా! నువ్వు వ్యాసుదేవుడు, ప్రద్యుమ్ముడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అనే నాలుగు వ్యూహాలు కలిగినవాడివి. కాబట్టి నిన్ను మనస్ఫూర్తిగా పూజిస్తూ.. ధ్యానించుచున్నాను. శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించే వ్యక్తి అందరిలోనూ పరమాత్మను చూడగలడు. అందరిపట్ల సమానదృష్టి కలిగి వుంటాడు.
కాబట్టి ఓ వ్యాసమహర్షి! నువ్వు కూడా ఆ విష్ణుమూర్తి, ఆయన అవతార విశేషాలను కీర్తించు. భక్తిమార్గాన్ని బోధించు. ఈ ఈశ్వరజ్ఞానాన్ని తెలుసుకుంటే.. సమస్తం తెలిసినట్టే. ఈ మానవుల బాధలు తొలగించడానికి ఇంతకంటే భక్తిమార్గం వేరే ఉపాయం లేదు’’ అని నారద మహర్షి వ్యాసునికి వివరిస్తాడు.
(ఇది ఐదవ అధ్యాయం)
ప్రథమ స్కంధంలోని ఆరవ అధ్యాయము :
సూతపౌరాణికుడు మహామునులను చూసి.. ‘‘ఓ మహామనులారా! నారదుడు చెప్పిన మాటలు విని.. వ్యాసుడు ఇలా అడిగాడు’’.
‘‘నారద మునీంద్రా! నీకు జ్ఞానభిక్ష పెట్టిన ఆ సన్యాసులు వెళ్లిపోయిన తర్వాత నీ బాల్యం ఎలా గడిచింది. జీవితం ఎలా గడిచింది. వార్థక్యంలో ఏం చేశారు? కాలం గడిచేకొద్దీ ముసలితనం వస్తుంది కదా... తరువాత దాసీగర్భం నుంచి జన్మించిన ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టావు? మానవుడు ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం ధరించగానే పూర్వజన్మం గుర్తుండదు కదా.. కానీ నీ పూర్వజన్మం స్మృతి ఎందుకు నాశనం కాలేదు. నాకు వివరించండి’’ అని అడిగాడు.
నారదుడు.. ‘‘ఓ వ్యాసమహర్షీ! నాకు జ్ఞానం ఉపదేశించిన సన్యాసులు వెళ్లిపోయిన తరువాత నేను నా తల్లి సంరక్షణలో పెరిగాను. నా తల్లి ఒక దాసి. ఆమెకు అంతగా తెలివితేటలు లేవు. ఆమెకు నేనొక్కడినే కుమారుడ్ని. అందుకే అమ్మకు నేనంటే ప్రేమ ఎక్కువ. అప్పుడు నాకు 5 సంవత్సరాలు. నాకు ప్రపంచజ్ఞానం అంతగా లేదు. తల్లి ఏది చెబితే అదే చేసేవాడిని. ఆ విధంగా నేను, నా తల్లి.. ఆ బ్రాహ్మణుల ఇంట్లో వాళ్ల పనులు చేస్తూ కాలం గడిపాము.
ఒకరోజు రాత్రి అమ్మ పాలు పితకడానికి బయటకు వెళ్లింది. అప్పుడు దారిలో ఆమెకు పాము కరిచింది. విషం తలకు ఎక్కి మా అమ్మ మరణించింది. లోకంలో వున్న ఒక్క బంధం తెగిపోయి.. ఏకాకిగా మిగిలాను. అయితే నా తల్లి మరణం ఒకవిధంగా భగవంతుడు చేసిన మంచిదే అని అనుకున్నాను.
అమ్మ మరణించిన తరువాత నేను ఆ ఊరు వదిలి, ఉత్తర దిశగా ప్రయాణం సాగించాను. ఎన్నో దేశాలు, అడవులు, నదులు దాటాను. నా శరీరం బాగా అలసిపోయింది. దారిలో ఒక నది కనిపించింది. నేను ఆ నదిలో స్నానం చేసి.. స్వచ్ఛమైన నీటితో దాహం తీర్చుకున్నాను. దాంతో నా శరీరం బడలిక తీరిపోయింది.
అలాగే నడుస్తూ నేను ఒక రావి చెట్టు కింద భగవంతుడికి ధ్యానం చేస్తూ కూర్చున్నాను. బాహ్య ఇంద్రియాలను నియంత్రించి మనసును అంతర్ముఖం చేసి.. సమాధిలో మునిగిపోయాను. పరమాత్మను సందర్శించాలనే కోరిక గాఢంగా కలిగింది. నేను అలాగే పరమాత్మను ధ్యానిస్తుండేవాడిని.
హఠాత్తుగా నా హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టయింది. నా హృదయంలో శ్రీహరి సాక్షాత్కరించాడు. అంతలోనే మాయమైపోయాడు. నేను కళ్లు తెరిచాను. పరమాత్మను చూడలేకపోయాననే బాధతో మళ్లి కళ్లు మూసుకున్నాను. మళ్లీ పరమాత్మను గ్రహించడంలో మునిగిపోయాను. కానీ పరమాత్మ నాకు సాక్షాత్కారం కాలేదు. పట్టువదలకుండా అలాగే ప్రయత్నించాను.
అప్పుడు మనసుకు అందని పరమాత్మ నాతో ప్రేమగా ఇలా అన్నాడు... ‘‘బాలకా! నీకు నామీద భక్తి కలగడం కోసమే నీ మనసులో తళుక్కున మెరిసాను. మళ్లీ ఈ జన్మలో నీకు నా దర్శనం కాదు. నామీద భక్తి కలిగినవాడు కామ, క్రోధ, మోహాలను త్యజించి పరితపిస్తాడు.
