సినీనటులు ఎవరో.. ఎక్కడుంటారో.. ఎలా నటిస్తారో.. ఎలా సినిమాలను తీస్తారో.. అన్న విషయాలపై కూడా అవగాహనా రాహిత్యం అలుముకున్న రోజుల్లో.. సినీ నటుడు అంటే ఎన్టీ రామారావే.. అంతేకాదు రాముడైనా ఆయనే.. కృష్ణుడైనా ఆయనే.. అనేలా సినీనటుడి నుంచి ఆరాధ్యనటుడిగా, దేవుడిగా మారి ప్రజలను ఆయన శ్రీరామ, శ్రీకృష్ణ, పరమేశ్వర పాత్రల చిత్రపటాలనే దేవుడి పటాలుగా పెట్టి మరీ పూజించిన విధానాని చూచి, చల్లించిపోయిన నందమూరి తారాక రామారావు.. తనపై ఇంతగా ప్రేమపెంచుకున్న ప్రజల జీవన స్థితిగతుల్లో.. విధానాల్లో మార్పు తీసుకురావాలని రాజకీయ అరంగ్రేటం చేసి.. వారిని హృదయాలను ఎలా గెలుచుకున్నారో.. ఎలాంటి అటుపోట్లకు గురయ్యారో.. రాజకీయ చదంరంగంలో తిమింగళాలను ఎలా ఎదర్కోన్నారో చూపిన చిత్రమే ఎన్టీఆర్ మహానాయకుడు.
విశ్లేషణ
సినీరంగంలో తిరుగులేని హీరోగా నటిస్తున్నక్రమంలోనే జనం తనపై పెట్టుకన్న ఆశలు, ఆరాధనను చూసిన నటుడు.. తన ప్రజల కోసం నాయకుడిగా మారాలనుకున్నాడు. అందుకు అప్పట్లో జరిగిన పలు సంఘటనలు కూడా కారణమనే చెప్పాలి. ఇలా తాను తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడం.. జెండాను, ఎజెండాను రూపొందించడం.. పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే అధికారంలోకి రావడం.. ఇది అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ సంచలనాత్మకమైన విషయమే. ఏ రాజకీయ పార్టీ సాధించని ఘనత అది. టీడీపీ అవిర్భాం సన్నివేశంతో `యన్.టి.ఆర్ మహానాయకుడు` స్టార్ట్ అయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ప్రజల్ని పార్టీలు పట్టించుకోకపోవడం.. ఢిల్లీ నుండి వచ్చే సీల్డు కవర్ ముఖ్యమంత్రిని నిర్ణయించడం.. ఇక్కడి ప్రజలకు ఏమైనా చేయాలంటే నేతలు ఏకంగా హస్తినకెళ్లి అక్కడి నుంచి అనుమతిని పొందాల్సిన పరిస్థితులు వుండటం.. ఇలాంటివన్నీ చూసిన ఎన్టీఆర్ చైతన్యరథంను సిద్ధం చేసుకుని.. దానిపై ప్రత్యక్షంగా ప్రజలను కలసి టీడీపీ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ అని నినదించడంతో అసలు కథ ప్రారంభం అమవుతుంది. తిరుగులేని ఆధిక్యతతో విజయాన్ని సాధిస్తారు. వ్యవస్థలోని లంచం, అవినీతిని రూపుమాపే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు.
అవినీతి అన్నది అసలు వుండనేకూడదన్న ఉద్దేశ్యం తన పార్టీకి చెందిన వారిపై కూడా అధికారులతో దాడులు చేయించడం వంటి పనులు చేశారు. దీని వల్ల ఎమ్మెల్యేల్లో కాస్త అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో తన సతీమణి బసవ తారకంకు క్యాన్సర్ ఉందని తెలియడం.. ఆమె చికిత్సతో పాటు.. ఎన్టీఆర్ తన గుండె ఆపరేషన్ కోసం ఆయన భార్యతో కలిసి అమెరికా వెళతారు. అదునుగా భావించిన నాదెండ్ల భాస్కర్రావు, ఎమ్మెల్యేలు వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాస్తారు. దాంతో పాటు సంతకాలు కూడా చేస్తారు.