నువ్వు సత్పురుషులకు సేవ చేయడం వల్ల నీకు నామీద స్థిరమైన బుద్ధి కలిగేటట్లు చేసింది. నువ్వు ఈ జన్మను వదిలి, తరువాత జన్మలో నన్ను చేరుకుంటావు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా.. నామీద నీకున్న భక్తి వల్ల నీ పూర్వజన్మ స్మృతి తొలగిపోదు’’ అని పరమాత్మ నాతో చెప్పి ఆ తరువాత ఊరకుండిపోయాడు.
ఆయన చెప్పిన మాటలతో నాలో వున్న సందేహాలు అన్ని తొలగిపోయాయి. ఆ తరువాత నాకు భగవన్నామస్మరణ తప్ప వేరే ధ్యాసేలేదు. భగవంతుని లీలలగురించి తెలుసుకోవడం కోసం భూమి అంతా తిరిగాను. కోరికలను, అహంకారాలను పూర్తిగా తొలగించుకున్నాను. కాలాంతరంలో నాకు మృత్యువు సమీపించింది. భగవంతునిమీదే మనసు కేంద్రీకరించి, ఆయన నామాన్ని స్మరించాను. భగవంతుని కృపకు పాత్రుడయ్యాను. తరువాత నా భౌతిక శరీరం పతనమయింది.
కల్పాంతంలో ఈ జగములన్నీ జలమయం కాగా... శ్రీమన్నారాయణుడు వటపత్ర సాయిగా శయనించి వున్నాడు. బ్రహ్మదేవుడు నిద్రపోవడానికి ఉపక్రమించాడు. అప్పుడు నేను బ్రహ్మదేవుడు తీసుకున్న శ్వాసద్వారా పరమాత్మ కడుపులో ప్రవేశించాను. ఆ తరువాత వేయి యుగాలు గడిచాయి.
శ్రీమన్నారాయణుడు నిద్రనుంచి మేలుకున్న తరువాత సృష్టి మొదలయింది. అప్పుడు పరమాత్మ ఇంద్రియాల నుంచి నేను, మరుత్తులు, ఋషులు పుట్టారు. నాకు ఆ పరమాత్మ కటాక్షం పరిపూర్ణంగా లభించింది. మూల్లోకాలలో ఎక్కడికైనా వెళ్లగల గమనశక్తిని సంపాదించాను. బ్రహ్మదేవుడు ప్రసాదించిన ఈ వీణను శృతిచేసి, భగవంతుని లీలల గురించి గానం చేస్తున్నాను.
ఈ జన్మలో నేను ఎప్పుడు తలచుకుంటే అప్పుడు శ్రీహరి నా హృదయంలో దర్శనం ఇస్తుంటాడు. నేను కేవలం భగవానుడి నామస్మరణంతో తరించాను. మానవ జీవితంలో కామం, క్రోధం, మోహం, మదం పట్టి పీడిస్తుంటాయి. వాటికి వశులయిన మానవులకు శాంతి కరువవుతోంది. ఎన్ని నియమాలు, యోగాలు ఆచరించినా.. వారిని శాంతి లభ్యం కావడం లేదు. కేవలం భగవన్నామస్మరణ, అతని మీద భక్తితోనే వారి మనస్సుకు శాంతి కలుగుతుంది.
ఓ వ్యాసమునీంద్రా! నా పూర్వజన్మ విశేషాల గురించి నీకు వివరించాను’’ అని నారదుడు, వ్యాసునికి చప్పాడు. తరువాత నారదుడు వీణను మ్రోగిస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని సూత పౌరాణికుడు, మహామునులతో చెప్పాడు.
(ఇది ప్రథమస్కందంలోని ఆరవ అధ్యాయం)
ప్రథమస్కంధంలోని ఏడవ అధ్యాయము :
శౌనకాది మహామునులు, సూతుడితో.. ‘‘మహాత్మా! నారదుడు వెళ్లిపోయిన తరువాత ఆయన అభిప్రాయం తెలుసుకున్న వ్యాసుడు ఏమి చేశాడు. మాకు చెప్పండి’’ అని అడిగారు. దాంతో సూతుడు ఇలా చెప్పాడు..
‘‘ఓ బ్రాహ్మణోత్తములారా! సరస్తీ నదితీరంలో పడమటి ప్రాంతంలో బ్రాహ్మణులు నివసించే శమ్యాప్రాస అనే ఆశ్రమం వుంది. ఆ ఆశ్రమం యజ్ఞాలు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా వుండేది. వ్యాసుడు ఆ ఆశ్రమంలో వుండేవాడు. అందులోనే వ్యాసుడు తన మనస్సును స్థిరపరుచుకొని ధ్యానంలో వుండిపోయాడు. భక్తి యాగంతో వ్యాసుని మనస్సు నిర్మలమయింది. ఆయన మనస్సు నిశ్చలంగా వున్నప్పుడు.. తన హృదయంలో శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించుకున్న మాయను దర్శించగలిగాడు.
వ్యాసుడు ధ్యానం చేస్తుంటే.. అతని మనసులో భక్తిభావాలు మెలిగాయి. దాంతో ఆయన భగవంతుని భక్తిభావం తెలియని ప్రజలకోసం భాగవతం రచించాడు. భాగవత రచన పూర్తి చేసిన తరువాత వ్యాసుడు, తన కుమారుడైన శుకునికి బోధించాడు’’ అని సూతుడు చెప్పాడు. అప్పుడు శౌనకాది మహుమునులకు ఒక సందేహం కలిగి.. ‘‘సూతుడా! వ్యాసుని కుమారుడైన శుకుడు ఏమాత్రం భోగభాగ్యాలమీద ఆసక్తి లేకుండా, పరమాత్మను సందర్శిస్తూ బ్రహ్మానందాన్ని పొందుతుంటాడని చెప్పారు కదా! మరి ఆయనకు ఈ భాగవతం వినాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?’’ అని అడిగారు.
దానికి సూతుడు.. ‘‘ఓ మునులారా! భాగవతం శ్రీహరి కథలతో నిండి వుంది. మీరు చెప్పినప్పుడు ఎల్లప్పుడు పరబ్రహ్మను గురించి ధ్యానించేవారు, ఎటువంటి పలాన్ని ఆశించకుండా శ్రీహరిని సేవిస్తూ వుంటారు. అటువంటివారు శ్రీహరి అవతార విశేషాలు, కథలను వినడంలో కూడా ఆసక్తి చూపుతారు. దాంతో విష్ణుజన ప్రియుడైన శుకుడు.. భాగవతం అధ్యయనం చేశాడు. తరువాత పరీక్షిత్తు మహారాజు పుట్టాడు. ఏడు రోజులలో మరణిస్తాడని ఆయనకు ఒక ముని శాపం తగిలింది. ఆ ఏడురోజుల్లోనే పరీక్షిత్తు మహారాజు, శుకుని నుంచి భాగవతం విన్నాడు. ఆ కథను వివరిస్తాను వినండి..
కథ :
కురు, పాండవులకు మధ్య రాజ్యం కోసం యుద్ధం జరిగింది. ఇరుపక్షాలలో ఎంతోమంది వీరులు చనిపోయారు. భీముడు, సుయోధనులకు గదాయుద్ధం జరిగింది. అందులో భీముడు, సుయోధనుని తొడలను విరగగొట్టాడు. అప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ సుయోధననుని కలుసుకున్నారు. అతడు అశ్వత్తామను పాండవుల వంశాన్ని నాశనం చేయాల్సిందిగా కోరాడు. అతని ఆదేశం ప్రకారం బ్రాహ్మణుడైన అశ్వత్థామ క్షాత్రాన్ని అవలంభించి, ఆరోజు రాత్రి నిద్రపోతున్న ద్రౌపదీ కుమారుల శిరస్సులను నిర్దాక్షిణ్యంగా నరికాదు. దాంతో అతనిని సుయోధనునితోపాటు అందరూ నిందించారు.
కుమారుల మరణవార్త విన్న ద్రౌపది శోకసముద్రంలో మునిగిపోయింది. ఎంతమంది ఓదార్చినా ఆమె శోకం తగ్గలేదు. అప్పుడు అర్జునుడు ఆమెను ఓదార్చుతూ.. ‘‘నీ కుమారులను అశ్వత్థామ నిర్దాక్షిణ్యంగా చంపాడు కాబట్టి నేను ఇప్పుడే అతనిని నా బాణాలకు బలి చేస్తాను. అతని శిరస్సును నీకు కానుకగా ఇస్తాను. కుమారుల దహనసంస్కారం అయిన తర్వాత నువ్వు అశ్వత్థామ తలమీద కూర్చుని, స్నానం చెయ్యి. అప్పుడు నేను నీ కళ్లలో జాలువారే కన్నీటిని తుడుస్తాను’’ అని చెబుతాడు.
తరువాత అర్జునుడు తన రథం మీదెక్కి, శ్రీకృష్ణుడు సారథిగా అశ్వత్థామను వెతుకుతూ బయలుదేరాడు. వారిని చూసిన అశ్వత్థామ భయంతో వణికిపోయి, ప్రాణభయంతో పరుగులు తీశాడు. అలా పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి.. చేసేదేమీ లేక తన తండ్రి ఉపదేశించిన బ్రహ్మశిరోనామాకాస్త్రాన్ని ప్రయోగించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అయితే అశ్వత్థామకు అది ప్రయోగించడం మాత్రమే తెలుసు.. ఉపసంహరించడం తెలియదు. అయినా తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఆ అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు.
ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో లోకాలన్నీ భయంకరమైన తేజస్సుతో నిండిపోయింది. దాంతో ముల్లోకాలకు ప్రాణాపాయం కలుగుతుందేమోనని అర్జునుడు భావిస్తాడు. అప్పుడు అర్జునుడు, శ్రీకృష్ణునివైపు చూసి.. ‘‘ఓ కృష్ణా! ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందో..? ఎలా వచ్చిందో..? అర్థం కావడం లేదు. దయచేసి తెలపుము’’ అని వినయంగా ప్రార్థిస్తాడు.
అప్పుడు కృష్ణుడు.. ‘‘ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావం వల్లే ఈ అగ్ని పుట్టింది. నీవల్ల తనకు హాని కలుగుతుందని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. కానీ అతనికి దీనికి ఎలా సంహరించాలో తెలియదు. కానీ నీకు తెలుసు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని మరొక బ్రహ్మాస్త్రంతోనే ఉపసంహరించబడుతుంది. ఏ అస్త్రమూ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించలేదు. నీకు బ్రహ్మాస్త్ర ఉపసంహారము తెలుసు కాబట్టి నువ్వు కూడా బ్రహ్మాస్త్రము ప్రయోగించి.. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు’’ అని అంటాడు.