ఇదే అవకాశంగా భావించిన.. భాస్కర్ రావు లేఖను అవిశ్వాస తీర్మానంగా మార్చేసి ముఖ్యమంత్రి అయిపోతారు. హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని ఎలా దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి ఎలా అయ్యారనేది చూపించారు. ఈ మధ్యలో నారా చంద్రబాబు తెలుగుదేశంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు. ఆగస్ట్ సంక్షోభంలో చంద్రబాబు, ఎన్టీఆర్ కు ఎలా వెన్నుదన్నుగా నిలిచారనే అంశాలను ఈ రెండో భాగంలో చూపించారు. ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం క్యాన్సర్ కారణంగా శివైక్యం కావడంతో సినిమా ముగుస్తుంది.
నటీనటుల విషాయానికి వస్తే..
ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో పూర్తిగా ఒదిగిపోయారు. తండ్రిలా నటించే అవకాశం తనయుడికి రావడం అదృష్టమే అయినా.. హావ భావాల ప్రదర్శనలో, సంభాషణలు పలికే విధానంలోనూ సమతూకం పాటించాడు. రాజకీయ నాయకుడిగా, భర్తగా ఆయన పాత్రలో రెండు పార్శ్వాలుంటాయి. రెండు చోట్లా.. బాలయ్య రెండు రకాలుగా కనిపిస్తాడు. విద్యాబాలన్ పాత్ర మొత్తం భావోద్వేగాల భరితంగా సాగింది. ఆమె నటన బసవతారకం పాత్రకు మరింత వన్నె తెచ్చింది.
ఇక చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటన ఆకట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు బాడీ లాంగ్వేజ్ని రానా పుణికి పుచ్చుకున్నాడు. కొన్ని పదాల్ని చంద్రబాబు ఎలా పలుకుతారో మనందరికీ తెలుసు. రానా కూడా అదే విధంగా పలికడం చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏఎన్నార్ గా సుమంత్ ని ఒకే ఒక్క సన్నివేశానికి పరిమితం చేశారు. హరికృష్ణ పాత్రలో మెరిసిన కల్యాణ్ రామ్ కూడా అక్కడక్కడ కనిపిస్తాడంతే.
టెక్నికల్ అంశాలకు వస్తే..
సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు చాలా ఉన్నతస్థాయిలో వున్నాయి. దర్శకత్వానికి కూడా ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. దర్శకుడు క్రిష్ ప్రతి సన్నివేశాన్ని చక్కగా రూపోందించారు. చిత్రంలోని పాత్రాల్ని మలుచుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా సన్నివేశాలకు అనుగుణంగా చక్కటి డైలాగ్స్ రాశారు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని అందించారు.
అసలు ఎన్టీఆర్, బసవ తారకం పెరిగి పెద్దవాళ్లుగా మారి.. పెళ్లి చేసుకునే క్రమాన్ని రామన్న కథ.. పాట రూపంలోచూపించారు. అలాగే ఇక మరో సాంగ్ చైతన్య రథం సాంగ్ తెలుగువాడి గుర్తింపు ప్రశ్నించేలా సాగుతుంది. ఇక ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ఎందుకు వేసుకునేవారు? అనే దానికి వివరణ ఇస్తూ సన్నివేశాలను బలంగా రాశారు. దానికి తగిన విధంగా రుషివో, రాజర్షివో పాట కూడా ఉంటుంది. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది.
తీర్పు..
తనను ఆరాధించి.. అభిమానించిన ప్రజలకోసం తానేం చేశాడో.. రాముడు తారకరాముడిగా ఎందుకు మారాడో చూపిన చిత్రం.. అయితే ఆ రాముడి తుది మజిలీ వరకు కాకుండా.. కేవలం అధికారాన్ని తిరిగి పోందిన వరకు మాత్రమే వుండటం వెలితిగా మిగిలింది. తెలుగోడి వాడి వేడిని చూపిన భావోద్వేగాల చిత్రం..
చివరగా... చివరగా.. అర్థాంగిని విస్మరించని.. ప్రజలను వదులుకోని ఓ మహానాయకుడి కథ