అర్జునుడు తన మనస్సులో శ్రీకృష్ణుడిని స్మరించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో.. ముల్లోకాలలో ప్రళయం వచ్చినట్టు అగ్ని ప్రకాశించింది. జీవరాశులు నశించిపోతుండగా.. శ్రీకృష్ణుడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించాల్సిందిగా అర్జునుని ఆదేశించాడు. కృష్ణుని ఆజ్ఞమేరకు అర్జునుడు వాటిని ఉపసంహరించాడు. లోకాలన్నీ శాంతించాయి.
ఇది చూసిన అశ్వత్థామ నిస్సహాయంగా నిలబడిపోయాడు. అర్జునుడు కోపంతో అశ్వత్థామను తాళ్లతో కట్టిపడేశాడు. పాండవ శిబిరానికి తీసుకుని పోవడానికి అతనిని రథంలో పడేశాడు. అప్పుడు కృష్ణుడు.. ‘‘అర్జునా! ఏ పాపం తెలియని ద్రౌపది కుమారులను నిద్రపోతున్న సమయంలో ఈ అశ్వత్థామ దారుణంగా చంపాడు. ఇతని పాపం క్షమించరానిది కాబట్టి.. ముందు ఇతనిని చంపు. ధర్మరక్షణ గావించు. అంతేకాకుండా నువ్వు ద్రౌపదితో ఏమని ప్రతిజ్ఞ చేశావు? ఈ అశ్వత్థామను చంపి, ఇతని తలను కానుకగా ఇస్తానని చెప్పావు కదా! ఆ ప్రతిజ్ఞను చెల్లించవా? ఇతను చేసిన మారణహోమం, ఇతని గురువుకు కూడా ఇష్టం లేదు. కాబట్టి ఇతడిని చంపడమే మంచిది’’ అని ప్రేరేపించాడు.
కానీ అర్జునుడు అందుకు ఒప్పుకోలేదు. అశ్వత్థామను తన రథంలో పడేసి, పాండవ శిబిరానికి చేరుకున్నాడు. ద్రౌపదిముందు అతనిని పడేశాడు. దీనంగా నిలబడి వున్న అశ్వత్థామను చూసి ద్రౌపది అతనిని నమస్కరించింది. తన భటులతో.. ‘‘ఇతడు బ్రాహ్మణుడు. మనకందరికీ పూజనీయుడు. వెంటనే కట్లు విప్పండి’’ అని ఆదేశిస్తుంది. దాంతో భటులు ఆమె ఆజ్ఞమేరకు అశ్వత్థామ కట్లు విప్పారు.
అప్పుడు ద్రౌపది, అర్జునునితో.. ‘‘నాధా! ఈ అశ్వత్థామ తండ్రి ద్రోణుడు మీకందరికీ గురువు. ఆయన దగ్గరే మీరు శస్త్ర విద్యలు నేర్చుకున్నారు. ప్రస్తుతం మన ముందు దోషిగా నిలబడ్డ ఈ అశ్వత్థామ ఆయన తండ్రికి ప్రతిరూపం. ద్రోణుని భార్య స్త్రీ అవడంతో సహగమనం చేయలేదు. నా కుమారులను పోగొట్టుకుని నేను దు:ఖంలో వున్నాను. ఇప్పుడు ఈ అశ్వత్థామను చంపి మీ గురుపత్ని కృపిని కూడా నాలాగా పుత్రకోశం అనుభవించమంటారా? నాలా మరొక తల్లి పుత్రశోకం అనుభవించడం నాకిష్టంలేదు. మీరు నిగ్రహం లేకుండా, క్షణికావేశంతో ఈ అశ్వత్థామను చంపితే.. బ్రాహ్మణ వంశమంతా మనల్ని శపిస్తుంది. ఒక బ్రాహ్మణుని చంపిన పాపానికి క్షత్రియవంశం పూర్తిగా నాశనం అవుతుంది’’ అని పలుకుతుంది.
ద్రౌపది పలికిన మాటలకు ధర్మరాజుతోపాటు నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు, కృష్ణుడు, ఇంకా అక్కడికి చేరుకున్న స్త్రీలు, పురుషులు ఆమోదించారు. కానీ భీముడు మాత్రం ఆమోదించలేదు. కోపంతో భీముడు.. ‘‘ఈ దుర్మార్గుడు తనకుకానీ, తన ప్రభువైన సుయోధనునికికానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయినా.. అకారణ కోపంతో ద్రౌపదీ పుత్రులను దారుణంగా చంపాడు. ఇతనిని క్షమించకుండా చంపడమే మంచిది. లేకపోతే మనమందరం నరకానికి పోతాం’’ అని చెబుతాడు.
ఆ మాటలకు కృష్ణుడు, అర్జునునివైపు చూసి.. ‘‘అర్జునా! ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు ఎంతటి తప్పుచేసినా చంపకూడదు. కానీ ఇతడు బ్రాహ్మణుడు అయివుండి కూడా ధర్మాలను మరిచి, ద్రౌపదీ పుత్రులను వధించినందుకు ఇతను చంపదగినవాడని నీకు చెప్పాను. ఒకదానికిఒకటి వ్యతిరేకంగా నా మాటలను ధర్మశాస్త్రం ప్రకారం పరిశీలించు. అంతేకాదు.. ఈ అశ్వత్థామ తలను తెచ్చి కానుకగా ఇస్తానని ద్రౌపదికి మాటిచ్చావు. మరి ఆ మాట నెరవేర్చాలి కదా. ఇదేనా క్షత్రియ ధర్మం. కాబట్టి బ్రాహ్మణుని చంపకుండా, భీముని మాట నిలబెడుతూ.. ద్రౌపదికి ఇచ్చిన మాట నిలబెట్టుకో’’ అని నర్మగర్భంగా చెప్పాడు.
కృష్ణుని మాటలు విని అర్జునుడు కొద్దిసేపు ఆలోచించాడు. ఒక కత్తి తీసుకుని, అశ్వత్థామ దగ్గరకు వెళ్లాడు. అశ్వత్థామ పుట్టుకతోనే తలలో ఒక మణితో పుట్టాడు. అర్జునుడు కత్తి తీసుకుని, అతని తలమీదున్న మణిని వెంట్రుకలతో సహా కోసేశాడు. అది తీసుకువచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. భటులను పిలిపించి అశ్వత్థామను శిబిరంనుంచి వెళ్లగొట్టాడు.
అర్జునుడు అందరివైపు చూసి.. ‘‘కృష్ణుడు చెప్పినట్టు బ్రాహ్మణుడు హంతకుడైనా చంపడం తగదు. చంపడానికి ప్రత్యామ్నాయంగా అతని వద్ద వున్న ధనం, దేశం నుంచి బహిష్కరించడం చేయవచ్చు. ఇవి బ్రాహ్మణులకు శారీరక దండన.. అంటే మరణశిక్ష విధించడకుండా చేసే పనులు. కాబట్టి నేను అతని వెంట్రుకలు తీశాను. అతని వద్ద వున్న మణిని తీసుకున్నాను. అతనిని దేశంనుంచి వెళ్లగొట్టాను. ఇతనికి ప్రత్యామ్నాయ శిక్షలు విధించాను’’ అని చెబుతాడు.
అర్జునుని బుద్ధికుశలతకు అందరూ అతనిని మెచ్చుకున్నారు. తరువాత పాండవులు, ద్రౌపది యుద్ధంలో చనిపోయిన బంధుమిత్రులకు దహన కాండలు శాస్త్రోక్తంగా నిర్వర్తించారు.
ప్రథమస్కంధంలోని ఎనిమిదవ అధ్యాయం :
పాండవులు యుద్ధంలో మరణించిన వారందరికి ఉత్తర క్రియలు నిర్వహించిన తరువాత... పాండవులు, ద్రౌపది, ఇతర స్త్రీలు గంగాతీరానికి వెళ్లారు. అందరూ పవిత్ర గంగాజలంలో స్నానాలు చేసి, తర్పణాలు వదిలారు. ధర్మరాజు తన తమ్ముళ్లతో, తల్లి కుంతితో, ద్రౌపది సహా మిగతా భార్యలతో కలిసి గంగాతీరంలో కూర్చుని, జరిగిన మారణహోమం గురించి శోకిస్తున్నారు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా గాంధారిసహా మిగతా భార్యలతో తీరంలో కూర్చుని బాధపడుతుండగా.. శ్రీకృష్ణుడు వారి దగ్గరకు చేరుకుని, కాల మహిమ గురించి వివరిస్తూ.. ఓదార్చుతున్నాడు. అలా వారిని ఓదార్చి తిరిగి అందరూ హస్తినాపురానికి చేరుకుంటారు.
శ్రీకృష్ణుడు పాండవులతో మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు. ధర్మరాజు కీర్తిని నలువైపులా వ్యాపింపజేశాడు. వచ్చిన పని పూర్తయిందని శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. కృష్ణుని ప్రయాణం కోసం సన్నాహాలు పూర్తి అయ్యాయి. కృష్ణుడు, సాథ్యకి, ఉద్ధవునితో సహా రథం ఎక్కడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు విటరాజు కుమార్తె, పద్మవ్యూహంలో మరణించిన అభిమన్యుని భార్య ఉత్తర, పరిగెత్తుకుంటూ కృష్ణుని దగ్గరకు చేరుకుంటుంది.
అప్పుడు ఉత్తర.. ‘‘దేవా! నన్ను రక్షించు. ఈ లోకంలో వున్నవారంతా ఒకరికొకరు చంపుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నాకు అభయం ఇచ్చేవాడివి నువ్వొక్కడివే. ఓ కృష్ణా! బాగా మండుతున్న ఒక లోహబాణం నావైపు వస్తోంది. అది నన్ను కాల్చేస్తుందేమోనన్న భయంగా వుంది. నేను ఏమైనా ఫర్వాలేదు కానీ.. అభిమన్యుని తేజం నా గర్భంలో పెరుగుతోంది. దానిని రక్షించు. ఈ ఆపద నుంచి కాపాడి.. పాండవ వంశాన్ని కాపాడు’’ అని తన మనసులో వున్న బాధను బయటపెడుతూ.. ప్రార్థించుకుంటుంది.
ఆమె మాటలు విన్న కృష్ణుడు.. అది అశ్వత్థమ పని అని గ్రహిస్తాడు. ఎందుకంటే.. పాండవ వంశాన్ని నాశనం చేయడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు దానిని ఉపసంహరించాడు కానీ దాని ప్రభావం పోలేదు. పాండవులను నాశనం చేయడం కోసం ఆ బ్రహ్మాస్త్రం ఐదు అస్త్రాలుగా విభజించబడి.. పాండవులవైపు దూసుకు వస్తూ వుంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని నిలువరించడానికి పాండవులు తమ అస్త్రాలను చేతపట్టుకున్నారు. ఇంతలోనే కృష్ణుడు.. తన సుదర్శన చక్రాన్ని ఉపయోగంచి దానిని నిలువరించాడు.
తరువాత ఆ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది. ఉత్తర గర్భంలో వున్న శిశువును నాశనం చేయాలని ఆ బ్రహ్మాస్త్రం సంకల్పించింది. దీనిని గ్రహించిన కృష్ణుడు తన మాయతో ఉత్తర గర్భంలోకి ప్రవేశించి, శిశువును తన యోగమాయతో కప్పివేశాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం శిశివును కప్పివున్న విష్ణుతేజాన్ని చూసి శాంతించింది. ఆ విధంగా ఉత్తర గర్భంలో వున్న శిశువును శ్రీకృష్ణుడు రక్షించాడు.
తరువాత కృష్ణుడు ద్వారకకు వెళ్లడానికి సిద్ధం కాక.. పాండవుల తల్లీ కుంతి, కృష్ణునితో.. ‘‘ఓ కృష్ణా! సర్యాంతరామివి అయిన నీకు నమస్కారం. నాకు భక్తి అంటే ఏంటో తెలియదు. మాయతో కప్పబడి వున్నాను కనుక.. నువ్వు నాకు కనిపించవు. నువ్వు ఇంద్రియ జ్ఞానానికి అతీతుడివి. ఈ జగన్నాటకాన్ని తెరవెనుక వుండి నడిపిస్తున్నావు. దేహమే ప్రధానమని తెలిసి దేహం మీద అభిమానం పెంచుకున్న మానవులు నిన్ను చూడలేరు. నిన్ను నాలాంటి స్త్రీలు ఎలా చూడగలరు? మాకోసం అవతరించిన గోవిందా నీకు నమస్కారం.’’
‘‘నీ తల్లి అయిన దేవకీ దేవికి పెళ్లి అయినప్పటి నుంచి కంసుని కారాగారంలో బంధింపబడి, ఎన్నో బాధలు పడింది. అటువంటి తల్లిని నువ్వు చెరనుంచి రక్షించావు. అలాగే నాకు, నా కుమారులకు రక్షకుడిగా నిలిచావు. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా.. సమయానుకూలంగా నా కుమారులను వెన్నంటి వుండి కాపాడావు. ఇప్పుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేసి, పాండవ వంశాన్ని అంతం కాకుండా కాపాడావు’’.
‘‘ఓ కృష్ణా! ధనంలేని వాడికి నీమీదున్న భక్తియే వానికి పరమధనం. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. అందరికీ మోక్షం ప్రసాదించే నీకు నా నమస్కారాలు. నువ్వు ఆది, అంతం లేకుండా ఈ జగాన్ని పరిపాలించేవాడివి. ఈ విశ్వమంతా నీతో సృష్టించబడింది కాబట్టి నీకు అందరూ ఇష్టమైనవారే. మానవులు కష్టాలు వచ్చినప్పుడు నిన్ను తిడుతూ.. సుఖాలు వచ్చినప్పుడు నిన్న పొగుడుతూ వుంటారు. అయినా నువ్వు వారి మంచే కోరుతావు’’.
‘‘ఓ కృష్ణా! లోకకల్యాణం కోసం నువ్వు జన్మిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ.. నిజంగా నీకు జన్మంటూ లేదు. పుట్టుక, మరణాలు లేవు. మమ్మల్ని నీ దారిలో నడిపించడానికి సత్కర్మలు చేస్తుంటావు. నువ్వు అనేక రూపాలలో జన్మించి, ఎన్నో అద్భుతాలు చేశావు. ముఖ్యంగా కృష్ణుడిగా నీ లీలలు సమ్మోహనకరం. దేవకీ, వసుదేవులు పూర్వజన్మలో నిన్ను తమ కుమారుడిగా జన్మించమని కోరగా.. వారు మానవులుగా పుట్టి, నిన్ను పుత్రుడిగా కన్నారు’’.
‘‘నీకు మానవునిగా జన్మించే అవసరం లేకపోయినా.. లోకకల్యాణం కోసం, దుష్టసంహారం కోసం ఈ లోకంలో ఉద్ధరించావు. భూభారం ఎక్కువైనప్పుడు భూదేవి ప్రార్థించగా.. బ్రహ్మదేవుడు నిన్ను కృష్ణునిగా అవతరింపజేశాడని పెద్దలు చెబుతుంటారు. మరికొందరు ఏమంటారంటే.. మానవులు దేహాభిమానంతోనూ, అజ్ఞానంతోనూ సంసారంలో కొట్టుమిట్టాడుతుంటే.. వారిని భక్తిమార్గంలో నడిపించి, మోక్షం ప్రసాదించడానికి అవతరించావని అంటారు’’.
‘‘ఓ కృష్ణా! నా కుమారులైన పాండవులకు నువ్వే దిక్కు. వారికి నీ పాదపద్మాలు ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు. నిన్ను మా కన్నులముందు వుంచుకుని తృప్తిపడాలనుకునే మాకు నీ దర్శనభాగ్యం కలిగించకుండా పోవడం భావ్యమా? నిన్ను చూడకుండా పాండవులు, యాదవులు జీవించడంలో ప్రయోజనం లేదు. ఎలా అంటే..మానవునిలో ఇంద్రియాలను జీవాత్మం శాసిస్తుంది. ఆ జీవాత్మే లేకున్నప్పుడు ఇంద్రియాలు జడపదార్థాలు అవుతాయి’’.
‘‘మాతో పాలించబడ్డ నీ కురుసామ్రాజ్యం నీ స్పర్శత పునీతమయింది. నువ్వు ద్వారకకు వెళ్తే దీనిని మళ్లీ ఎవరు పునీతం చేస్తారు. నీ చూపు పడితే చాలు.. వానలు కురిసి, పంటలు పుష్కలంగా పండుతాయి. ఓషధులు వృద్ధి చెందుతాయి. అలాంటివాడివైన నువ్వు ఈ కురుసామ్రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతే వృద్ధి ఎలా చెందుతుంది?’’
‘‘కృష్ణా! నాలో, పాండవులలో ప్రేమబంధాలు, రాగద్వేషాలు ఎలా వృద్ధి చెందుతాయో.. నీ కరుణతో వాటిని ఛేదించు. నా మనస్సు నిరంతరం నీమీదే లగ్నం అయ్యేట్టు మంచి బుద్ధిని ప్రసాదించు. ఓ అర్జున సఖా! దుష్టులు, భూమికి భారంగా పరిణమించిన క్షత్రియ వంశాలను దహించిన వాడవి. గోబ్రాహ్మణులను దు:ఖాలను తొలగించడానికి అవతరించిన యోగేశ్వరా! నీకు నమస్కారము’’ అని కుంతీ కృష్ణునితో ప్రార్థిస్తుంది.
ఇదంతా విన్న కృష్ణుడు.. తన మాయతో ఆమెను సమ్మోహితురాలిగా చేశాడు. ఆమె చూసి నవ్వుతూ.. ‘‘తథాస్తు! నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి’’ అని అంటాడు. తరువాత ద్వారకకు వెళ్లడానికి రథం ఎక్కబోతుండగా.. ధర్మరాజు అక్కడికి చేరి.. మరికొంతకాలం వరకు హస్తినాపురంలోనే వుండి వెళ్లండని ప్రార్థిస్తాడు. అంతకుముందు ధర్మరాజు యుద్ధంలో తన బంధుమిత్రులను అకారణంగా చంపిన పాపాన్ని మర్చిపోలేకుండా వున్నాడు.
శ్రీకృష్నుడు ద్వారకకు వెళ్లే సమయంలో అక్కడున్న వారిని చూసి ధర్మరాజు ఇలా అంటాడు.. ‘‘నేను అజ్ఞానంధకారంలో వుండి రాజ్యభోగాల కోసం నా తండ్రులను, తాతలను, బంధుమిత్రులను చంపుకున్న దుష్టుడిని. చచ్చిన తరువాత నక్కలకు, కుక్కలకు ఆహారం అయ్యే ఈ శరీరంకోసం అక్షౌహిణిల సైన్యాలను వధించాను. దాంతో బాలురు, వృద్ధులు, స్త్రీలు అనాధలు అయ్యారు. కోట్ల సంవత్సరాలవరకు నరకంలో వున్నా.. ఈ పాపం పోదు’’.
‘‘యుద్ధంలో శత్రువులను చంపడం క్షాత్రధర్మం అని సమర్థించుకోవచ్చు కానీ.. ఈ మారణహోమం ద్వారా నాకు లభించిన రాజ్యసుఖాలు ఏమాత్రం సంతోషం కలిగించడం లేదు. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఈ పాపం పోదు’’ అని చింతిస్తూ ధర్మరాజు తన మనసులో వున్న మానసిక ఒత్తిడిని వెల్లడించాడు’’ అంటూ.. సూతపౌరాణికుడు, శౌనకాది మహామునులకు భాగవతం వినిపించాడు.
ప్రథమస్కందంలోని తొమ్మిదవ అధ్యాయం :
దు:ఖిస్తున్న ధర్మరాజును చూసి కృష్ణుడు తన ద్వారక ప్రయాణాన్ని కొన్నిరోజులవరకు ఆపేస్తాడు. పాండవులను అంపశయ్యమీద వున్న భీష్ముని దగ్గరకు వెళతాడు. వారి వెంట వ్యాసుడు, ధౌమ్యుడు, మిగతా బ్రాహ్మణులందరూ తమతమ వాహనాలలో వెళ్లారు. అలాగే పర్వతుడు, నారదుడు, బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, వశిష్టుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్సమదుడు, గౌతముడు, కౌశికుడు, సుదర్శునుడు మొదలైన మహామునులు కూడా భీష్ముని వద్దకు చేరుకున్నారు.
ఇలా అందరూ అక్కడికి చేరుకున్న తరువాత భీష్మునుని చూసి నమస్కరించారు. భీష్ముడు, కృష్ణుడిని చూసి భక్తితో గౌరవించి, పూజ చేశాడు. తన సమీపంలో కూర్చున్న మనుమలు, పాండవులను చూసి ప్రేమతో.. ‘‘మీరు గోవులను, బ్రాహ్మణులను, శ్రీకృష్ణునుని నిత్యం పూజిస్తున్నారు. మీరు కష్టాలు పడటానికి యోగ్యులు కారు. మీరు పసివారుగా వుండగానే మీ తండ్రి పాండురాజు కాలధర్మం చెందారు. మిమ్మల్ని పెంచి, పెద్ద చేయడానికి మీ తల్లి కుంతి ఎంతో కష్టపడింది. చిన్నతనంలో మీరు పడ్డకష్టాలు కాలానుగుణంగా సంభవించినవి. అసలు మీరు పడ్డ కష్టాలు కష్టాలే కావు. ఎందుకంటే.. తమతమ ధర్మాలలో మహాబలవంతులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు వున్నచోట కష్టాలు వుండవు. ఎప్పుడు, ఏమి జరుగుతుందో ఆ ఈశ్వరునికి తప్ప ఎవ్వరికి తెలియదు. అనుభవించడమే మన కర్తవ్యం. ఆ సత్యాన్ని గుర్తించి, నీ ప్రజలను పాలించు. ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి నువ్వే సమర్థుడివి’’.
‘‘శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆ భగవతావరతారం. శివుడు, నారదుడు, కపిలుడు మొదలైన మహాఋషులకు తప్ప.. ఇతని మహిమ గురించి తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒకరితో ఇష్టంగా వుండి, మరొకరితో అయిష్టంగా వుండే భేధభావం లేనివాడు. అంపశయ్య మీద పడుండి, దినాలను లెక్కపెట్టుకుంటున్న ఈ అభాగుడ్ని చూడానికి తానే స్వయంగా నా దగ్గరకు వచ్చి.. నాకు దివ్యదర్శనం కలిగించాడు. శ్రీకృష్ణుడిని మనస్సుతో కొలిచినవాడికి ఇహలోక కర్మబంధాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎప్పుడూ భక్తుల మనస్సులో నివసించేవాడు. నేను ప్రాణాలు విడిచేదాకా నా ఎదుటే వుండి, తన జగన్మోహనాకారంతో నాకు కనువిందు చేస్తాడని అనుకుంటున్నాను’’ అని భక్తితో శ్రీకృష్ణుడిని నమస్కరిస్తాడు.
తరువాత ధర్మరాజు, భీష్మపితామహునిని కొన్ని సందేహాలను అడిగాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు.. ధర్మార్థకాయ మోక్షాలగురించి, సామ-దాన-భేద-దండోపాయల గురించి, వాటిని సాధించే ఉపాయాల గురించి ఇతిహాసాలు చెప్పాడు. ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. భీష్ముడు మౌనవ్రతం వహించాడు. తనకు ఎదురుగా వున్న శ్రీకృష్ణుడిని చూసి.. తన మనస్సును శ్రీకృష్ణుని మీద లగ్నం చేశాడు. శ్రీకృష్ణుని కృపాకటాక్షవీక్షణాలు తనమీద ప్రసరించడంతో.. భీష్మునికి తన శరీరంలో గుచ్చుకున్న బాణాలవల్ల కలిగే బాధ తొలగిపోయింది. భీష్ముడు తన శరీరం విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని తెలుసుకుని.. శ్రీకృష్ణునికి ఇలా ధ్యానం చేస్తాడు...
‘‘ఈ సృష్టికి కారణమయిన శ్రీకృష్ణునికి నా మనస్సును అర్పిస్తున్నాను. యుద్ధభూమిలో అన్నివైపులా దుమ్ముమొహం, రక్తసిక్తంతో నిండిపోగా.. సౌందర్యంతో ప్రకాశిస్తున్న శ్రీకృష్ణుని నేను ధ్యానిస్తున్నాను. ఆయుధం పట్టను, యుద్ధం చేయను అని అర్జునునికి ఇచ్చిన మాటను తప్పి.. తన చేతిలో రథచక్రం ధరించి, ‘‘ఈరోజు భీష్మునుని చంపి నిన్ను రక్షిస్తాను’’ అని నా మీదకు వస్తున్న ఆ శ్రీకృష్ణుడే నాకు దిక్కు. యుద్ధంలో చనపోయిన సైనికులకు తన దర్శనంతో ముక్తిని ప్రసాదించిన కృష్ణుడు.. నాకు ముక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నేను ఎటువంటి భేదభావం లేకుండా ఆ శ్రీకృష్ణునికి శరను కోరుకుంటున్నాను’’ అని తన నిర్మలమైన మనస్సుతో.. శ్రీకృష్ణుడిని ధ్యానించాడు భీష్ముడు.
తరువాత భీష్ముడు తన ఇంద్రియ వృత్తులను నిరోధించి, ప్రాణాలను వదిలేశాడు. భీష్ముడు పరబ్రహ్మలో కలవడం ప్రత్యక్షంగా చూసినవారు ధన్యులయ్యారు. దేవతలు భీష్ముని మీద పుష్పవృష్టి కురిపించారు. తరువాత ధర్మరాజు భీష్ముని పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు. అక్కడికి చేరుకున్న మునులు, ఋషులు.. శ్రీకృష్ణునిని స్తుతించారు. తరువాత అందరూ తమతమ ఆశ్రమాలకు వెళ్లిపోయారు. ధర్మరాజు తన తమ్ముళ్లతో హస్తినాపురానికి చేరుకున్నాడు. తరువాత ధృతరాష్ట్రుని అనుమతితో, శ్రీకృష్ణుని ఆశీస్సులతో ధర్మరాజు హస్తినాపుర రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Nov 13 | రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు.... Read more
Oct 08 | పూర్వం జీమూతకేతువు అనే చక్రవర్తికి ‘జీమూతవాహనుడు’ అనే కుమారుడు వుండేవాడు. ఇతను చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజలు, అన్నిప్రాణుల పట్లా ఎంతో కారుణ్యంతో ఉండేవాడు. రాకుమారుడు అయినప్పటికీ అతనితో అహంకారం వుండేది కాదు. ఇటువంటి... Read more
Jul 03 | అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన మహాభారతంలో ప్రచురించబడింది. ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే... మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి... Read more
Jun 14 | పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు. 1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)3. శ్రుతకర్ముడు - (అర్జునుని... Read more
Jun 10 | సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో... Read more